ఆదిలాబాద్ రూరల్ : రాష్ట్రంలో ఆదివాసీల అభివృద్ధి కేవలం టీఆర్ఎస్ తోనే సాధ్యమవుతుందని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. బుధవారం మండలంలోని అంకాపూర్ జీపీలో ప్రహారి నిర్మాణానికి, రూ20 లక్షలతో చేపట్టనున్న ఎస్టీకమ్యూనిటీ హాల్, సీసీ రోడ్డు పనులకు ఆయన భూమి పూజచేసి పనులు ప్రారంభించారు. అనంతరం బీజేపీ ఉపసర్పంచ్ భీమ్రావ్తో పాటు మరికొంత మంది బీజేపీ నాయకులకు టీఆర్ఎస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో ఎక్కడాలేని విధంగా ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని తెలిపారు.
గిరిజన విద్యార్థుల కోసం అనేక గురుకులాలను ఏర్పాటు చేసి వారిని విద్యావంతులను చేస్తున్నామన్నారు. బీజేపీ ఎంపీ సోయం బాపూరావ్ గిరిజన యూనివర్సిటీని జిల్లాకు తీసుకువస్తే తామె ముందుండి ఆయనకు సన్మానం చేస్తామన్నారు. ప్రభుత్వం రైతులకు రైతుబంధు, రైతుబీమా, ఉచిత కరెంట్లాంటి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గత పాలకుల నిర్లక్ష్యం వలన ప్రతి ఏడాది సీజన్లో వేలాది మంది గిరిజనులు అనారోగ్యంతో మృత్యువాత పడేవారని కాని టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకివచ్చిన తర్వాత గిరి మరణాలను పూర్తిగా నివారించామని గుర్తుంచుకోవాలన్నారు.
గ్రామాలతో పాటు ఆదిలాబాద్ పట్టణాన్ని అభివృద్ధిలో అగ్రగామిని చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్ మనోహర్, రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షుడు అడ్డి భోజారెడ్డి, మైనారిటీ నాయకుడు యూనిస్ అక్బాణీ, పార్టీ మండల అధ్యక్ష,కార్యదర్శులు కొడప సోనేరావ్, కనక రమణ, గంగారెడ్డి, శకుంతల, సీతారాం తదితరులు పాల్గొన్నారు.