నార్నూర్ : గ్రామాల వికాసమే ప్రభుత్వ లక్ష్యమని( Village Development ) ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా ( Collector Rajarshi Shah) అన్నారు. జిల్లాలోని నార్నూర్ మండలం కొత్తపల్లి (హెచ్) గ్రామంలో సర్పంచ్ చౌహన్ దిగంబర్ అధ్యక్షతన సోమవారం ప్రత్యేక గ్రామ సభను నిర్వహించారు. ఈ గ్రామ సభకు కలెక్టర్ ముఖ్య అతిథి హాజరై మాట్లాడారు.
ప్రత్యేక గ్రామ సభల ద్వారా సమస్యలు తెలుసుకుని దశలవారీగా పరిష్కారానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు. వానాకాలం ప్రారంభం కావడంతో పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి పెట్టాలని, శుభ్రతతో సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రైవేటు పాఠశాలకు పంపించకుండా, ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పించాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యతోపాటు సౌకర్యాలు కల్పిస్తున్నామని వివరించారు.
రైతులు వ్యవసాయ శాఖ అధికారుల సలహా సూచనలు తప్పనిసరిగా పాటించాల న్నారు.అంగన్వాడీ కేంద్రం వద్ద నూతనంగా నిర్మించిన మరుగుదొడ్డి, ఇందిరమ్మ ఇంటిని ప్రారంభించారు.ఈ సమావేశంలో ఉట్నూర్ ఆర్డీవో మోహన్ సింగ్,డీఎల్పీవో ప్రభాకర్, ఏడీ శ్రీధర్ స్వామి, తహసీల్దార్ జాడి రాజా లింగం, ఎంపీడీవో పూల్లారావ్, డీఈ శ్రీనివాస్, వైద్యాధికారి జితేందర్ రెడ్డి, మండల వ్యవసాయ అధికారి ఆకాష్, పంచాయతీ కార్యదర్శి మనోజ్, ఆయా శాఖల అధికారులు,సిబ్బంది పాల్గొన్నారు.