ఎదులాపురం, మార్చి 28 : జిల్లాలో ఇండ్ల స్థలాల సరిహద్దులను గుర్తించి లే అవుట్ ప్లాట్లను చేపట్టాలని కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో తహసీల్దార్లు, రెవెన్యూ అధికారులతో ఇండ్ల స్థలాల పట్టాలు, ప్రజావాణి అర్జీల పెండింగ్, ధరణి, కోర్డు కేసులు, మీ సేవ దరఖాస్తుల పెండింగ్ అంశాలపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని పలు మండలాల పరిధిలో ఇండ్ల స్థలాల భూములను గుర్తించామని, ఆయా భూముల సరిహద్దులను గుర్తించి ప్లాట్లను గతం ఇచ్చిన ఇండ్ల స్థలాలు, డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాల విస్తీర్ణం గాని ప్లాట్లను సర్వేయర్లతో నిర్వహించాలన్నారు. ప్రజావాణిపై సమీక్షిస్తూ గ్రామాల్లోని సమస్యలు మండల స్థాయిలో పరిష్కరించాలని సూచించారు. వివిధ మాడ్యూల్లో ధరణి పోర్టల్లో మీ సేవ కేంద్రాల ద్వారా సమస్యకు సంబంధించి దరఖాస్తు చేసుకునే విధంగా తెలియపర్చాలన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి కోర్టుకు వెళ్ళుటకు సూచించాలని తెలిపారు. ప్రాజెక్టు అధికారి కోర్టు నుంచి తహసీల్దార్లకు సమాచారం కోసం వచ్చే లేఖలను నిర్దిష్ట సమయంలో సమాచారాన్ని సమర్పించాలన్నారు. కుల, ఆదాయ, కుటుంబ సభ్యుల, నివాస, ఆర్థికంగా వెనుకబడిన ధృవీకరణ పత్రాలు వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, ఆర్డీవో రాథోడ్ రమేశ్, ఇన్చార్జి డీఆర్వో అరవింద్కుమార్, జిల్లా మేనేజర్ రవి, పాల్గొన్నారు.
సత్వర నిర్ణయాలు తీసుకొని సకాలంలో సేవలందించాలి
ప్రకృతి వైపరీత్యాల నేపథ్యంలో జాతీయ విపత్తు ప్రతి స్పందన దళాల సత్వర నిర్ణయాలు తీసుకొని సకాలంలో సేవలందించాలని కలెక్టర్ రాహుల్రాజ్ అన్నారు. కలెక్టరేట్లో ఎన్డీఆర్ఎఫ్ బృందంతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలు సంభవించే తరుణంలో ఎన్డీఆర్ఎఫ్ బృందం వెంటనే స్పందించి సకాలంలో సహాయ పునరావాస చర్యలు చేపట్టాలన్నారు. వానకాలంలో లోతట్టు ప్రాంతాలు జలమయమై చెరువులు, కుంటలు తెగిపోయే ప్రమాదం ఉన్నందున, సమీప గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాల సహకారం అవసరమన్నారు. రవాణాకు అత్యాధునికమైన వాహనాలు సమకూర్చుకోవాలన్నారు. స్థానిక సంస్థల కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మాట్లాడుతూ.
లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంటుందని, ఆ ప్రాంత ప్రజల ప్రాణాలు కాపాడడం, సురక్షిత ప్రాంతాలకు తరలించడం పునరావాస కార్యక్రమాలు చేపట్టడం వంటివి వెంటనే తీసుకోవాల్సిన చర్యలు ఉంటాయన్నారు. అంతకుముందు ఎన్డీఆర్ఎఫ్ టీం కమాండర్ సుజీత్రోప్ మాట్లాడుతూ జిల్లాలో పలు ప్రాంతాలను పరిశీలించి ప్రజలు , విద్యార్థులకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించామని, ఈ నెల 23వ తేదీ నుంచి వారం రోజుల పాటు జిల్లాలో లోతట్టు, నీటి పరివాహక ప్రాంతాలను పరిశీలించామని తెలిపారు. సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్ నటరాజ్, ట్రైనీ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీజ, డీపీవో శ్రీనివాస్, సీపీవో వెంకటరమణ, ఆర్డీవో రమేశ్, అదనపు ఎస్పీ శ్రీనివాసరావు, అగ్నిమాపక, స్వచ్ఛంద సంస్థలు, బేల, ఆదిలాబాద్,రూరల్ మండలాల తహసీల్దార్లు, ఎన్డీఆర్ఎఫ్ బృందం సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.