ఎదులాపురం, ఫిబ్రవరి 11 : మారుమూల గిరిజన ప్రాంతాల్లోని మహిళలకు వారి స్థానిక భాషలో అర్థమయ్యేలా గృహహింసా నిరోధంపై విస్తృత అవగాహన కల్పించాలని సఖీ కేంద్రం నిర్వాహకులకు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ సూచించారు. నూతన భవనంలోకి మార్చిన సఖి కేంద్రాన్ని శుక్రవారం ఆమె సందర్శించారు. వివిధ విభాగాలను పరిశీలించారు. బాధిత మహిళలకు అందిస్తున్న సౌకర్యాలు, కౌన్సెలింగ్, తదితర అంశాలకు సంబంధించిన వివరాలను లీగల్ కౌన్సిలర్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలోని ముఖ్యంగా నార్నూర్, గాదిగూడా మండలాల్లోని గ్రామాల్లో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఫోక్సో, బాల్య వివాహాలు, వరకట్న వేధింపులు తదితర అంశాలపై వివరించాలని సూచించారు. సఖి కేంద్రం చేపడుతున్న కార్యక్రమాలను ప్రభుత్వ అధికారులు, సిబ్బందికి సమావేశాల సందర్భంలో తెలియజేయాలన్నారు. అనంతరం కేంద్రంలోని రిజిస్టర్లను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో లీగల్ కౌన్సిలర్ సంఘమిత్ర, సఖీ కేంద్ర సిబ్బంది ఉన్నారు.
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను కలెక్టర్ తనిఖీ చేశారు. పాఠశాలలోని సమస్యలను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. తరగతి గదులు, మరుగుదొడ్లను పరిశీలించారు. అనంతరం మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించి, అక్కడే విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మౌలిక వసతుల కల్పనకు ఏర్పాటు చేయాలని అధికారులకు సూచించారు. మరుగుదొడ్లు, నీటి సరఫరాలను తక్షణమే ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని నాలుగైదు రోజుల్లో పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ శైలజను ఆదేశించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట డీఈవో టామ్నె ప్రణీత, డీవైఎస్వో వెంకటేశ్వర్లు, పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.