వారంతా పేదింటి బిడ్డలు.. చదువుల్లో ‘బంగారు’ కొండలు.. బాసర ఆర్జీయూకేటీలో 2017-23 బ్యాచ్లో ఆరేండ్ల సమీకృత ఇంజినీరింగ్ పూర్తి చేశారు. ఏడు బ్రాంచీల్లో గోల్డ్ మెడల్స్ సాధించి ఆదర్శంగా నిలిచారు. నేడు హైదరాబాద్లో నిర్వహించనున్న స్నాతకోత్సవంలో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి చేతుల మీదుగా మెడల్స్ అందుకోనున్నారు. ట్రిపుల్ ఐటీలో మెరిసిన ఈ ఆణిముత్యాలపై ‘నమసే’్త ప్రత్యేక కథనం
వారందరిదీ గ్రామీణ నేపథ్యం. ఎక్కడి నుంచో వచ్చి ఒకే చోట విద్యనభ్యసించారు. ఆరేండ్లు అంతా కలిసి చదువుకున్నారు. మిక్కిలిగా వ్యవసాయ, ఇతర కూలీ పనులు చేసుకునే కుటుంబాల వారే ఎక్కువగా ఉన్నారు. తల్లిదండ్రుల రుణాన్ని తీర్చుకునేలా బాసరలో ట్రిపుల్ ఐటీలో 2017-23 బ్యాచ్ పూర్తి చేసుకున్న వారిలో 7 బ్రాంచీల్లో గోల్డ్మెడల్ సాధించారు. శనివారం హైదరాబాద్లోని గచ్చిబౌలిలో బ్రహ్మకుమారీస్ గ్లోబల్ పీస్ ఆడిటోరియంలో జరిగే స్నాతకోత్సవంలో విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి చేతుల మీదుగా మెడల్స్ అందుకోనున్నారు. బాసర ట్రిపుల్ఐటీలో చదువుకున్న ఈ విద్యార్థులపై ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
మా నాన్న బాలాజీ. నా పదోతరగతి పూర్తి కాగానే గుండెపోటుతో చనిపోయారు. అప్పటి నుంచి అమ్మ పద్మ కష్టపడి టైలరింగ్ చేస్తూ నన్ను చదివించింది. మా ఇద్దరు అక్కయ్యల పెండ్లిళ్లు కూడా తనే చేసింది. యూనివర్సిటీ టాపర్తో పాటు సీఎస్సీ విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్ సాధించాను. చాలా సంతోషంగా ఉంది. ప్రస్తుతం నిజామాబాద్లోని టెక్ యట్ కోర్ కంపెనీలో ఉద్యోగం చేస్తూ గేట్కు ప్రిపేరవుతున్న. భవిష్యత్లో ఇంకా మంచి కంపెనీలో ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తున్న. -సాయితేజ, సీఎస్సీ, యూనివర్సిటీ టాపర్, మేడ్చల్
మా నాన్న బశెట్టి, అమ్మ చంద్రకళ వ్యవసాయ పనులు చేస్తూ నన్ను కష్టపడి చదివించారు. ప్రస్తుతం మేధ సర్వో ప్రముఖ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను. నాకు ఆరేండ్లపాటు బాసర ట్రిపుల్ఐటీలో ఆధ్యాపక సిబ్బంది ఎంతో మెళకువలు, ఒడిదొడుకుల్లో నిర్ణయాలు తీసుకోవడం నేర్పించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా కష్టపడుతున్న. మా అమ్మానాన్నల రుణం తీర్చుకుంటాను.
తండ్రి సూర్యనారాయణ, జయలకు మేమిద్దరం. నేను రెండో అమ్మాయిని. 2017లో ట్రిపుల్ఐటీలో సీటు సాధించాను. మా నాన్న ఆటో నడుపుతూ నన్ను చదివించాడు. మా అన్నయ్య కూడా ప్రముఖ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ప్రస్తుతం నాకు ఈసీఎస్ డిజిటల్లో ఉద్యోగం వచ్చింది. త్వరలోనే ఉద్యోగంలో చేరుతాను. నాకు ఉన్నత మెళకువలు నేర్పిన యూనివర్సిటీ, అధ్యాపకులకు రుణపడి ఉంటా.
మా నాన్న మల్లేశం 2012లో రోడ్డు ప్రమాదంలో చనిపోయాడు. అప్పటి నుంచి మా అమ్మ మంగ అన్నీ తానై నన్ను కష్టపడి చదివించింది. అన్నయ్య ప్రస్తుతం టీసీఎస్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. ప్రస్తుతం నేను గేట్ ఎంట్రన్స్ కోసం కోచింగ్ తీసుకుంటున్న. భవిష్యత్తులో స్టేట్స్కి వెళ్లి ఉన్నత చదువులు చదివి, మంచి స్థానంలో నిలబడి నాన్నలేని లోటును తీరుస్తాను.
భిక్షపతి, శారదలకు నేను రెండో కొడుకుని. మా నాన్న ఆటో డ్రైవర్గా పని చేస్తూ ఉదయం నుంచి రాత్రి వరకు కష్టపడుతూ, మా అమ్మ కూలి పని చేస్తూ నన్ను చదివించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివి బాసర ట్రిపుల్ఐటీలో సీటు సంపాదించి ప్రస్తుతం డెక్కన్ కెమికల్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న. మా చెల్లెలు కళ్యాణి డిగ్రీ చదువుతున్నది. ఏడాదికి 4 లక్షల ప్యాకేజీతో ఉద్యోగం చేస్తున్న. అమ్మానాన్నలు కష్టపడకుండా వారికి అండగా ఉంటున్న.
మా నాన్న కిషన్సింగ్, అమ్మ పార్వతీబాయి వ్యవసాయ కూలీలుగా పని చేస్తున్నరు. మా ముగ్గురు అన్నదమ్ములను కష్టపడి చదివించిన్రు. ట్రిపుల్ఐటీలో సీటు సంపాదించిన అనంతరం చాలా కష్టపడి చదివా. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ ఎంపిక చేసుకున్న. ప్రస్తుతం ఐఐటీ మద్రాసులో ఎంటెక్ చదువుతున్న. ఐఐటీ మద్రాసు వచ్చే కంపెనీల్లో ప్లేస్మెంట్ కోసం కృషి చేస్తున్న. నాకు ట్రిపుల్ఐటీలో ఎప్పటికప్పుడు మెళకువలు నేర్పిన అధ్యాపకులు, సిబ్బందికి నేనెప్పుడూ రుణపడి ఉంట.