నిర్మల్ అర్బన్, జనవరి 9 : సైబర్ నేరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఆన్లైన్ పేరిట వచ్చే ఉద్యోగాలు, అత్యాశకు పోయి తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించే మార్గాలకు దూరంగా ఉండాలని నిర్మల్ ఎస్పీ జానకి షర్మిల తెలిపారు. నిర్మల్ పట్టణానికి చెందిన దీక్షిత్ ఉద్యోగాల వేటలో ఉండి రూ.18.95 లక్షలు పోగొట్టుకున్నాడు. పోలీసుల చొరవతో రూ.13.19 లక్షలను రికవరీ చేసి బాధితుడికి అందించారు. ఈ వివరాలను మంగళవారం తన కార్యాలయంలో ఎస్పీ జానకి షర్మిల వెల్లడించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. నిర్మల్ పట్టణంలోని ప్రియదర్శినినగర్ కాలనీకి చెందిన అనుపోల్ల దీక్షిత్ కుమార్ ఉద్యోగం వేటలో ఉన్నాడు. ఈ క్రమంలో తన టెలిగ్రామ్కు వచ్చిన లింక్ను ఓపెన్ చేశాడు. ఆగస్టు 14, 2023న టెలిగ్రామ్లో పార్ట్ టైం జాబ్ గురించి మెసేజ్ రాగానే పూర్తి వివరాలు పంపించాడు.
కొద్ది రోజుల తర్వాత ఆగస్టు 22, 2023న తన బ్యాంకు అకౌంట్ నుంచి రూ,18,95,990 డబ్బులు పోయాయని పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దీంతో సీఐ పురుషోత్తం కేసు నమోదు చేసి పూర్తి వివరాలు తెలుసుకుని దర్యాప్తు మొదలు పెట్టాడు. ఉద్యోగం కోసం వెతుకుతున్న క్రమంలో టెలిగ్రామ్ లింక్కు దీక్షిత్ పూర్తి వివరాలు పంపించాడు. వర్చువల్ అకౌంట్ క్రియేట్ కాగా.. దీక్షిత్ బ్యాంక్ అకౌంట్లో రూ.10 వేలు డిపాజిట్ అయ్యాయి. తరువాత దీక్షిత్ కొన్ని టాస్క్లు పూర్తి చేయడంతో మళ్లీ రూ.1,019 దీక్షిత్ అకౌంట్లో జమ అయ్యాయి. ఆ తర్వాత దీక్షిత్ రూ.10 వేలను టెలిగ్రామ్లో ఇచ్చిన ప్రకారం లింక్లో వచ్చిన బ్యాంక్ అకౌంట్లో జమ చేశాడు. ఇలా వివిధ టాస్క్ల కింద ఆగస్టు 17, 2023 నుంచి ఆగస్టు 19, 2023 వరకు రూ.18,95,990 వివిధ అకౌంట్లలో జమ చేశాడు. ఎంతకు స్పందన లేకపోవడంతో మోసపోయినట్లు గ్రహించిన దీక్షిత్ తన డబ్బులు పంపించాలని మెసేజ్ పెట్టాడు.
సెక్యూర్ డిపాజిట్ కింద 50 శాతం డబ్బులు కడితేనే తిరిగి నీ డబ్బులు ఇస్తామని మెసేజ్ వచ్చింది. వీరు ఏడు ఐసీఐసీఐ బ్యాంకులు, రెండు ఎస్ బ్యాంకు అకౌంట్ల నుంచి లావాదేవీలు నడిపించారు. దీంతో దీక్షిత్ అకౌంట్ల నుంచి డబ్బులు విత్ డ్రా చేయించకుండా సైబర్ క్రైమ్ ఇన్చార్జి రవికుమార్ సహాయంతో వివిధ బ్యాంకు అధికారులకు నోటీసులు అందించి అకౌంట్లను ఫ్రీజ్ చేయించాం. దీక్షిత్ డబ్బులు రీఫండ్ గురించి సంబంధిత కోర్టులో పిటిషన్ ఫైల్ చేయగా డిసెంబర్ 21, 2023 కోర్టు రీఫండ్ ఆర్డర్ తీసుకుని బాధితునికి రూ.13,19,914 తిరిగి ఇచ్చాం. కేసును ఛేదించిన సీఐ పురుషోత్తమాచారి, సైబర్ క్రైమ్ జిల్లా ఇన్చార్జి రవి కుమార్, ఏపీపీ సతీశ్లను అభినందించారు. విలేకరుల సమావేశంలో డీఎస్పీ గంగారెడ్డి ఎస్బీ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సీఐ పురుషోత్తం పాల్గొన్నారు.