వాంకిడి, ఫిబ్రవరి 29 : రోడ్డు నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం ఖమాన గ్రామస్తులు గురువారం ఆందోళనకు దిగారు. రోడ్డుకు అడ్డంగా ఎడ్లబండ్లు, ముండ్ల కంపలు వేసి ధర్నా చేశారు. వాంకిడి మండల కేంద్రంలో ఖమాన అండర్ పాస్ బ్రిడ్జి నుంచి ఖమాన గ్రామం వరకు రోడ్డు నిర్మాణం కోసం రూ.1.50 కోట్లు మంజూరయ్యాయని, రెండేళ్ల క్రితం రోడ్డు పనులు ప్రారంభించిన కాంట్రాక్టర్ ఇప్పటికీ పూర్తి చేయలేదని మండిపడ్డారు.
అధికారులు, ప్రజాప్రతినిధులతో ఫోన్ చేయించినా.. రేపు.. మాపు అంటూ కాలయప చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డంతా తవ్వి.. కంకర పోయడం వల్ల వాహనాలు అదుపుతప్పి పడిపోతున్నాయని, ఇప్పటికే పలువురు గాయపడ్డారని చెప్పుకొచ్చారు. సూల్కు వెళ్లే విద్యార్థులు, వృద్దులు రోడ్డుపై ప్రయాణించేందుకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వాంకిడి డిప్యూటీ తహసీల్దార్ శ్రావణ్, వాంకిడి సీఐ శ్రీనివాస్ అక్కడికి చేరుకొని ఐదు రోజుల్లో రోడ్డు పనులు చేపట్టేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు.