నిర్మల్ టౌన్, సెప్టెంబర్ 8 : దేశవ్యాప్తంగా పంచాయతీలకు ఏటా ఇచ్చే అవార్డులకు నిర్మల్ జిల్లాలోని పంచాయతీలు పోటీ పడాలని కలెక్టర్ ఫారూఖీ అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో జాతీయ పంచాయతీ అవార్డు కార్యాచరణపై జిల్లా అధికారులతో గురువారం సమావేశమై మాట్లాడారు. జిల్లాలో 396 పంచాయతీలు ఈ పోటీలో పాల్గొనాలని కోరారు. 9 కేటగిరిలో అవార్డుల ఎంపిక ఉంటుందని వెల్లడించారు. గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో పోటీ లు ఉంటాయని తెలిపారు. విజేతలకు ఏప్రిల్ 24న అవార్డులను కేంద్ర ప్రభుత్వం అందజేస్తుందన్నారు. గ్రామాల్లో జీవనోపాధి, నీటి సమృద్ధి, పచ్చదనం, పరిశుభ్రత, సామాజిక భద్రత, మౌలిక సదుపాయాలు, మంచి పరిపాలన తదితర అంశాల్లో పోటీలుంటాయని వివరించారు. ఈనెల 10 నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుందని, 30న ముగుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ హేమంత్ బోర్కడే, జడ్పీ సీఈవో సుధీర్కుమార్, జిల్లా పంచాయతీ అధికారి శ్రీలత, డీఆర్డీవో విజయలక్ష్మి, డీసీవో శ్రీనివాస్రెడ్డి, పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య, వ్యవసాయశాఖ అధికారి అంజిప్రసాద్, సీపీవో మల్లికార్జున్, జిల్లా వైద్యాధికారి ధన్రాజ్ పాల్గొన్నారు.
సమన్వయంతో కృషి చేయాలి
ఎదులాపురం, సెప్టెంబర్ 8 : జాతీయ పంచాయతీ అవార్డు-2023 సాధనకు ప్రభుత్వ శాఖల సమన్వయంతో కృషి చేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో జాతీయ పంచాయతీ అవార్డు-2023పై వివిధ శాఖల అధికారులు, సిబ్బందికి గురువారం అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడారు. జిల్లాలోని 468 పంచాయతీల్లో సాధించిన ప్రగతి, చేపడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై నివేదికలను ఆయా శాఖల సమన్వయంతో ఆన్లైన్లో పొందు పరచాలన్నారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాలు, పేదరిక నిర్మూలన, ఉపాధిహామీ, ప్రజల ఆర్థిక స్థితిగతులు పెంపొందించడం, మౌలిక సదుపాయాలు కల్పించడం ఆరోగ్య స్థితిగతులు మెరుగుపరచడం, పౌష్టికాహారం అందించడం వంటి అంశాల్లో పోటీలు ఉంటాయని వివరించారు. ఆయా ప్రగతి నివేదికలకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు, నివేదికలు ప్రశ్నావళి ఆధారంగా జోడించాలన్నారు. 9 మంది జిల్లా స్థాయి అధికారులు హైదరాబాద్లో నిర్వహించిన శిక్షణ కార్యక్రమానికి వెళ్లి వచ్చారని తెలిపారు. అక్కడ తెలిపిన అంశాలపై మండల స్థాయిలో అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేసి పంచాయతీ కార్యదర్శులు, సర్పంచ్లకు వివరించాలని సూచించారు. ట్రైనీ అసిస్టెం ట్ కలెక్టర్ పీ శ్రీజ, జడ్పీసీఈవో గణపతి, డీపీవో శ్రీనివాస్, డీఆర్డీఏ కిషన్, డీడబ్ల్యూవో మిల్కా, డీఎంహెచ్వో డాక్టర్ నరేందర్ రాథోడ్, డీఈవో ప్రణీత, డీబీసీడీవో రాజలింగం, డీఎస్వో సుదర్శనం, ఈడీఎం రవి, అదనపు డీఆర్డీవో రవీందర్ రాథోడ్, వివిధ శాఖల అధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు పాల్గొన్నారు.