ప్రగతి సారధి, తెలంగాణ విధాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు సారథ్యంలో మంచిర్యాల జిల్లా ఉజ్వలమైన ప్రగతి సాధించింది. విద్య, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు సంభవించాయి. తొమ్మిదేండ్ల పాలనలో ఆర్థిక వ్యవస్థ బలపడగా.. గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మంచిర్యాల మెడికల్ హబ్గా మారగా.. మన ఊరు-మన బడి కింద బడి బాగైంది. ఎత్తిపోతల పథకాలు రైతన్నలకు జలప్రదాయినిగా మారాయి. మిషన్ భగీరథతో ఇంటింటికీ శుద్ధజలం అందుతుండగా.. వారధులతో రవాణా మెరుగైంది. సింగరేణి స్థలాల్లో ఇండ్లు నిర్మించుకున్న వారికి పట్టాలు అందించగా.. సింగరేణి కార్మికులకు అనేక పథకాలు అమలవుతున్నాయి.
స్వరాష్ట్రంలో మంచిర్యాల జిల్లా ప్రగతి పథంలో దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ల ప్రత్యేక దృష్టి.. విప్ సుమన్, ఎమ్మెల్యేలు దివాకర్రావు, చిన్నయ్యల ప్రత్యేక చొరవతో వందల కోట్లతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. తొమ్మిదేండ్ల పాలనలో పల్లె, పట్టణాల రూపురేఖలు మారిపోయాయి.
– మంచిర్యాల, జూన్ 8(నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల నియోజకవర్గంలో రూ.47 కోట్ల డీఎంఎఫ్టీ నిధులు వెచ్చించి మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీల్లో రోడ్లు, డివైడర్లు, సెంట్రల్ లైటింగ్ పనులు చేపట్టారు. ఇందులో మంచిర్యాలలో రూ.13 కోట్లతో లక్ష్మీ టాకీసు నుంచి వైశ్యభవన్ వరకు నిర్మించిన బైపాస్రోడ్డు పట్టణానికే తలమానికంగా నిలుస్తోంది. రూ.50 కోట్ల టీయూఎఫ్ఐడీసీ నిధులతో మంచిర్యాల, నస్పూర్, లక్షెట్టిపేట పట్టణాల్లో పలు అభివృద్ధి పనులు చేశారు. బెల్లంపల్లి మున్సిపాలిటీకి మంత్రి కేటీఆర్ ఇచ్చిన రూ.15 కోట్లు, ఇతర నిధులతో ప్రగతి పథం వైపు పరుగులు పెడుతోంది. రూ.14 కోట్లతో కన్నాల ఫ్లై ఓవర్ బ్రిడ్జి నుంచి రైల్వే స్టేషన్ ఏరియా నాలుగు కిలోమీటర్ల వరకు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేశారు. ముఖ్య కూడళ్లలో 11 జంక్షన్లను అభివృద్ధి చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలోని చెన్నూర్, మందమర్రి, రామకృష్ణాపూర్ పట్టణాల్లో దాదాపు రూ.600 కోట్ల పైచిలుకు నిధులతో పెద్ద ఎత్తున అభివృద్ధి పనులు చేశారు. సెంట్రల్ లైటింగ్ రాత్రి పూట జిగేల్ మంటోంది. అలాగే చెన్నూరు పట్టణంలో రూ.6 కోట్లతో పెద్దచెరువు, రూ.3 కోట్లతో కుమ్మరికుంట మినీ ట్యాంకు బండ్, పట్టణ నడిబొడ్డున రూ.2.50 కోట్లతో కేసీఆర్ పార్క్, రూ.7 కోట్లతో ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్లను నిర్మించారు.
బెల్లంపల్లి నియోజకవర్గంలో 2014 నుంచి ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వం 22 బ్రిడ్జిలను నిర్మించింది. ఫలితంగా 20 గ్రామాల ప్రజలు చెన్నూర్కు వెళ్లడానికి మార్గం సుగుమమైంది. చెన్నూర్ నియోజకవర్గంలో కోటపల్లి మండలంలోని పంగిడి సోమారం వాసుల కోసం రూ.4.75 కోట్లతో రోడ్డు, రూ.1.49 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. ఇదే మండలంలో తుంతుంగ వాగు ఉప్పొంగితే ఎదుల్లబందం, సిర్సా, పుల్లగామ, రొయ్యలపల్లి, ఆలుగామ, జనగామ, సూపాక, కొత్త సూపాక, వెంచపల్లి, నందరాంపల్లి గ్రామాల ప్రజలు జలదిగ్బంధంలో చిక్కుకునేవారు. బాల్క సుమన్ ఎమ్మెల్యే అయ్యాక ఇచ్చిన మాట ప్రకారం యేడాదిలోనే రూ.8 కోట్లతో వాగుపై బ్రిడ్జి నిర్మాణం చేయించారు.
మంచిర్యాల జిల్లా గ్రంథాయలాన్ని రూ.30 లక్షలతో పునరిద్ధరించారు. బెల్లంపల్లి పట్టణం నడిబొడ్డున రూ.75 లక్షలతో గ్రంథాలయ భవనాన్ని నూతనంగా నిర్మించారు. చెన్నూర్లో రూ.కోటితో గ్రంథాలయా నికి కొత్త భవనం కట్టించారు. అన్ని గ్రంథాలయాల్లో మహిళలు, పురుషులకు వేరువేరుగా రీడింగ్ రూంల తో ఏర్పాటు చేశారు. చెన్నూర్ నియోజకవర్గంలోని 100 గ్రామ పంచాయతీల్లో రూ.4 కోట్లతో 100 కేసీఆర్ గ్రంథాలయాలను నిర్మించనున్నారు.
జిల్లాలో మిషన్ భగీరథ పథకం కింద రూ.333 కోట్లతో 563 ట్యాంకులు, 2,625 కిలోమీటర్ల అంతర్గత పైప్లైన్ నిర్మించారు. 1,78,477 ఇండ్లకు, మన ఊరు-మన బడి పాఠశాలలకు, రైతు వేదికలకు నల్లా కనెక్షన్లతో నీటిని సరఫరా చేస్తున్నారు. రూ.40 కోట్లతో చేస్తున్న మందమర్రి అర్బన్ భగీరథ పనులు 90 శాతం మేర పూర్తయ్యాయి. మిగిలిన పనులు త్వరలో పూర్తి కానున్నాయి.
బ్యాంక్ లింకేజీ ద్వారా 9,651 స్వయం సహాయక సంఘాలలోని 1,06,161 మంది సభ్యులకు రూ.1,604 కోట్ల రుణాలు మంజూరు చేశా రు. ఎస్హెచ్జీ ద్వారా రూ.33.60 కోట్ల వడ్డీ రుణాలు కూడా ఇచ్చారు. కల్యాణలక్ష్మి-షాదీ ముబారక్ పథకాల ద్వారా 33 వేల మంది లబ్ధిదారులకు రూ.298 కోట్లు ఇచ్చారు. 99,334 మందికి ఆసరా పింఛన్లు ఇస్తున్నా రు. జిల్లాలో 26,856 మంది మహిళలకు కేసీఆర్ కిట్ అందించారు. ‘దళితబంధు’ ద్వారా ప్రతి కుటుంబానికి రూ.10 లక్షలు ఇస్తుండగా.. ఇప్పటికే 313 మంది లబ్ధిదా రుల ఖాతాల్లో రూ.30 కోట్లు జమ చేశారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 17,308 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు చేయాలని లక్ష్యంగా నిర్దేశించగా.. ఇందులో ఇప్పటికే 4,405 ఎకరాల్లో ప్లాంటేషన్ పూర్తయ్యింది. మంచిర్యాల జిల్లాలో 2,442 ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగైంది. కాగా నేడు సీఎం కేసీఆర్ చేతుల మీదుగా మందమర్రిలో 500 ఎకరాల్లో ఆయిల్ పామ్ ఫ్యాక్టరీని ప్రారంభించనున్నారు. దీంతో జిల్లాలో వేలాది మంది రైతులతోపాటు నిరుద్యోగ యువతకు మేలు జరుగనుంది.
బెల్లంపల్లి, మందమర్రి, నస్పూర్ మండలాల్లో సింగరేణి స్థలాల్లో ఇండ్లు, వ్యాపారాలు పెట్టుకున్న 10,841 మందికి పట్టాలు పంపిణీ చేశారు. కార్మికులకు 29 శాతం ఇంక్రిమెంట్లు, సుమారు 18 వేల మందికి వారసత్వ ఉద్యోగాలు, కార్మికుల తల్లిదండ్రులకు కార్పొరేట్ వైద్యం, 26 వారాల మెటర్నటీ లీవ్, అన్ని మతాల పండుగలకు పెయిడ్ హాలిడే, కార్మికుల పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్, ఇల్లు కట్టుకునే వారికి రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు, ఉచితంగా విద్య, వైద్యం, మంచినీటి సరఫరా, విద్యుత్, సింగరేణి క్వార్టర్లు అందించడంతోపాటు విధుల్లో చనిపోయిన కార్మికుడికి రూ.20 లక్షల ఎక్స్గ్రేషియా, సింగరేణి కార్మికుల రిటైర్మెంట్ వయస్సు 61కి పెంపు, దసరా, దీపావళి పండుగ అడ్వాన్సులు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నది.
మంచిర్యాల జిల్లాకు మెడికల్, నర్సింగ్ కాలేజీలు మంజూరు చేసింది. మెడికల్ కాలేజీకి గుడిపేటలో స్థలం కేటాయించి కాలేజీ నిర్మాణానికి, ప్రస్తుతం మార్కెట్ యార్డులో నడుస్తున్న కాలేజీ స్థలంలో 300 పడకల దవాఖాన నిర్మాణానికి రూ.510 కోట్లు ఖర్చు చేయనుంది. బెల్లంపల్లిలో రూ.17 కోట్లతో 100 పడకల ప్రభుత్వ ఆస్పత్రిని నిర్మించింది. ఇందులోనే డయాలసిస్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నది. లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రి పాత బడడంతో రూ.8 కోట్లతో 50 పడకల ఆసుపత్రి, రూ.21 కోట్లతో చెన్నూర్లో 100 పడకల సామాజిక ఆరోగ్య కేంద్రం నిర్మాణాన్ని చేపట్టింది. జిల్లాలో రూ.17 కోట్లతో 200 పడకలతో మాతాశిశు సంక్షేమ ఆసుపత్రి నిర్మించింది.
మంచిర్యాల జిల్లా హజీపూర్ మండలంలోని సబ్బేపల్లి ప్రాథమిక పాఠశాలకు ‘మన ఊరు- మన బడి’ కింద రాష్ట్ర సర్కారు రూ.11.54 లక్షలు కేటాయించింది. పాఠశాల రూపురేఖలు మారిపోయాయి. అధునాతన టాయిలెట్లు, వాష్ ఏరియా, విద్యుత్కాంతులు, గ్రీన్చాక్ బోర్డులు ఏర్పాటు చేశారు. పిల్లలు కూర్చొవడానికి 100 బెంబీలు సమకూరాయి. ఇలా ‘మన ఊరు-మన బడి’ కింద రూ.109.04 కోట్లతో జిల్లాలోని 248 స్కూళ్ల రూపురేఖలు మారాయి.
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని గూడెం ఎత్తిపోతల పథకం దండేపల్లి, లక్షెట్టిపేట, హాజీపూర్ మండలాల రైతులకు వరప్రదాయినిగా మారింది. రూ.125 కోట్లతో ప్రాజెక్టు నిర్మించగా.. 30 వేల ఎకరాలకు సాగు నీరు అందుతోంది. ఇందుకోసం 11 కిలో మీటర్ల మేర పైపులైన్ వేశారు. 30వ డిస్ట్రిబ్యూటరీ నుంచి 40వ డిస్ట్రిబ్యూటరీ వరకు నీటిని అంది స్తున్నారు. కడెం డిస్ట్రిబ్యూటరీ ద్వారా జిల్లాలో దాదాపు 18 వేల ఎకరాలు సాగవుతున్నా యి. కాళేశ్వరం ప్రాజెక్ట్లో భాగంగా ఎల్లంపల్లి, అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ బ్యారేజీలు నిర్మించారు. ఈ బ్యారేజీలకు అనుసంధానంగా నేడు సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్న నాలుగు లిఫ్ట్ ఇరిగేషన్లతో చెన్నూర్ నియోజకవర్గంలో 90 వేల ఎకరాలు, మంచిర్యాల నియోజకవర్గంలో 10 వేల ఎకరాలకు సాగునీరు అందనుంది. వీటికి తోడు బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గంలో వార్ధా నది మీద నిర్మించే ప్రాజెక్టు ద్వారా 55వేల పైచిలుకు ఎకరాలకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.