“మూడు గంటల కరెంటిచ్చి కన్నీళ్లు పెట్టించే కాంగ్రెస్ కావాల్నో.. రైతు సంక్షేమం కోరి మూడు పంటలకు భరోసానిస్తున్న బీఆర్ఎస్ కావాల్నో ఆలోచించుకోవాలి. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి లక్షలాది ఎకరాలకు సాగునీరందించడంతో పాటు 24 గంటల ఉచిత కరెంట్ సరఫరా చేస్తుంటే కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదు. ధమ్ముంటే 3 గంటల కరెంట్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు రావాలి. 60 ఏండ్ల పాలనలో ఆ పార్టీ రైతులకు చేసిందేమీ లేదు. గ్రామాల్లోకి వస్తే తరిమికొట్టాలి. రైతులతో పెట్టుకున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి రాజకీయ సన్యాసం తప్పదు” అని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డితో పాటు ఎమ్మెల్యేలు నడిపెల్లి దివాకర్రావు, ఆత్రం సక్కు, విఠల్రెడ్డి, రాథోడ్ బాపురావ్, అజ్మీరా రేఖా నాయక్, జోగు రామన్న పేర్కొన్నారు. గురువారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన సమావేశాల్లో కాంగ్రెస్ కరెంట్ వ్యాఖ్యలపై రైతులతో చర్చించారు. ఏకగ్రీవ తీర్మానాలు చేసి.. ఆ పార్టీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
సారంగాపూర్, జూలై 20 : మూడు గంటల కరెంటిచ్చే కాంగ్రెస్ కావాలో.. మూడు పంటలకు భరోసానిస్తున్న బీఆర్ఎస్ సర్కారు కావాలో ప్రజలే నిర్ణయించుకోవాలని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూచించారు. నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలంలోని స్వర్ణ రైతువేదికలో నిర్వహించిన సమావేశంలో కరెంట్పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మూడు గంటల కరెంట్ ఇస్తే రైతులకు కన్నీళ్లు తప్పవని, 24 గంటల కరెంట్ ఇస్తేనే రైతులు సమృద్ధిగా పంటలు పండించుకుని ఆర్థికంగా అభివృద్ధి చెందుతారన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ లేక అనేక మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ ఇస్తే చాలని మాట్లాడడం సరికాదన్నారు. ఎవుసం విలువ తెలియని రేవంత్రెడ్డి కల్లుతాగిన కోతిలా కుప్పిగంతులు వేస్తున్నాడని విమర్శించారు. మన ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి 24 గంటల కరెంట్తోపాటు లక్షలాది ఎకరాలకు సాగు నీరందిస్తుంటే కాంగ్రెస్ నాయకులకు మింగుడుపడడం లేదని మండిపడ్డారు. వ్యవసాయం దండుగా అన్న చంద్రబాబు నాయుడుకి ప్రజలు తగిన గుణపాఠం చెప్పారని, ఇప్పడు కాంగ్రెస్ను కూడా బంగాళాఖాతంలో విసిరేసే రోజులు దగ్గర పడ్డాయన్నారు. మాయమాటలు చెప్పి మోసం చేసే కాంగ్రెస్ పార్టీని నమ్మవద్దని, గ్రామాల్లోకి వస్తే తరమి తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అనంతరం 24 గంటల ఉచిత విద్యుత్ను కొనసాగించాలని, మూడు గంటలు వద్దు.. మూడు పంటలు కావాలని కోరుతూ బీఆర్ఎస్ నాయకులు ప్రవేశపెట్టిన తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించారు.
దండేపల్లి, జూలై 20 : దండేపల్లి మండలం గూడెం రైతు వేదికలో రైతులతో నిర్వహించిన చర్చా వేదికలో మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు పాల్గొని మాట్లాడారు. వ్యవసాయానికి మూడు గంటల కరెంట్ చాలంటున్న కాంగ్రెస్ను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. ఆ పార్టీని నమ్మితే మళ్లీ పాత రోజులే వస్తాయని గుర్తు చేశారు. మూడు గంటల కరెంటు ఇస్తామన్నా కాంగ్రెస్ను నమ్ముదామా..? మూడు పంటలకు భరోసానిస్తున్న సీఎం కేసీఆర్ను నమ్ముదామా..? ఓసారి ఆలోచన చేయాలన్నారు.
లక్షెట్టిపేట, జూలై 20 : లక్షెట్టిపేట పట్టణంలోని రైతు వేదికలో నిర్వహించిన చర్చా వేదికలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై రైతులతో కలిసి పలు తీర్మానాలు చేశారు. తెలంగాణ రైతులు ప్రగతి పథంలో దూసుకెళ్తుంటే ఓర్వలేని కాంగ్రెస్ నాయకులు కుట్రలు చేస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్రావు మండిపడ్డారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో రైతులు పడ్డ కష్టాలను ఒక్కసారి గుర్తు చేసుకోవాలన్నారు. సీఎం కేసీఆర్ ఉన్నంత కాలం రైతులు రారాజుల్లా బతుకుతారని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం రేవంత్.. కాంగ్రెస్ పార్టీ డౌన్ డౌన్ అంటూ రైతులు నినాదాలు చేశారు.
హాజీపూర్, జూలై 20 : గుడిపేట గ్రామ పంచాయతీ రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే దివాకర్రావు పాల్గొన్నారు. రైతు సంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమన్నారు. కాంగ్రెస్ పాలనలో రైతులు కరెంటు, ఎరువులు, విత్తనాల కోసం అరిగోస పడ్డారని గుర్తు చేశారు. రైతులకు 24 గంటల కరెంటు ఇస్తే ఓర్వలేని కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మూడు గంటల కరెంటే చాలంటున్నాడని, వ్యవసాయం గురించి తెలువనోడు గట్లనే మాట్లాడుతాడని మండిపడ్డారు. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలను చిత్తుగా ఓడించి, బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
ముథోల్, జూలై, 20 : మండలంలోని విఠోలి, బ్రహ్మణ్గాం రైతువేదికల్లో ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి పాల్గొని, కరెంట్పై కాంగ్రెస్ చేసిన వ్యాఖ్యలపై రైతులతో చర్చించారు. రైతులు ఆత్మగౌరవంతో బతుకుతుంటే రేవంత్ రెడ్డి ఇష్టమొచ్చినట్లు మాట్లాడడం సిగ్గు చేటని మండిపడ్డారు. తెలంగాణ రాకముందు కాంగ్రెస్ పాలనలో రైతుల ఎన్ని కష్టాలు పడ్డారో ప్రజలకు వివరించారు. 24 గంటల కరెంట్ కావాలని రైతులు మూకుమ్మడిగా మద్దతు తెలపడంతోపాటు ఏకగ్రీవ తీర్మానం చేశారు.
భీంపూర్, జూలై 20 : మండలంలోని నిపాని రైతు వేదికలో బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావ్ వ్యవసాయాభివృద్ధిపై చర్చించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ చిన్న రాష్ర్టాల ఏర్పాటుతో అనేక ప్రయోజనాలున్నాయని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడే చెప్పారని, ఆ విధంగానే సీఎం కేసీఆర్ పాలన సాగిస్తున్నారని కొనియాడారు. రైతులతో పెట్టుకుంటున్న టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డికి రాజకీయ భవిష్యత్ ఉండదని, రాజకీయ సన్యాసం తప్పదని హెచ్చరించారు.
కడెం, జూలై 20 : మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ రైతుల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల కుట్రలను రైతులంతా తిప్పికొట్టాలని ఆమె పిలుపునిచ్చారు. కాంగ్రెస్ పార్టీకి దమ్ముంటే మూడు గంటల కరెంట్ అంశాన్ని మేనిఫెస్టోలో పెట్టి ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.
పెంబి, జూలై 20 : మూడు గంటల కాంగ్రెస్ కావాలా? మోటర్లకు మీటర్లు పెట్టే బీజేపీ కావాలా? మూడు పంటల బీఆర్ఎస్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్ పేర్కొన్నారు. గురువారం మండల కేంద్రంలోని రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అన్ని వర్గాల సంక్షేమం కోసం కృషి చేస్తున్న మన ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.
జైనథ్, జూలై 20 : మండలంలోని నిరాల, పెండల్వాడ రైతు వేదికల్లో నిర్వహించిన సమావేశాల్లో ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న పాల్గొని కాంగ్రెస్ కరెంట్ కుట్రలపై చర్చించారు. ఆయన మాట్లాడుతూ దేశానికి అన్నంపెట్టే రైతన్నను రాజు చేయడమే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా 24 గంటల ఉచిత కరెంట్, రైతుబంధు, రైతు బీమా అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని కొనియాడారు. టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డి తెలంగాణ రైతాంగానికి బేషరతుగా క్షమపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
తిర్యాణి, జూలై 20 : వ్యవసాయానికి మూడు గంటలు కరెంట్ చాలన్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి రైతులకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు డిమాండ్ చేశారు. తిర్యాణి, గిన్నేధరి రైతు వేదికల్లో నిర్వహించిన చర్చలో ఆయన పాల్గొని మాట్లాడారు. సీఎం కేసీఆర్ వ్యవసాయాన్ని పండుగలా మార్చితే.. ఓర్వలేని కాంగ్రెస్ వ్యాపార ధోరణి అవలంబిస్తున్నదని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్కు తగిన గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు.
గాలి మాటలు మాట్లాడొద్దు..
సారంగాపూర్, జూలై 20 : నాకు ఐదెకరాల భూమి ఉన్నది. మరో పదెకరాల భూమిని కౌలుకు తీసుకున్న. తొమ్మిదేండ్ల కింద కరెంట్ సరిగా రాక పోతే మోటర్ పెట్టేందుకు పొలం దగ్గరే పడుకొని అర్ధగంటకు ఒకసారి లేచి చూసేటోన్ని. రోజు మొత్తం పొలం కాడనే పడిగాపులు కాసేటోన్ని. లో వోల్టేజీ కరెంట్ మూలంగా మోటర్లు, ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతుండేది. కష్టపడి పండించిన అడ్ల పెసలన్నీ మోటర్లను మంచిగా చేయడానికి పెట్టేది. అప్పటి రోజులు మళ్లీ రావద్దని దేవుడిని మొక్కుకున్నా. దేవుడి రూపంలో సీఎం సార్ గారు రైతులకు మేలుకోరి 24 గంటల ఫీగా ఇస్తుంటే, గా పొట్టి కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మూడు గంటల కరెంట్ చాలనడం మంచి పద్ధతి కాదు. నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. లో వోల్టేజీ సమస్య లేకపోవడంతో మోటర్లు కాలిపోవడం లేదు.
– సంపెంగల గంగన్న, రైతు, పొట్యా(సారంగాపూర్ మండలం)
పొలంకాడ పడుకునే రోజులు మళ్లీ రావద్దు..
సారంగాపూర్, జూలై 20 : తెలంగాణ గర్నమెంట్ రాక ముందు కరెంట్ తిప్పలు బాగా ఉండేది. కరెంట్ ఎప్పుడచ్చేదో, ఎప్పుడు పోయేదో తెలిసేది కాదు. రాత్రి, పగలు పొలం వద్దనే పడుకునే వాళ్లం. ఇప్పడు చాలా మంచిగైంది. కరెంట్ కోతలు లేక పంటలు ఎండిన దాఖలాలు లేవు. పుష్కలంగా నీళ్లు ఉంటున్నయ్. సరిపడా 24 గంటల కరెంట్ వస్తున్నది. మళ్లీ కాంగ్రెసోళ్లు మూడు గంటల కరెంట్ సరిపోతుందని చెప్పుతుండ్రు. మూడు గంటల కరెంట్ వల్ల మూడెకరాల పొలం కూడా పారది. అట్లయితే మళ్లీ కరెంట్ కష్టాలు పాతలాగే వస్తయ్.
– నారాయణ, రైతు, లింగాపూర్తండా
పాతరోజులు మాకొద్దు..
ముథోల్, జూలై 20 : రేవంత్ రెడ్డి అన్న మాటలతో గత కాంగ్రెస్ పాలనలో పడిన కరెంటు కష్టాలు గుర్తుకొస్తున్నాయి. అప్పుడు కరెంటు సరిగ్గా రాక చాలా ఇబ్బంది పడ్డాం. లో వోల్టేజీతో మోటర్లు కాలిపోయి బాగు చేయడానికి అప్పులు చేశాం. అప్పటి కష్టాలు చెప్పినా తీర్చేవారు లేరు. అప్పటి రోజులు మాకొద్దు. సీఎం కేసీఆర్ ప్రభుత్వం వచ్చిన తొమ్మిదేళ్ల నుంచి వ్యవసాయానికి నిరంతరంగా కరెంటు ఇస్తున్నారు. మాకు మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే కావాలి.
– శంకర్, విఠోలి, రైతు(ముథోల్ మండలం)
ముథోల్, జూలై 20 : వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఉంటేనే రెండు పంటలు వేసుకుంటున్నాం. మూడు గంటల కరెంటుకు మడి కూడా తడవదు. మూడు గంటల కరెంటుతో ఎవరికి ఉపయోగం ఉండదు. పైసలు ఉన్నోళ్లకు రైతుల బాధలు ఏం తెలుస్తాయి. రైతుల జోలికొస్తే ఊరుకునేది లేదు.
– పండరి, గన్నోరా, రైతు(ముథోల్ మండలం)
మూడు గంటలు ఎట్ల సాల్తది
ముథోల్, జూలై 20 : కాంగ్రెస్ హయాంలో కరెంటు ఎప్పుడు ఉండేదో, ఎప్పుడు పోయేదో తెలియకుండే. దీంతో తిప్పలు పడ్డాం. మోటరు పెట్టేందుకు రాత్రుల్లో పోయేవాళ్లం. కానీ.. తెలంగాణ ప్రభుత్వంలో ఆ బాధలు లేవు. 24 గంటల కరెంటుతో రెండు పంటలు తీసుకుంటున్నాం. రాత్రుల్లో పొలానికి పోయే తిప్పలు తప్పాయి. ప్రభుత్వం చేస్తున్న పనులను ఓర్వలేకే ఇలాంటి పనులు చేస్తున్నారు. రైతుల జోలికి వస్తే ఊరుకోం.
– ఉమ్మడి గణేశ్, విఠోలితాండ, రైతు(ముథోల్ మండలం)