భారత రాజ్యంగ రూపశిల్పి డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహాన్ని ఆకాశాన్ని ముద్దాడేంత ఎత్తునకు నిర్మించడం గర్వించదగిన పరిణామం. ప్రపంచంలోనే భారీ కాంస్య విగ్రహాన్ని భాగ్యనగరం నడిబొడ్డున ఏర్పాటు చేయడం దళితులకు కేసీఆర్ ఇచ్చిన సమున్నత గౌరవం. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, ఏటా ఆయన పేరిట అవార్డులు ఇచ్చేందుకు రూ.51 కోట్ల శాశ్వత నిధి ఏర్పాటు శుభపరిణామం. వీటి వడ్డీ ద్వారా వచ్చే రూ.3 కోట్లతో అవార్డులు ఇస్తామనడం సంతోషించ దగ్గ విషయం. సకల జనుల సమానత్వం కోసం పరితపించిన విశ్వమానవుడు చూపిన బాటలో సీఎం కేసీఆర్ పయనిస్తూ సుపరిపాలన అందిస్తున్నాడని దళిత మేధావులు, సంఘాల నాయకులు అభిప్రాయ పడుతున్నారు. శుక్రవారం అంబేద్కర్ మనవడితో సీఎం కేసీఆర్ కలిసి బాబా సాహెబ్ విగ్రహాన్ని ఆవిష్కరించిన క్రమంలో ‘సమస్తే’ పలకరించింది. అభిప్రాయాలు వారి మాటల్లోనే..
ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగానికి నిర్మాత అయిన బీఆర్ అంబేద్కర్ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, సీఎం కేసీఆర్ అత్యుత్తమంగా గౌరవించుకున్నారు. దేశంలో మరే రాష్ట్రంలో లేనట్లుగా హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించి చరిత్రలో నిలిచిపోయారు. ఆకాశమంత ఎత్తున్న అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేయడంతోపాటు ఆయన ఆశయాల సాధన దిశగా పనిచేస్తామని ప్రకటించిన సీఎం దేశంలో కేసీఆర్ ఒక్కరే. నూతన సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, యేటా అంబేద్కర్ పేరిట అవార్డు ఇచ్చేందుకు రూ.51 కోట్ల శాశ్వత నిధి ఏర్పాటు చేయడం గొప్ప విషయం. దేశంలో ఏ రాష్ట్రంలో లేనట్లు తెలంగాణలో అంబేద్కర్కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. మా దళిత జాతి గర్వించే బిడ్డకు ఇస్తున్న ప్రాధాన్యం.. మా గౌరవాన్ని పెంచుతుంది. అంబేద్కర్ కేవలం దళితులకు సంబంధించిన వ్యక్తి మాత్రమే కాదు యావత్ దేశ ప్రజలకు ఆయన ఆరాధ్యదైవం. సకల జనుల సమానత్వం కోసం పరితపించిన అందరివాడు. ఆయన చూపిన బాటలో తెలంగాణ సీఎం కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ యావత్ దేశానికే మార్గదర్శనం చేస్తున్నారు. ఇలాంటి నాయకుడు దేశానికి ప్రాతినిధ్యం వహించాలి. అందుకోసం మేమంతా ఆయన వెంటే ఉంటాం. అంబేద్కర్ అడుగుజాడల్లో నడిచి కేసీఆర్ నాయకత్వంలో దేశంలో వచ్చే విప్లవాత్మక మార్పులో మేము సైతం పాల్గొంటాం. ఇదీ రాష్ట్రంలోని దళితులు కేసీఆర్ గురించి చెబుతున్న మాటలు. అంబేద్కర్ విగ్రహావిష్కరణతో తమ గౌరవం పెరిగిందని సంబురపడుతున్న దళిత మేధావులు, సంఘాల నాయకులను శనివారం ‘సమస్తే తెలంగాణ’ పలకరించింది. ఈ సందర్భంగా అభిప్రాయాలు వారి మాటల్లోనే..
చరిత్రలో నిలిచిపోతోంది..
బడుగు, బలహీన వర్గాల ఆశాదీపం, మహోన్నత శిఖరం డాక్టర్ భీమ్రావ్ రాంజీ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో 125 అడుగుల ఎత్తులో ఏర్పాటు చేయడం చరిత్రాత్మకం. ఈ ఘట్టానికి అంకురార్పణ చేసిన సీఎం కేసీఆర్ చరిత్రలో నిలిచిపోతారు. రాష్ట్ర పరిపాలన కేంద్రమైన నూతన సచివాలయానికి సమీపంలోనే బాబా సాహెబ్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం స్ఫూర్తిదాయకం. ప్రభుత్వాలు మారినప్పటికీ ఇలాంటి సాహసోపేతమైన ఘట్టాలు ఆవిష్కరించలేక పోయాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే స్ఫూర్తిగా నిలిచింది. చిన్న రాష్ర్టాల ఏర్పాటు ప్రతిపాదనకు ఆయనే మార్గదర్శకుడు. 125 అడుగుల విగ్రహాన్ని నిర్మించేందుకు దాదాపు రూ.150 కోట్లు ఖర్చు చేయడం గర్వించ దగ్గ విషయం. సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న దళితబంధు కూడా చరిత్రలో నిలిచిపోనుంది. రాష్ట్ర పాలన బాబాసాహెబ్ రచించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ సాగుతుండటం హర్షనీయం.
– డాక్టర్ దామెర రాములు, ప్రముఖ కవి, రచయిత.
స్వర్ణాక్షరాలతో రాయదగ్గ అంశం
అన్ని కులాలు, మతాలు, స్త్రీలు, పురుషుల సమన్యాయానికి మహామనిషి అంబేద్కర్ అమూల్యమైన రాజ్యాంగాన్ని రాశారు. అలాంటి మేధావి, మానవతావాది 125 అడుగుల కాంస్య విగ్రహాన్ని రాష్ట్ర రాజధాని నడిబొడ్డున ఏర్పాటు చేయడం మామూలు విషయం కాదు. ఈ మహాకార్యం సీఎం కేసీఆర్తోనే సాధ్యమైంది. ఒకవైపు మొగులు మీది నుంచి హెలికాప్టర్తోని పూల వాన.. ఇటు సీఎం సార్, అంబేద్కర్ మనవడు ప్రకాశ్ అంబేద్కర్ ఆవిష్కరణ చేసే దృశ్యాలను మా కుటుంబం సహా చూసి సంతోషించినం. మేమే కాదు మా గ్రామంలోని అందరూ టీవీల ముందే ఉన్నరు. ఈ చిత్రాలు చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగినవి. దేశంలోని ప్రతి మనిషి సగౌరవంగా నిలదొక్కుకుని బతికేందుకు అంబేద్కరే కారణం. అటువంటి మహానుభావుడి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం గర్వకారణం.
– చింతల శ్రీనివాస్రెడ్డి, రైతు, కరంజి(టీ), భీంపూర్ మండలం.
గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారు
మన దేశంలో దళితులు వందల ఏళ్లుగా అంటరాని వారుగానే జీవించారు. కుల వివక్షతో చదువు, సమాజానికి దూరంగా బతికారు. ఇలాంటి సామాజిక రుగ్మతలను పోగొట్టి దేశంలోని పౌరులందరికీ సమాన హక్కులు కల్పించింది బాబా సాహెబ్ అంబేద్కర్. ప్రపంచంలోనే అత్యున్నత చదువులు చదివి భారతదేశానికే కీర్తి సంపాదించిపెట్టారు. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో, వర్గాల్లో ఇంకా కుల వివక్ష ఉంది. పలు రాజకీయ పార్టీలు కులాలు, మతాలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేస్తున్నాయి. వాటి స్వలాభం కోసం వివక్ష చూపుతున్నాయి. తెలంగాణలో అన్ని వర్గాలకు సమన్యాయం చేస్తున్నది ఒక్క కేసీఆరే. దళితుల సంక్షేమంపై చిత్తశుద్ధితో పాలన సాగిస్తున్నారు. హైదరాబాద్లో ఆవిష్కరించిన 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దేశంలోని దళితులందరినీ ఆలోచింప జేస్తోంది. బీజేపీ పాలన సాగిస్తున్న మహారాష్ట్రలో అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేస్తామని కేంద్రం చేసిన ప్రకటన కేవలం హామీలకే పరిమితమైంది. దళితులు, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతిపై చిత్తశుద్ధి ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. అంబేద్కర్ గొప్పతనాన్ని, ప్రతిభను ప్రపంచానికి తెలిసేలా అత్యంత భారీ విగ్రహాన్ని ఆవిష్కరించారు. దేశంలోని దళితులకు నేనున్నాననే సందేశాన్ని తెలియజెప్పారు. దేశంలో కుల వివక్షపోయి దళితులు అభివృద్ధి చెందాలంటే సీఎం కేసీఆర్లాంటి నాయకుడితోనే సాధ్యమవుతోంది.
– దుర్గం జ్ఞానేశ్వర్, లెక్చరర్, బెజ్జూర్
ఆత్మ గౌరవాన్ని నిలబెట్టారు..
అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దళితులకే కాదు అన్ని వర్గాలకూ మేలు చేసేదిగా ఉంది. బాబాసాహెబ్ అన్ని వర్గాలు సమానంగా అభివృద్ధి చెందాలని భావించారు. అందుకు వెనుబడిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు కల్పించారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం ప్రకారమే దేశంలోని అన్ని వర్గాలకు సమానంగా ఫలాలు అందుతున్నాయి. తెలంగాణలో ముఖ్యమంత్రి అన్ని వర్గాలకు సమాన ప్రాధాన్యత కల్పిస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలకనుగుణంగా రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారు. అన్ని వర్గాల అభ్యున్నతి కోసం అనేక పథకాలు అమలు చేస్తున్న ఘనత ఆయనకే దక్కుతుంది. రాజ్యాంగం ప్రకారం ఎస్టీ, ఎస్సీ, బీసీలకు అందాల్సిన ఫలాలను కేసీఆర్ సమానంగా అందిస్తున్నారు. అంబేద్కర్ ఆశయాలను ఆచరణలో పెడుతున్నారు. హైదరాబాద్లో ఆవిష్కరించిన 125 అడుగులు భారీ అంబేద్కర్ విగ్రహం దేశంలోని దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెట్టింది. దేశంలో వెనుబడిన సామాజిక వర్గాల అభివృద్ధికి సీఎం కేసీఆర్లాంటి ఆలోచన కలిగిన నేతల అవసరాన్ని గుర్తించేలా చేసింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ సామాజిక వర్గాల అభివృద్ధికి కృషిచేస్తున్న సీఎం కేసీఆర్కు దేశంలోని అన్ని వెనుకడిన వర్గాలు రుణపడి ఉంటాయి. – భీమనాదుల మహేశ్, ప్రధానోపాధ్యాయుడు, బీబ్రా, దహెగాం
దళితుల మనసు గెలిచిన కేసీఆర్
డాక్టర్ అంబేద్కర్ భారీ విగ్రహ ఏర్పాటుతో దళితులనే కాదు బహుజను లందరి మనసు గెలిచిండు కేసీఆర్. ఆయన లాంటి లీడర్ దేశానికి అవసరం. రాష్ట్ర సర్కారు దళితులను అన్ని రంగాల్లో ప్రోత్సహిస్తు న్నది. అంబేద్కర్ జయంతి సందర్భంగా దళితుడినైన నాకు ఉత్తమ పారిశ్రామికవేత్త అవార్డు ఇవ్వడం సంతోషం. దళితుల చాంబర్ ఆఫ్ కామర్స్కు రెండెకరాల భూమి కేటాయిస్తారని ప్రకటించారు. తెలంగాణ ఉద్యమంలో ఊరూరా తిరిగి మాలాంటోళ్ల కష్టాలు చూసిండు కేసీఆర్. కాబట్టే.. సమాజంలోని అణగారిన వర్గాలను పైకి తీసుకురావాలనే తపన స్పష్టంగా కనిపిస్తున్నది. దళితుబంధు ప్రపంచంలోనే అద్భుతమైన పథకం. నా లాంటి పారిశ్రామిక వేత్తలు మరెందరో రావడానికి ఈ పథకం బీజం వేస్తున్నది. ఇప్పటికే నాకు తెలిసిన మిత్రులు నలుగురు కలిసి సిరామిక్ పరిశ్రమ పెట్టారు. ఇది కదా దళితులకు కావాల్సిన మార్పు.
– చిట్టుకూరి మల్లేశ్, ప్రముఖ పారిశ్రామిక వేత్త, మంచిర్యాల.
దళిత జనోద్ధారకుడు కేసీఆర్
ప్రపంచంలోనే అత్యంత ఎతైన అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్లో ఆవిష్కరించడం గొప్ప విషయం. ఇది చరిత్రలో నిలిచిపోతుంది. బాబా సాహెబ్ రచించిన రాజ్యాంగం ప్రకారమే దేశపాలన సాగుతున్నప్పటికీ ఇప్పటి వరకున్న నాయకులెవరూ ఆయన గొప్పతనాన్ని గుర్తించలేదు. అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారమే ప్రత్యేక తెలంగాణ ఏర్పడింది. ప్రపంచ మేధావి అయిన అంబేద్కర్ గొప్పతన్నాని గుర్తించి హైదరాబాద్ నడిబొడ్డున 125 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేయడం దళితుల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలుస్తుంది. దళితుల అభ్యున్నతి కోసం తెలంగాణలో అమలవుతున్న కార్యక్రమాలు దేశంలో ఎక్కడా లేవు. దళితుల ఆత్మగౌరవ నినాదం.. జై భీం. దళితుల సంక్షేమం కోసం చిత్తశుద్ధితో పనిచేస్తున్న నాయకుడు దేశంలో ఒక్క కేసీఆరే. అందుకే తెలంగాణలో దళితులు ఆర్థికంగా ఎదుగుతున్నారు. దశాబ్దాలుగా అంటరానితనానికి గురైన దళితులు ఇప్పుడిప్పుడే అందరితో కలిసిపోతున్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, సామాజిక చైతన్య కార్యక్రమాలతో దళితులు అన్ని రంగాల్లోనూ అడుగుపెడుతున్నారు. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఇంకా కుల వివక్ష, మత వివక్ష కొనసాగుతూనే ఉంది. అన్ని వర్గాల ప్రజలు సమానమే అని చాటిచెప్పిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్కు దళిత సమాజం రుణపడి ఉంటుంది. దేశంలోని దళితులు, అట్టడుగు వర్గాలకు ఆశాజ్యోతి అయిన అంబేద్కర్ విగ్రహాన్ని ఆకాశానికి ఎత్తిన ముఖ్యమంత్రి కేసీఆర్ దళిత జనోద్ధారకుడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. – మాముల సోమన్న, లెక్చరర్, దహెగాం
125 అడుగుల విగ్రహం న భూతో న భవిష్యతి..
అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహాన్ని సీఎం కేసీఆర్ ఆవిష్కరించడం చాలా సంతోషం. 125 అడుగుల విగ్రహం న భూతో న భవిష్యతి. రాజ్యాంగ నిర్మాత పేరిట సెక్రటేరియట్కు పేరు పెట్టడం, అక్కడే విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేయడం గొప్ప విషయం. అంబేద్కర్కు తెలంగాణ సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యానికి నిదర్శనం. కేసీఆర్ వచ్చాకే తెలంగాణ బాగు పడ్డది. రాష్ట్రంలోని దళితుల బతుకులు బాగు పడుతున్నాయి. ప్రపంచంలోనే ఎక్కడా లేని దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టి అంబేద్కర్ ఆశయ సాధనకు శ్రీకారం చుట్టిన ఏకైక సీఎం కేసీఆర్. దళితులకు రిజర్వేషన్లు ఇచ్చినా.. నేటికీ అంటరాని వారిగానే, పేదవారిగానే, కూలీ పనులు చేసే వారిగానే మిగిలిపోతున్నారు. ఈ విషయాన్ని గుర్తించి కేసీఆర్ దళితులు ఆర్థికంగా బలవంతులు కావాలి. కూలీల నుంచి యాజమానుల స్థాయికి ఎదిగినప్పుడే వెనుకబాటు తనం పోతుందని గుర్తించి దళితబంధు పథకాన్ని ప్రవేశపెట్టారు. ఆ పథకం కింద లబ్ధిపొందిన ఎందరో దళితబిడ్డలు ఈ రోజు సొంత వ్యాపారాలు, కుటీర పరిశ్రమలు పెట్టుకొని ఎదుగుతున్నారు. ఇది సూపర్ సక్సెస్ ప్రోగ్రాం. తెలంగాణలో దళితబిడ్డ బాగు పడినట్లు దేశంలోని దళితులందరూ బాగుపడాలని దళితబంధును దేశవ్యాప్తంగా అమలు చేస్తామని చెప్పడం గొప్ప విషయం. అందుకే దేశానికి కేసీఆర్ నాయకత్వం అవసరం.ఆయన లాంటి లీడర్తోనే అంబేద్కర్ ఆశయాల సాధన సాధ్యం అవుతది.
– దుర్గా ప్రసాద్, ఎస్ఈ కార్పొరేషన్ ఈడీ, మంచిర్యాల