ఉద్యమ పార్టీగా రాష్ర్టాన్ని సాధించి, ప్రాంతీయ పార్టీగా అస్తిత్వాన్ని నిలబెట్టి, రాజకీయ పార్టీగా ప్రగతిని పరుగులెత్తించిన టీఆర్ఎస్.. భారత రాష్ట్ర సమితిగా అవతరించడంపై నయాజోష్ కనిపిస్తున్నది. దేశ గతిని మార్చే ప్రబల శక్తిగా సరికొత్తగా ఆవిర్భవించి జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతుండగా శ్రేణుల్లో హర్షం వ్యక్తమవుతున్నది. శుక్రవారం హైదరాబాద్లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవిర్భావ వేడుక నిర్వహించగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా అభిమానులు, పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు సంబురాలు చేసుకున్నారు. రోడ్లపైకి చేరి పటాకులు కాల్చి, స్వీట్లు పంచి పెట్టారు. ఇది దేశ ప్రజలకు శుభవార్త అంటూ సంపూర్ణంగా స్వాగతించారు. ‘జై కేసీఆర్.. జయహో బీఆర్ఎస్’ అంటూ నినదించారు.
మంచిర్యాల ప్రతినిధి/ఆదిలాబాద్/నిర్మల్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ ): తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పేరును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)గా మారుస్తూ పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు తీసుకొన్న నిర్ణయానికి కేంద్ర ఎన్నికల సంఘం (ఈసీ) ఆమోదం తెలిపిన నేపథ్యంలో శుక్రవారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంబురాలు అంబరాన్నంటాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఐబీ చౌరస్తాలో శ్రేణులు పటాకులు కాల్చారు. బీఆర్ఎస్ అనే బెలూన్ లెటర్లు చూపిస్తూ నినాదాలు చేశారు. మంచిర్యాల నియోజకవర్గ యువ నాయకుడు నడిపెల్లి విజిత్రావు దండేపల్లిలో బీఆర్ఎస్ ఆవిర్భావ సంబురాల్లో పాల్గొన్నారు. మిఠాయిలు పంచి శుభాకాంక్షలు చెప్పుకున్నారు.
జై కేసీఆర్.. జై భారత్.. జై బీఆర్ఎస్ అంటూ నినాదాలు చేశారు. కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో పటాకులు కాల్చడంతో పాటు మిఠాయిలు పంచారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ నాయకులు ఘనంగా సంబురాలు నిర్వహించారు. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ తీశారు. పటాకులు కాలుస్తూ నినాదాలతో హోరెత్తించారు. స్థానిక వినాయక్చౌక్లో కార్యకర్తలు మిఠాయిలు పంచారు. కేక్ కట్ చేశారు. బోథ్లో పార్టీ నాయకులు సంబురాలు చేసుకున్నారు. ఇచ్చోడలోని అంబేద్కర్ చౌక్లో పటాకులు కాల్చారు. ముక్రా(కే)లో సీఎం కేసీఆర్ చిత్రపటాలతో యువకులు నినాదాలు చేశారు.
నార్నూర్లోని స్థానిక గాంధీ చౌరస్తా వద్ద బీఆర్ఎస్ పార్టీ నాయకుల ఆధ్వర్యంలో పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. గుడిహత్నూర్, నేరడిగొండలో కార్యాలయం వద్ద నాయకులు, కార్యకర్తలు సంబురాలు నిర్వహించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో మైనార్టీ సోదరులు సంబురాలు జరుపుకున్నారు. పాత మార్కెట్లోని మసీదులో ప్రార్థనల అనంతరం వార్డు కౌన్సిలర్ తౌహీద్ ఉద్దీన్ (రప్పు) ఆధ్వర్యంలో మిఠాయిలు పంచిపెట్టారు. ఖానాపూర్లోని తెలంగాణ చౌరస్తాలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాలలు వేసి సంబురాలు జరుపుకున్నారు. ఇక బీఆర్ఎస్ ఆవిర్భావంపై వివిధ వర్గాల ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కేసీఆర్ నాయకత్వం దేశానికి అత్యవసరమని స్పష్టం చేశారు.
యావత్ దేశానికి మేలు
స్వాతంత్య్రం వచ్చిన ఇన్ని సంవత్సరాల్లో దేశానికి మన ప్రాంతం నుంచి నాయకత్వం వహించిన ఒకే ఒక వ్యక్తి పీవీ నర్సింహారావు. ఆయన తర్వాత మన ప్రాంతమనే కాదు, అసలు దక్షిణ భారత దేశం నుంచి సరైన రిప్రజెంటేషన్ లేదు. అందుకే ఉత్తరాదితో పోలిస్తే మనకు బడ్జెట్ కేటాయింపులు తక్కువ. ఏం చేసినా ప్రశ్నించే వారు లేరని దక్షిణాది రాష్ర్టాలను కేంద్ర ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. ఇప్పుడు కేసీఆర్ ఆ లోటు తీరుస్తున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న కేసీఆర్ దేశంలోనూ అవి అమలు చేసి చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ రాక రాష్ట్రంతో పాటు యావత్ దేశానికి మేలు చేస్తుంది.
– డాక్టర్ కుమారస్వామి, ప్రముఖ చాతి వైద్య నిపుణుడు, మంచిర్యాల
దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలు చేయాలి..
నిర్మల్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : దేశవ్యాప్తంగా తెలంగాణ పథకాలు అమలు చేయాలి. ఇది జాతీయ రాజకీయాల్లోకి వస్తున్న కేసీఆర్తోనే సాధ్యమవుతుంది. పేద ప్రజలపై కేంద్ర ప్రభుత్వం కనికరం లేకుండా వ్యవహరిస్తున్నది. పెరిగిన గ్యాస్, పెట్రోల్, నిత్యావసర సరుకుల ధరలతో పూట గడవడమే కష్టంగా మారింది. తెలంగాణలో సీఎం కేసీఆర్ పేదల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం పన్నుల పేరుతో సామాన్యుల నడ్డి విరుస్తున్నది. పేద, మధ్యతరగతి ప్రజలను ఇబ్బందుల పాలు చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి ప్రజలు తగిన గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డయ్. టీఆర్ఎస్ను బీఆర్ఎస్ పార్టీగా ఎన్నికల కమిషన్ ఆమోదించడంతో బీజేపీ నేతల్లో వణుకు మొదలైంది.
– శిరీష, గృహిణి(నిర్మల్)
యువతకు ఉజ్వల భవిష్యత్
ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించడంలో మిగితా రాష్ర్టాల కంటే ముందున్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వివిధ ప్రభుత్వ శాఖల్లో 90 వేల ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకున్నారు. తెలంగాణలో అమలు చేస్తున్న టీఎస్ ఐపాస్ వల్ల రాష్ట్రంలో ఐటీ రంగం, ఇతర పరిశ్రమలు విస్తరించడంతో యువత ప్రైవేటు రంగంలో ఉద్యోగాలు చేస్తూ మంచి వేతనాలు పొందుతున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నత చదువులు చదివి ఉపాధి లేక కొట్టుమిట్టాడిన యువతకు ప్రత్యేక రాష్ట్రంలో ఎనిమిదేళ్లుగా మంచి ఉద్యోగాలు వస్తున్నాయి. సీఎం కేసీఆర్ సారథ్యంలో బీఆర్ఎస్ దేశంలో అధికారంలోకి వస్తే నిరుద్యోగులు, యువతకు ప్రైవేటు, ప్రభుత్వం రంగాల్లో భారీగా ఉద్యోగాలు లభిస్తాయి. యువకులు బీఆర్ఎస్కు అండగా నిలుస్తారు.
– మహ్మద్ రిజ్వాన్, విద్యార్థి, ఆదిలాబాద్
దేశ ప్రజలు స్వాగతిస్తున్నారు..
నిర్మల్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో 75 ఏళ్లలో జరుగని అభివృద్ధి ఈ ఎనిమిదేండ్లలో జరిగింది. దీనికి సీఎం కేసీఆరే ప్రధాన కార ణం. బీఆర్ఎస్ను దేశ ప్రజలు స్వాగతి స్తున్నరు. వ్యవసాయ రంగంతోపాటు అన్నిరంగాల్లో రాష్ట్రం గణనీయమైన అభివృద్ధి సాధించింది. ఇతర రాష్ర్టాల్లో పర్యటనలకు వెళ్లినప్పుడు చూశాం. ఎక్కడ కూడా మన లాంటి అందమైన రోడ్లు లేవు. అభివృద్ధితోపాటు పాటు సంక్షేమ కార్యక్రమాలతో పేదల మనసు గెలుచుకున్న నేత కేసీఆర్. దేశంలో ఏ రాష్ట్రంలో లేని పథకాలు తెలంగాణ అమలు చేస్తున్నారు. అలాంటి నేత భారత రాజకీయాల్లోకి రావడం అద్భుతమే. తెలంగాణలో అభివృద్ధి జరిగినట్లు దేశం అన్నిరం గాల్లో కేసీఆర్ నేతృత్వంలో ముందుకెళ్లడం ఖాయం. కేసీ ఆర్ రాక కోసం దేశ ప్రజలు ఎదురు చూస్తున్నారు. – వర్ధినేని రజిని, గృహిణి(నిర్మల్)
ఈసీ ఆమోదం తెలపడం శుభసూచకం..
నిర్మల్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ) : భారత రాజకీ యాల్లోకి సీఎం కేసీఆర్ అడుగు పెట్టడం శుభసూచ కం. టీఆర్ఎస్ పార్టీ పేరును బీఆర్ఎస్గా ఎన్నికల కమిషన్ ఆమోదం తెలపడం చాలా సంతోషకరం. కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావడం ఎంత అవసర మో మొన్నటి గుజరాత్ ఎన్నికలతో తేలిపోయింది. ప్రజలకు ప్రత్యామ్నాయం లేక మతపరమైన రాజకీయాలు చేస్తున్న వారికి ఓటేయాల్సి వస్తున్నది. వ్యవసాయానికి, రైతులకు అండగా ఉండే కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి చాలా అవసరం. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అన్నిరంగాల్లో ముందుకెళ్తున్నది. ఇందుకు నిదర్శనం అనేక పరిశ్రమలు తరలి రావడమే. వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి అవకాశాలు మెరుగు పడ్డయ్. మోదీ మేక్ ఇన్ ఇండియా అన్నడు. అది అట్టర్ ప్లాప్ అయింది. నోట్ల రద్దు విఫల మైంది. కాంగ్రెస్ పార్టీ జీరో అయింది. దేశంలో పొలిటికల్ గ్యాప్ ఏర్పడింది. దీన్ని భర్తీ చేయాలంటే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం తెలంగాణ ప్రజల అదృష్టం. వివిధ రాష్ర్టాల ప్రజలు ఆయన వెన్నంటే నడిచేందుకు సిద్ధంగా ఉన్నారు.
– అజయ్, నిర్మల్
కేంద్రంలోనూ రైతు సర్కార్
బీఆర్ఎస్ రైతు సంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్తుంది అని సీఎం కేసీఆర్ చెప్పారు. అంటే దేశవ్యాప్తంగా రైతుబంధు, రైతుబీమా, పంట కొనుగోళ్లు, ఎరువుల మీద రాయితీలు ఇలాంటి పథకాలు అమలు చేస్తారని ఆయన చెప్పకనే చెప్పారు. దేశానికి ఓ నాయకుడికి ఎన్నుకునేందుకు ఇంతకు మించిన కారణం అక్కర్లేదు. కేసీఆర్ను మరోసారి గెలిపించుకుంటాం. ఏదిఏమైనా ఆయన వెంటే ఉంటాం.
– గంగిశెట్టి నరేశ్, యువరైతు, నెన్నెల మండలం
సీఎం కేసీఆర్తోనే దేశ ప్రగతి సాధ్యం
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, డిసెంబర్ 9 : తన పాలనతో రాజకీయాల్లో చెరుగని ముద్ర వేసుకున్న టీఆర్ఎస్.. ఇప్పుడు బీఆర్ఎస్గా దేశ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం శుభపరిణామం. సీఎం కేసీఆర్ లాంటి నాయకుడు దేశానికి అవసరం. దేశంలో ఎన్నో వనరులు ఉన్నా వాటిని సద్వినియోగం చేసుకోవడంలో విఫలమవుతున్నారు. ఎంతో మేధస్సు ఉన్న కేసీఆర్ దేశ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముందుచూపు ఉన్న వ్యక్తి ఆయన. ఆయనతోనే దేశం ప్రగతి సాధిస్తుందన్న నమ్మకముంది. దేశ ప్రజలందరూ ఆయన వెంట నడుస్తారని ఆశిస్తున్నా.
– శ్రీనివాస్, ప్రిన్సిపాల్, శ్రీ చైతన్య జూనీయర్, డిగ్రీ కళాశాల, ఆసిఫాబాద్
అన్నిరంగాల్లో మహిళలకు చేయూత
తెలంగాణలో మహిళలకు ప్రభుత్వం అన్నిరంగాల్లో పెద్దపీట వేస్తున్నది. కేంద్ర ప్రభుత్వం మహిళల కోసం ఎలాంటి పథకాలు అమలు చేయడం లేదు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి మహిళలకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు మెరుగుపడ్డాయి. పరిశ్రమల ఏర్పాటులో మహిళలకు చేయూతనందిస్తున్నది. మహిళా సంఘాలకు బ్యాంకుల ద్వారా రుణాలు ఇస్తుండడంతో ఉపాధి అవకాశాలు మెరుగుపడ్డాయి, షీంటీల ఏర్పాటుతో మహిళలకు రక్షణ లభిస్తున్నది. అమ్మఒడి, కేసీఆర్ కిట్ పథకాలు మహిళలకు ఎంతో ఉపయోగపడుతున్నాయి. మహిళల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంది. బాలికల చదువుల కోసం రెసిడెన్షియల్ స్కూళ్లు, కళాశాలలు ఏర్పాటు చేసి ఉచిత విద్యను అందిస్తున్నది. ఒంటరి మహిళలకు ప్రభుత్వం పింఛన్ అందిస్తున్నది. దేశంలో బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మహిళలకు అన్ని రంగాల్లో ప్రాధాన్యం లభిస్తుంది.
– కుర్మే స్వరూపారాణి. గృహిణి, ఆదిలాబాద్
ఇది శుభపరిణామం
ఆసిఫాబాద్ అంబేద్కర్చౌక్, డిసెంబర్ 9 : రాష్ట్ర సాధనే లక్ష్యంగా టీఆర్ఎస్ ఎన్నో ఉద్యమాలు చేసింది. 2014లో తెలంగాణ రాష్ర్టాన్ని సాధించి ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలిచింది. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ర్టాన్ని ప్రగతి పథంలో నడిపిస్తున్నారు. అనేక పథకాలు అమలు చేస్తూ పేదల అభ్యున్నతికి పాటుపడుతున్నారు. ఇప్పుడు అదే పార్టీ బీఆర్ఎస్గా అవతరించి జాతీయ రాజకీయాల్లోకి రావడం శుభపరిణామంగా భావిస్తున్నాను. రాష్ర్టాన్ని ఎలాగైతే అన్ని రంగాల్లో ముందుకు తీసుకెళ్తున్నారో దేశాన్ని కూడా అగ్రరాజ్యాల్లో ఒకటిగా నిలుపుతారని ప్రజలు నమ్ముతున్నారు.
– లేకురి నాగేశ్, న్యాయవాది, ఆసిఫాబాద్
కేసీఆర్కు అద్భుతమైన ఇమేజ్ ఉంది
విద్యావిధానంలో మిగిలిన రాష్ర్టాలతో పోలిస్తే మన రాష్ట్రం అడ్వాన్స్గా ఉంది. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ. మొన్న నేను గుజరాత్కు వెళ్లాను. అక్కడి పిల్లలతో మా కాలేజీ పిల్లలు ఫీజు రీయింబర్స్మెంట్ గురించి చెప్పారు. అది విని వారు షాక్ అయ్యారు. చదువుకునే విద్యార్థులకు స్టేట్ గవర్నమెంటే డబ్బులు ఇస్తదా. మీరు చెప్పేది నిజమేనా అని అడిగారు. రైతు బంధు, రైతు బీమా, కాళేశ్వరం ప్రాజెక్టు గురించి వారికి వివరించాక అక్కడి పిల్లలందరూ కేసీఆర్కు అభిమానులుగా మారిపోయారు. దేశంలో కేసీఆర్కు అద్భుతమైన ఇమేజ్ ఉంది. అలాంటి సీఎం మనకు ఉండడం అదృష్టం. ఇప్పుడు ఆయన దేశరాజకీయాల్లోకి వెళ్తున్నారంటే కచ్చితంగా దేశాన్ని కూడా బాగు చేసి చూపిస్తారు.
– చంద్రమోహన్ గౌడ్, వివేకవర్ధిని డిగ్రీ అండ్ పీజీ కాలేజీ, కరస్పాండెంట్ (మంచిర్యాల)