భైంసా, జూన్ 20: పోటీ ప్రపంచంలో జన జీవనం ఉరుకుల, పరుగుల మయమైపోయింది. సమయానికి ఉన్న విలువ అంతా ఇంతా కాదు. వృత్తిపరమైన, వ్యక్తిగతమైన ఒత్తిళ్లు, ట్రాఫిక్ రద్దీతో అసహనం సరే సరి. కాలుష్య భూతంతో వెంటాడుతున్న రోగాలు, ఏది చేద్దామన్న ఇబ్బందే. వీటన్నింటి నుంచి కాసింత ఉపశమనానికి యోగానే చక్కని ఔషధం అంటూ నిపుణులు శాస్త్రీంగా నిరూపించారు. అన్ని రోగాలకు ఇదే మందు. చిన్న చిన్న రోగాలకు సైతం పాశ్చాత్య వైద్యం వైపు పరుగులు తీసే ఈ రోజుల్లోనే యోగా అన్ని రోగాలకు సంజీవనిలా మారింది. యోగా అభ్యాసనం, మనిషికి ఆరోగ్యం, శక్తి, తేజస్సు, చురుకుదనాన్ని అందిస్తుందని నిపుణులు చెబుతున్నారు. యోగాలో అంతర్భాగమైన సరళ విన్యాసాన్ని అనుసరిస్తే దేహ రక్షణ సిద్ధించడంతో పాటు మనో వికాసం వృద్ధి చెందుతుందంటున్నారు.
కఠిన ఆసనాల జోలికి వెళ్లొద్దు
యోగా అభ్యాసనం ఎప్పుడూ ప్రకృతికి దగ్గరగా ఉండడం ద్వారా మంచి ఫలితాలనిస్తుంది. ఎంచుకున్న స్థలం ఎత్తు పళ్లాలు లేకుండా సమాంతరంగా ఉండాలి. స్థిరంగా ఒక భంగిమలో కూర్చోవాలి. మంచి వాతావరణం, వెలుతురు, గాలి వచ్చేలా ఉన్న స్థలాన్ని ఎంచుకోవాలి. శక్తికి మించిన వ్యాయమాలు చేయకుండా కొద్ది కొద్దిగా సాధన చేస్తూ ఉండాలి.
యోగాతో మానసిక ప్రశాంతత
యోగా మనలోని బద్దకాన్ని తొలగిస్తుంది. సంపూర్ణ ఆరోగ్యానికి దోహదపడుతుంది. ప్రతిరోజూ యోగా చేస్తున్నా. యోగాతో మానసికంగా ప్రశాంతత కలుగుతుంది. ఆరోగ్యం, ఏకాగ్రత, మంచి వ్యక్తిత్వ నిర్మాణం, శాంతియుత స్వభావంతో ఉండగలుగుతాం.
శ్రీనివాస్, భైంసా