ఉట్నూర్ : గిరిజనులు సాగుచేసుకుంటున్న పోడు భూముల సమస్యలను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక అధికారుల బృందం సభ్యులు ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్లో పర్యటించారు. రాష్ట్ర అటవీశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ శాంతికుమారి, సీసీసీఎఫ్ శోభ, గిరిజన సంక్షేమశాఖ కమిషనర్ క్రిస్టినా జడ్ చోంగ్తూ గురువారం ఏజెన్సీ కేంద్రమైన ఉట్నూర్లో పర్యటించి నాలుగు జిల్లాల కలెక్టర్లు, అటవిశాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఏజెన్సీలో పోడు భూముల సమస్య ఎలా ఉంది, అటవి భూములను కాపాడేందుకు అధికారులు తీసుకుంటున్న చర్యలు, జిల్లాల వారీగా ఆర్వోఎఫ్ఆర్ పట్టాల వివరాలు సేకరించారు.
2005 సంవత్సరం కంటే ముందు సాగైన పోడు భూముల వివరాలు తెలుసుకున్నారు. క్షేత్రస్థాయిలో ఎలాంటి సమస్యలు ఉన్యాయి. వాటి పరిష్కారానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు అన్న అంశాలపై చర్చించినట్లు సమాచారం. కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ సిక్తాపట్నాయక్, ఐటీడీఏ పీవో భవేశ్మిశ్రా, ఉమ్మడి జిల్లాల కలెక్టర్లు, అటవిశాఖ అధికారులు, ఐటీడీఏ అధికారులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పొడు భూముల విషయంలో పలువురు రైతులు వినతి పత్రాలను అందజేశారు.