కుంటాల, డిసెంబర్ 2 : ఎనిమిదేళ్ల టీఆర్ఎస్ పాలనలో జరిగిన అభివృద్ధిపై తము బహిరంగ చర్చకు సిద్ధమేనని ఇందుకు బీజేపీ నాయకులు సిద్ధంగా ఉండాలని టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు సవాల్ విసిరారు. నిర్మల్ జిల్లా కుంటాలలో పార్టీ కన్వీనర్ పడకంటి దత్తు ఆధ్వర్యంలో శుక్రవారం నాయకులు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముథోల్ నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ఎమ్మెల్యే విఠల్ రెడ్డి పని చేస్తున్నారన్నారు. బీజేపీ ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలు సరికాదన్నారు.
కుంటాల గజ్జలమ్మ ఆలయ పునర్నిర్మాణానికి రూ.22 లక్షలు మంజూరు చేయగా పనులను సైతం కాంట్రాక్టు పద్ధతిలో ఎంపీపీ అప్క గజ్జరాం నాణ్యత లేకుండా చేసిన విషయాన్ని బీజేపీ నాయకులు గుర్తించుకోవాలన్నారు. కుంటాల మండలంలో రూ. 6 కోట్ల 50 లక్షలు మంజూరు చేసి ఆలయాలు నిర్మించిన ఘనత ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, టీఆర్ఎస్(బీఆర్ఎస్) పార్టీకే దక్కుతుందన్నారు. హిందుత్వం పేరుతో యువతను రెచ్చగొట్టి తెలంగాణలో ప్రశాంతంగా జీవిస్తున్న ప్రజల్లో చిచ్చు పెట్టేందుకే బీజేపీ సంగ్రామయాత్ర చేపడుతుందని దుయ్యబట్టారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందేలా చూస్తున్న ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. అభివృద్ధి కనబడకపోతే కేసీఆర్ ప్రవేశ పెట్టిన కంటి వెలుగు పథకంలో కళ్ల అద్దాలను పెట్టుకొని చూసుకోవాలన్నారు.
నియోజకవర్గంలో పత్తి రైతులను దోచుకొని కోట్లాది రూపాయలు గడించిన రామరావు పటేల్, మోహన్ పటేల్ విఠల్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. బీజేపీ అధ్యక్షురాలు రమాదేవి అందకూర్ గ్రామాన్ని దత్తత తీసుకొని ఏళ్లు గడుస్తున్నా అభివృద్ధి చేయకపోవడంతో నియోజకర్గంలో ఏమి సాధిస్తారని ప్రశ్నించారు. ఇప్పటికైనా బీజేపీ నాయకులు దిగజారుడు వ్యాఖ్యలు మానుకోవాలని హెచ్చరించారు. కార్యక్రమంలో జడ్పీటీసీ కొత్తపల్లి గంగమణి బుచ్చన్న, సొసైటీ చైర్మన్ సట్ల గజ్జరాం, ఆర్బీఎస్ మండల కన్వీనర్ శంకర్ గౌడ్, టీఆర్ఎస్(బీఆర్ఎస్) జిల్లా నాయకులు జుట్టు మహేందర్, పార్టీ కన్వీనర్ దత్తు, ఆర్బీఎస్ జిల్లా సభ్యుడు దిగంబర్, మైనార్టీ నాయకులు హైమద్ పాషా, ఎండీ ఖదీర్, ఎంపీటీసీ గిరీశ్, శ్రీకర్ రెడ్డి, సర్పంచ్లు, ఎంపీటీసీలు, నాయకులు పాల్గొన్నారు.