నార్నూర్, డిసెంబర్ 5 : మండలంలోని 23 గ్రామపంచాయతీల్లో ఉపాధిహామీ పథకం ద్వారా చేపట్టిన పనులపై సోమవారం సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 2019-2022 మార్చి వరకు రూ.22 కోట్ల18లక్షల ఖర్చుతో వివిధ రకాల పనులు చేసినట్లు అధికారులు వెల్లడించారు. మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయ ఆవరణలో 12వ సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. 15 బృందాలతో ఈ నెల 4వ తేదీ వరకు డీఆర్పీలు, ఎస్ఆర్పీలు, వీఎస్లు గ్రామాల్లో పనులను తనిఖీ చేశారు. పనుల్లో అవకతవకలను వెల్లడించారు. ఈ సందర్భంగా డీఆర్డీవో కిషన్ మాట్లాడుతూ.. గ్రామ పంచాయతీల్లో చేపట్టిన పనుల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పలు పనుల్లో తేడాలు కనిపించడంతో అధికారుల దృష్టికి తీసుకెళ్లగా, సవరించుకోవాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్ష్యం వహించిన వారికి రూ.23,120 పెనాల్టీ విధించారు. రూ.37,500 రికవరీ చేయాలని ఆదేశించారు. సెగ్రిగేషన్ షెడ్ల నిర్మాణంలో కొంత తేడా రావడంతో గ్రామపంచాయతీల నుంచి రికవరీ చేస్తామని తెలిపారు. సామాజిక తనిఖీ ప్రజావేదిక తనిఖీ కొనసాగుతుండడంతో పూర్తిస్థాయి వివరాలు మంగళవారం తెలియజేస్తామని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ కనక మోతుబాయి, అడిషనల్ ఏపీడీలు రాథోడ్ రవీందర్, సిద్ధిఖ్, డీవీవో చంద్రశేఖర్రావు, ఎంపీడీవో కావల రమేశ్, ఎస్సార్పీ సాయినాథ్, ఏపీవోలు రాథోడ్ సురేందర్, జాదవ్ శేషారావ్ తదితరులు పాల్గొన్నారు.