ఆదిలాబాద్, డిసెంబర్ 12(నమస్తే తెలంగాణ):కేంద్రంలోని మోదీ సర్కారు గిరిజనులను మరోమారు మోసం చేసింది. తెలంగాణలో గిరిజనుల రిజర్వేషన్ల పెంపు కుదరదని కుండబద్ధలు కొట్టినట్టు స్పష్టం చేసింది. సుప్రీం కోర్టులో కేసు పరిష్కారం అయిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా లోక్సభా సాక్షిగా వెల్లడించారు. కాగా.. ఇటీవల పది శాతం గిరిజన రిజర్వేషన్లు పెంచాలని తెలంగాణ సర్కారు నోటిఫికేషన్ కూడా విడుదల చేసిన విషయం విదితమే. సీఎం కేసీఆర్ గిరిజనుల పక్షాన నిలుస్తుంటే.. మోదీ సర్కారు అడవిబిడ్డలపై వివక్ష చూపుతున్నదని గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రిజర్వేషన్ల బిల్లును అడ్డుకోవద్దని, ఆమోదం తెలుపాలని కోరుతున్నారు. దీనికి ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపురావు కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పేర్కొంటున్నారు. లేకపోతే తగిన సమయంలో గుణపాఠం చెబుతామని హెచ్చరిస్తున్నారు.
ఆదిలాబాద్, డిసెంబర్ 12 ( నమస్తే తెలంగాణ): తెలంగాణ అభివృద్ధిని ఓర్వలేని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్రంపై వివక్ష కొనసాగిస్తున్నది. రాష్ర్టానికి రావాల్సిన నిధులను విడుదల చేయకపోవడంతో పాటు విభజన హామీలను సైతం విస్మరిస్తున్నది. ప్రత్యేక రాష్ట్రంలో అన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తున్న ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను పెంచాలని నిర్ణయం తీసుకుంది. రిజర్వేషన్లు 10 శాతం పెంచుతూ ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందుకు సంబంధించిన బిల్లును సైతం కేంద్ర ప్రభుత్వానికి పంపించింది. గిరిజన సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు పెంచింతే అడవిబడ్డల మరింత మెరుగుపడుతుందని రిజర్వేషన్ల పెంపు నిర్ణయం తీసుకుని కేంద్రం అనుమతి కోరింది. తెలంగాణ విషయంలో మొండిగా వ్యవహరిస్తున్న మోడీ ప్రభుత్వం ప్రస్తుతం గిరిజనుల రిజర్వేషన్లను పెంచడం సాధ్యం కాదని ప్రకటించింది.
లోకసభలో టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అడిగిన లిఖితపూర్వక ప్రశ్నకు కేంద్ర గిరిజన శాఖ మంత్రి అర్జున్ ముండా సమాధానం ఇస్తూ తెలంగాణ ప్రభుత్వం గిరిజన రిజర్వేషన్లను 10 శాతం పెంచాలని కోరుతూ ప్రభుత్వం ఆమోదించిన బిల్లు కేంద్ర ప్రభుత్వానికి చేరిందని రిజర్వేషన్లకు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టులో ఉన్నాయని వీటి పరిష్కారం తర్వాత రిజర్వేషన్లపై ముందుకు వెళ్తామని సమాధానం ఇచ్చారు. అడవిబిడ్డల రిజర్వేషన్ల పెంపుదలను కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడాన్ని గిరిజన సంఘాల నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజనులను చిన్నచూపు చూస్తుందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేంద్రం తీరు శోచనీయం
గిరిజన రిజర్వేషన్లపై బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు శోచనీయం. మారుమూల గ్రామాల్లో నివసిస్తున్న గిరిజనుల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలను అమలు చేస్తుంది. దీంతో వారి ఉపాధి మెరుగుపడింది. గిరిజనులు మరింత అభివృద్ధి చెందడానికి రిజర్వేషన్లు ఎంతో ఉపయోగపడుతాయి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్లను 10 శాతానికి పెంచుతూ కేంద్రానికి బిల్లు పంపించింది. ఈ విషయంలో బీజేపీ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. బీజేపీ ఎంపీ సోయం బాపురావు రిజర్వేషన్ల విషయంలో కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలి.
– కనక లక్కేరావు, గిరిజన నాయకుడు
గిరిజన రిజర్వేషన్లు అడ్డుకోవద్దు
కార్పొరేట్ శక్తులకు పెద్దపీట వేస్తున్న కేంద్ర ప్రభు త్వం పేదలకు ఉపాధి కొల్లగొట్టే చర్యలకు పాల్పడుతున్న ది.ఎనిమిదేళ్లుగా కేంద్రం అవ లంబిస్తున్న విధానాలతో గిరిజనుల నష్టపోతున్నారు. అడవిబిడ్డలకు రిజర్వేషన్లను పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఈ విషయంలో కేంద్రం వ్యవహరిస్తున్న తీరు బాధకరం. గిరిజనుల రిజర్వేషన్లు పెరిగితే వారి అభివృద్ధి మరింత మెరుగుపడుతుంది. రిజర్వేషన్లు విషయంలో కేంద్రం అడ్డుకుని ప్రయత్నాలు మానుకోవాలి. రాష్ట్ర ప్రభుత్వం రిజర్వేషన్ల పెంపుదల విషయంలో పంపిన బిల్లుకు ఆమోదు తెలిపారు.
– మర్సకోల తిరుపతి, గిరిజన నాయకుడు
గిరిజన యువతకు నష్టం
కేంద్ర సర్కారు గిరిజన యువతకు నష్టం చేస్తున్నది. ఉన్నత చదువులు చదివిన యువతీయువ కులు ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు. అట్టడు గున ఉండి కష్టపడి చదువుకొని వస్తే వారికి అవకాశాలు కల్పించడం లేదు. రాష్ట్ర సర్కారు రిజర్వేషన్లు పెంచాలని, గిరిజనులు బాగు పడాలని, ఉన్నతంగా ఎదగాలని బిల్లును కేంద్ర హోం శాఖకు పంపింది. కేంద్ర సర్కారేమో పాస్ చేయకుండా మోసం చేస్తున్నది. మా యువత అన్నీ గమనిస్తున్నది.
– పెందూర్ దిలీప్,ఆదివాసీ యువకుడు, ఆదిలాబాద్.