సోమ : గోధుమ రవ్వ ఉప్మా
మంగళ : బియ్యం రవ్వ కిచిడీ
బుధ : బాంబే రవ్వ కిచిడీ
గురు : రవ్వ పొంగల్
శుక్ర : మిల్లెట్ రవ్వ కిచిడీ
శని : గోధుమరవ్వ కిచిడీ
సర్కారు బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి మెరుగైన విద్యనందిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం, నిరుపేద విద్యార్థుల కడుపు నింపేందుకు మరో పథకాన్ని తీసుకొస్తున్నది. ప్రభుత్వ, ఎయిడెడ్, మోడల్ పాఠశాలలతో పాటు మదర్సాల్లోనూ ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ అమలుకు శ్రీకారం చుట్టబోతున్నది. వచ్చే నెల 24న దసరా పండుగ కానుకగా ప్రారంభించేందుకు సన్నద్ధమవుతుండగా, నిర్వహణ బాధ్యతలు సైతం మధ్యాహ్న భోజన కార్మికులకే అప్పగించనున్నది. వారంలో ఆరు రోజులకు ప్రత్యేక మెనూ సిద్ధం చేయగా, ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు పిల్లలకు అల్పాహారం అందించనున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 2,67,768 మందికి లబ్ధి చేకూరనుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. కాగా, ఈ నిర్ణయంతో డ్రాపౌట్స్కు అడ్డుకట్ట పడడంతో పాటు విద్యార్థుల సంఖ్య పెరిగే అవకాశమున్నదని అధికార యంత్రాంగం భావిస్తున్నది.
– మంచిర్యాల, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : సర్కారు బడుల్లో చదువుకునే పేద, మధ్య తరగతి విద్యార్థుల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విప్లవాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే పుస్తకాలు, నోట్బుక్స్, యూనిఫామ్స్ ఉచితంగా ఇవ్వడంతో పాటు అన్ని పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నారు. సన్నబియ్యం, రాగిజావ, కోడిగుడ్డు-అరటిపండు స్పెషల్ క్లాస్లకు వచ్చే పదో తరగతి పిల్లలకు స్నాక్స్ అందజేస్తున్నారు. తాజాగా.. ప్రభుత్వ బడుల్లో చదువుకునే పిల్లలతో పాటు ఎయిడెడ్ పాఠశాలలు, మోడల్ స్కూళ్లు, మదర్సాల్లో చదువుకునే పిల్లల కోసం సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని తీసుకువస్తున్నారు. వచ్చే నెల 24న దసరా పండుగ కానుకగా ఈ పథకాన్ని అమలుల్లోకి తెచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
బడి ప్రారంభానికి ముందే ప్రతి రోజూ ఉదయం 9.30 గంటలకు విద్యార్థులకు ఈ అల్పాహారం అందించనున్నారు. ఉదయాన్నే హడావుడిగా బడికి వచ్చే విద్యార్థుల ఆకలి బాధలు తీర్చలన్న సంకల్పంతో ఈ పథకాన్ని తీసుకువస్తున్నారు. పిల్లలకు అన్ని రకాల పోషకాలు అందించే లక్ష్యంతో వారంలో ఆరు రోజులకు ప్రత్యేక మెనూ సిద్ధం చేశారు. ఉప్మా, కిచిడీ, పొంగల్తో పాటు వారంలో ఒక రోజు మిల్లెట్స్ ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాలలాంటి మారుమూల జిల్లాల్లో విద్యార్థుల గైర్హజరును తగ్గించేందుకు, డ్రాపౌట్స్కు అడ్డుకట్ట వేసేందుకు ఈ పథకం ఎంతగానో ఉపయోగపడనున్నది. పిల్లలను పనుల్లోకి తీసుకువెళ్లే తల్లిదండ్రులు ఉదయం టిఫిన్, మధ్యాహ్న భోజనం సైతం ప్రభుత్వమే ఇస్తుందంటే కచ్చితంగా పిల్లలను బడులకు పంపిస్తారని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు.
ఈ పథకం అమల్లోకి వస్తే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని 3,637 ప్రభుత్వ పాఠశాలల్లో చదివే 2,56,204 లక్షల మంది విద్యార్థులకు మేలు జరగనుంది. 18 ఎయిడెడ్, 14 మోడల్ స్కూల్స్లో 11,472 మందితో పాటు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలోని 5 మదర్సాల్లోని 92 మంది విద్యార్థులకు సైతం బ్రేక్ఫాస్ట్ అందనుంది. ఆదిలాబాద్ జిల్లాలో అన్ని పాఠశాలల్లో కలుపుకొని 1,26,977 మంది, నిర్మల్ జిల్లాలో 51,543 మంది, కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 44,062 మంది విద్యార్థులు, మంచిర్యాల జిల్లాలో 45,186 మంది విద్యార్థులు ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చిన వెంటనే అన్ని స్కూళ్లలో మెనూను అనుసరించి బ్రేక్ఫాస్ట్ అందజేస్తామని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రస్తుతం మిడ్ డే మీల్స్ సిద్ధం చేస్తున్న వారికే ఈ బాధ్యతలు అప్పగించి అదనపు ఛార్జీలు ఇస్తామని పేర్కొన్నారు.