భైంసా, ఏప్రిల్ 24 : ప్రజల భద్రత కోసమే పోలీసులు పనిచేస్తున్నారని టీఎస్ఎస్పీ బెటాలి యన్స్ అదనపు డీజీపీ స్వాతిలక్రా అన్నారు. పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు సమీపంలో బెటాలియన్ నిర్మాణ పనులను సోమవారం ఆమె పరిశీలించారు. అధికారులతో మాట్లాడి పలు వివరాలు తెలుసుకున్నారు. మ్యాప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఇక్కడ మూడు క్యాంపులకు సంబంధించిన బెటాలియన్ ఉంటుందని తెలిపారు. జూన్ మొదటివారాని కల్లా నిర్మాణ పనులు పూర్తవుతాయన్నారు. అనంతరం బెటాలియన్ స్థలాన్ని పరిశీలించారు. ఈమె వెంట సెకండ్ బెటాలియన్ డీసీ జైరాజ్, ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఏఎస్పీ కాంతిలాల్ పాటిల్, భైంసా పట్టణ సీఐ శ్రీనివాస్, భైంసా రూరల్ సీఐ చంద్రశేఖర్, ఎస్ఐలు శ్రీనివాస్, శ్రీకాంత్, సిబ్బంది తదితరులున్నారు.
రెండో బెటాలియన్ సందర్శన
ఆదిలాబాద్ రూరల్, ఏప్రిల్ 24 : ఆదిలాబాద్ రూరల్ మండలం యాపల్గూడలోని రాష్ట్ర ప్రత్యేక పోలీస్ రెండో బెటాలియన్ను అడిషనల్ డీజీపీ స్వాతి లక్రా సందర్శించారు. బెటాలియన్ వద్దకు చేరుకున్న ఆమెకు అధికారులు, సిబ్బంది ఘనంగా స్వాగతం పలికారు. వారి నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు. రెండో బెటాలియన్లో కొత్తగా నిర్మించిన కమాండో బ్యారక్, ప్రధాన ప్రవేశ ద్వారం, ప్రీ ఫ్యాబ్రికేటెడ్ లివింగ్ బ్యారక్ను ప్రారంభించారు. పెట్రోల్ బంక్కు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. యాపల్గూడలో 120 ఎకరాల్లో రెండో బెటాలియన్ను ఏర్పాటు చేశామని, ఇందులో దశలవారీగా అన్ని వసతులు సమకూరుస్తున్నట్లు తెలిపారు. పచ్చదనాన్ని పెంపొందించేలా బెటాలియన్ ఆవరణలో వందలాది మొక్కలు నాటనున్నట్లు పేర్కొన్నారు. కాగా.. ఇన్ని రోజులు జిల్లాకేంద్రంలోని పోలీస్ హెడ్ క్వార్టర్ నుంచి కార్యకలాపాలు నిర్వహిస్తుండగా..
తాజాగా బెటాలియన్ నిర్వహణ అంతటిని యాపల్గూడకు మార్చినట్లు చెప్పారు. ఇకపై బెటాలియన్ కార్యకలాపాలన్నీ ఇక్కడి నుంచే సాగుతాయని, అందుకు వీలుగా అన్ని వసతులు కల్పించినట్లు తెలిపారు. రెండో బెటాలియన్ అనుకున్న దానికంటే ఎక్కువ అభివృద్ధి అయ్యిందన్నారు. మున్ముందు జరిగే అన్ని అభివృద్ధి కార్యక్రమాలకు సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. బెటాలియన్కు అవసరమైన నిధులను కేటాయిస్తామని తెలిపారు. రెండో బెటాలియన్ డెవలప్మెంట్ కోసం కృషి చేసిన ప్రతి ఒక్కరినీ అభినందించారు. అలాగే అడిషనల్ డీజీపీ స్వాతి లక్రాను కలెక్టర్ రాహుల్ రాజ్ మర్యాదపూక్వంగా కలిసి పూల మొక్క అందజేశారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ రిజ్వాన్ బాషా, ఎస్పీ డీ ఉదయ్కుమార్ రెడ్డి, బెటాలియన్ కమాండర్ వేణుగోపాల్, అడిషనల్ కమాండెంట్ ఎం జయరాజ్, డీఎస్పీ ఉమేందర్, రూరల్ సీఐ రఘుపతి, ఎస్ నాగ్నాథ్ తదితరులు పాల్గొన్నారు.