ఆదిలాబాద్ టౌన్, జనవరి 30 : పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచడానికి అందరూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ సూచించారు. స్వచ్ఛ సర్వేక్షణ్, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా ఆదివారం జిల్లా కేంద్రంలోని భుక్తాపూర్, బస్టాండు ప్రాంతాల్లో మున్సిపల్ కార్మికులతో కలిసి చైర్మన్ కోడవలిని చేతపట్టి పిచ్చిమొక్కలను తొలగిస్తూ పరిసరాలను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రజలు చెత్తను బయట వేయకుండా మున్సిపల్ వాహనాల్లో వేయాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచేలా ప్రత్యేక శ్రద్ధ కనబరచాలని సూచించారు. ఆయన వెంట మున్సిపల్ ఫ్లోర్ లీడర్ బండారి సతీశ్, నాయకులు రాఘవేంద్ర, కౌన్సిలర్ ప్రకాశ్, నాయకులు బండారు దేవన్న, సంతోష్ ఉన్నారు.
కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
ఎదులాపురం, జనవరి 30 : కుష్టు రహిత సమాజాన్ని నిర్మిద్దామని మున్సిపల్ చైర్మన్ జోగు ప్రేమేందర్ పేర్కొన్నారు. గాంధీ వర్ధంతి సందర్భంగా ఆదిలాబాద్లోని డీఎంహెచ్వో కార్యాలయంలో జాతీయ కుష్టు నివారణ దినోత్సవాన్ని నిర్వహించారు. ముందుగా మహాత్మాగాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కుష్టు వ్యాధిని ప్రారంభదశలో గుర్తిస్తే ఆరునెలల్లో నయం చేయవచ్చని పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని కుష్టుకాలనీకి సౌకర్యాలు కల్పించేందకు కృషి చేస్తామన్నారు. రాష్ట్ర కుష్టు నివారణ అధికారి డాక్టర్ జాన్బాబుతో జూమ్ సమావేశం ద్వారా పలు విషయాలు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా కుష్టునివారణాధికారి డాక్టర్ శ్రీకాంత్, కౌన్సిలర్ లక్ష్మణ్, ఎన్సీడీ ప్రోగ్రాం అధికారి క్రాంతి, డిప్యూటీ పారామెడికల్ అధికారులు వామన్రావు, మధుసూదన్రావు, రమేశ్, తెలంగాణ ప్రజారోగ్య వైద్య ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు బండారి కృష్ణ, కార్యాలయ పర్యవేక్షకుడు భూమయ్య, రమణాచారి, శ్యాంసన్, కిరణ్, సతీశ్, రాజశేఖర్, సచిన్, వైద్యులు, తదితరులు పాల్గొన్నారు.