ఎదులాపురం( బేల) /భైంసా మార్చి 20: ముస్లింల పవిత్ర పండుగ అయిన ఈద్-ఉల్-ఫితర్ రంజాన్ను శనివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించేందుకు మసీదులు, ఈద్గాల వద్ద అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆదిలాబాద్లో ఈద్గా మైదానంలో ఏర్పాట్లను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పరిశీలించారు. పట్టణంలో ముఖ్యమైన ప్రదేశాలలో 250 మంది సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
ఆయన వెంట ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్ జీవన్ రెడ్డి, సీఐలు బీ సునీల్ కుమార్, కే నాగరాజు, ప్రణయ్ కుమార్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. భైంసా పట్టణంలోని గడ్డెన్నవాగు ప్రాజెక్టు వద్ద ఉన్న ఈద్గా వద్ద ప్రత్యేక ప్రార్థనలకు ఏర్పాట్లను నిర్మల్ జిల్లా ఎస్పీ జానకీ షర్మిల పరిశీలించారు. బందోబస్తుపై పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఆమె వెంట ఏఎస్పీ సాయికిరణ్, పట్టణ సీఐ సాయికుమార్, రూరల్ సీఐ ప్రవీణ్ కుమార్, తదితరులున్నారు.