మారుమూల గ్రామాల్లోని ప్రజలకు పారదర్శక సేవలందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నది. పాలనాపరంగా ఈ-గవర్నెన్స్ విధానాన్ని తీసుకొచ్చి ప్రతి సమస్యకూ సత్వర పరిష్కారం చూపుతున్నది. ప్రతి గ్రామపం చాయతీలో కంప్యూటర్, హైస్పీడ్ ఇంటర్నెట్ సదుపాయాన్ని కల్పించడం ద్వారా వేగంగా సేవలందిస్తున్నది. ఇందులో భాగంగా టీ-ఫైబర్ కేబుల్ కనెక్టివిటీ పనులు చేపట్టింది. నిర్మల్ జిల్లాలో 19 మండలాల పరిధిలో 396 పంచాయతీలు ఉండగా, ఇప్పటికే 225 గ్రామాల్లో పనులు పూర్తి చేసింది. మిగతా చోట్ల కూడా త్వరలోనే ఈ సదుపాయాన్ని కల్పించి, వచ్చే జనవరి నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తేనున్నది.
నిర్మల్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ) : మండల, జిల్లా స్థాయిలో ఉన్నతాధికారులు ఉత్తర ప్రత్యుత్తరాలతో పాటు సమాచారాన్ని పంచుకునేందుకు ఆన్లైన్ వేదికనే ఎక్కువగా ఉపయోగించుకుంటున్న సంగతి తెలిసిందే. ఇదే తరహాలో గ్రామస్థాయిలోనూ అమలు చేసి ప్రతి అధికారికి జవాబుదారీతనం ఉండేలా అన్ని గ్రామ పంచాయతీలకు టీ-ఫైబర్ ద్వారా ఇంటర్నెట్ కనెక్షన్ ఇస్తున్నారు. జిల్లా పంచాయతీ అధికారులు, ఫైబర్ ఇన్చార్జిలతో ఈ కనెక్టివిటీ పనులపై ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. ఇంటర్నెట్ కనెక్షన్ తీసుకునేలా సర్పంచులు, కార్యదర్శులకు అధికారులు అవగాహన కల్పించడంతో పాటు అవసరమైన సహాయ సహకారాలు అందిస్తున్నారు. కంప్యూటర్, ఇతర పరికరాలు లేని పంచాయతీల్లో కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చారు.
ఫైబర్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత ఇక గ్రామాలన్నీ ఈ-గవర్నెన్స్లోకి వెళ్లనున్నాయి. దీంతో ప్రజలు తమ ఫిర్యాదులను ఆన్లైన్లో నమోదు చేసుకొని.. తమ పని ఏ అధికారి వద్ద పెండింగ్లో ఉందో తెలుసుకునే అవకాశం ఉంటుంది. సదరు అధికారి సమస్యను పరిష్కరించకుంటే ఉన్నతాధికారులకు ఆన్లైన్లోనే వారిపై ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పిస్తున్నారు. కాగా ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో అధికారులు అన్ని ఫైళ్లను ఆన్లైన్ ద్వారానే పరిష్కరిస్తున్న సంగతి తెలిసిందే. ప్రతి అంశానికీ సంబంధించి తహసీల్దార్ స్థాయి నుంచి ఆర్డీవో, కలెక్టరేట్ ఏవో, డీఆర్వో, అదనపు కలెక్టర్లతో పాటు కలెక్టర్ సైతం ప్రతి ఫైల్ను ఆన్లైన్లోనే చెక్ చేస్తున్నారు. ఈ-గవర్నెన్స్ విధానం ద్వారా ఫైళ్లు మిస్సయ్యే అవకాశాలు ఉండవు. గతంలో కింది స్థాయి నుంచి కలెక్టరేట్ వరకు ఫైళ్లను ప్రత్యేక మెసెంజర్స్ ద్వారా పంపాల్సి వచ్చేది. ఈ-గవర్నెన్స్ ద్వారా ఫైళ్లను ఎప్పటికప్పుడు వేగంగా పరిష్కరించే అవకాశం ఉంటుంది.
ఫిర్యాదు చేయడం సులభతరం..
ఇప్పటివరకు పల్లె జనం తమ సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తెచ్చేందుకు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా ఫిర్యాదుల కార్యక్రమాన్ని వినియోగించుకునేవారు. సుదూర ప్రాంతాల నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి ఎన్నో వ్యయప్రయాసలకు గురవుతున్నారు. ప్రతి శాఖకు సంబంధించిన సమస్యకు ఆన్లైన్లోనే పరిష్కారం పొందే అవకాశం ఉన్నా.. దానిని పెద్దగా ఉపయోగించుకోవడం లేదు. టీ-ఫైబర్ ద్వారా ఇకపై ప్రజావాణికి వెళ్లకుండానే తమ గ్రామాల్లోని పంచాయతీల్లో ఏర్పాటు చేసే కంప్యూటర్ ద్వారా తమ ఫిర్యాదులను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం కలుగనుంది. గ్రామాల్లో మీసేవ కేంద్రాలు లేకపోవడం, మండల కేంద్రాల్లో ఉన్న మీసేవ ఆపరేటర్లకు అవగాహన లేకపోవడంతో సమస్యల పరిష్కారం కోసం కొన్నిసార్లు కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తున్నది. ఇటీవల ప్రభుత్వం గ్రామ స్థాయిలో మీసేవ సెంటర్ల ఏర్పాటుకు కూడా అవకాశం కల్పించింది.
టీ ఫైబర్తో నిరంతర సేవలు..
రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో టీ-ఫైబర్ ద్వారా హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలను అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగానే జిల్లాలోని ప్రతి పంచాయతీకి అండర్ గ్రౌండ్ ద్వారా టీ-ఫైబర్ కేబుల్ వేస్తున్నారు. ఈ కేబుల్ పనులు పూర్తయితే పంచాయతీల్లో ఎలాంటి ఆటంకాలు లేకుండా ఇంటర్నెట్ సేవలు అందే అవకాశం ఉంది. దీంతో అన్ని ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం ఏర్పడి పూర్తిస్థాయిలో సమస్య పరిష్కారం కానున్నది. ఇప్పటికే జిల్లాలోని అన్ని మండల కేంద్రాలతో పాటు 225 జీపీలకు టీ-ఫైబర్ కనెక్టివిటీ పూర్తికాగా, స్టేట్ హెడ్ క్వార్టర్స్ నుంచి జిల్లా కేంద్రానికి లింక్ చేస్తే ఆయా జీపీలకు హైస్పీడ్ ఇంటర్నెట్ సేవలు అందుతాయి. కొన్ని పంచాయతీలకు ఇంటర్నెట్ టెస్టింగ్ సైతం జరుగుతున్నది. వచ్చే జనవరి నాటికి మిగతా అన్ని పంచాయతీలకు కనెక్షన్లు ఇవ్వనున్నట్లు జిల్లా టీ-ఫైబర్ ఇన్చార్జి దత్తాద్రి తెలిపారు. దీనిపై సర్పంచులు, ఎంపీవోలకు అవగాహన కల్పిస్తున్నారు. ఈ-గవర్నెన్స్ అందుబాటులోకి వస్తే గ్రామ కార్యదర్శి ద్వారా అన్ని సేవలు పంచాయతీలోనే పొందే అవకాశం ఉంటుంది.
త్వరలోనే అన్ని గ్రామాలకు టీ-ఫైబర్ కనెక్టివిటీ
టీ-ఫైబర్ ద్వారా అన్ని గ్రామాలకు త్వరలోనే హైస్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ అందిస్తాం. కొవిడ్ కారణంగా పనుల్లో కొంత జాప్యం ఏర్పడింది. ముఖ్యంగా కొన్ని మారుమూల గ్రామాలకు ఇంటర్నెట్ సదుపాయం లేక ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ధరణితో పాటు చాలా వరకు ప్రభుత్వ సేవలన్నీ ఆన్లైన్లోనే అందుతున్నాయి. ఇకపై వివిధ ప్రభుత్వ పనుల కోసం పట్టణాలకు వచ్చే అవసరం ఉండదు. మీసేవ కేంద్రాల్లో లభించే సేవలన్నీ గ్రామాల్లోనే అందుబాటులోకి వస్తాయి. రాబోయే రోజుల్లో ప్రభుత్వ పాఠశాలల్లో డిజిటల్ తరగతులు నిర్వహించే అవకాశం ఉంది. ప్రతి పంచాయతీలో ఈ-పంచాయతీ సేవలు అందుబాటులోకి రావాలంటే హైస్పీడ్ ఇంటర్నెట్ అవసరముంటుంది. ఇలాంటి అనేక సదుపాయాలను గ్రామీణ ప్రజలకు అందించాలనే ఉద్దేశంతోనే ప్రభుత్వం టీ-ఫైబర్ కనెక్టివిటీ ఏర్పాట్లను చేస్తున్నది.
– ముషారఫ్అలీ ఫారూఖీ, కలెక్టర్, నిర్మల్