దస్తురాబాద్/దిలావర్పూర్/తలమడుగు, మార్చి 7; యత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా.. అంటే ఎక్కడ స్త్రీలు పూజింపబడుతారో అక్కడ దేవతలు సంచరిస్తారనేది నానుడి. భారతావనిలో స్త్రీ మూర్తులు అనాదిగా పూజలందుకుంటున్నారు. మహిళలు ఓర్పు, నేర్పు, సహనానికి మారుపేరు. వారు లేని ప్రపంచాన్ని ఊహించలేం. స్త్రీలు వంటింటి కుందేలు అన్న నానుడిని మార్చి ప్రతిరంగంలో రాణిస్తున్నారు. అవనిలో.. ఆకాశంలో సగం అంటూ ఆకాశమే హద్దుగా దూసుకెళ్తున్నారు. చదువు, కొలువులు, రాజకీయాల్లో సత్తా చాటుతున్నారు. ఇంటా, బయటా ప్రశంసలందుకుంటున్నారు. గృహిణిగా ఉంటూనే విధుల్లో ప్రత్యేకతను చాటుతున్నారు. జయహో జనయిత్రి.. జయహో విజయనారీ అని కీర్తించ బడుతున్నారు. తెలంగాణ సర్కారు కూడా మహిళలకు ప్రత్యేక గౌరవం ఇస్తూ పెద్దపీట వేస్తున్నది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ రంగాల్లో రాణిస్తున్న అతివలపై ప్రత్యేక కథనాలు..
పురుషులకు దీటుగా మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. పిల్లలకు ఆప్యాయత, అనురాగం పంచుతూనే ప్రయోజకులుగా తీర్చిదిద్దుతున్నారు. ఓ వైపు ఇంటి పనులు చక్కదిద్దుతూనే అంకితభావంతో వృత్తిలోనూ సేవలందిస్తున్నారు. ఇంటా, బయటా ప్రశంసలందుకుంటున్నారు. విద్య, వ్యాపారం, వాణిజ్యం, వ్యవసాయం, రాజకీయం, సమాజ సేవ వంటి రంగాల్లో ముందుంటూ విశిష్ట సేవలందిస్తున్నారు. ఇలా అన్ని రంగాల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ప్రత్యేక గౌరవం ఇస్తూ పెద్దపీట వేస్తున్నది. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
కన్నవాళ్లకు.. కన్నబిడ్డకు.. అన్నీ తానై..
ఏడడుగులు వేసి ఎల్లకాలం తోడుంటానని ప్రమాణం చేసిన భర్త, అనతి కాలంలోనే అనంత లోకాలకు వెళ్లిపోయాడు. ఇక ఒంటరి జీవితంలో కొడుకునే సర్వస్వంగా భావించి, బతుకుతున్నదీ తల్లి. తలమడుగు మండలం కజ్జర్ల గ్రామానికి చెందిన రైతు చింతల స్వామి రెడ్డి, శారద దంపతులకు ఇద్దరు కూతుళ్లు, పెద్ద కూతురు నల్ల స్వాతికి భీంపూర్ మండలంలోని నిపాని గ్రామానికి చెందిన నల్ల నరేందర్ రెడ్డితో వివాహం జరిపించారు. పెండ్లయిన నాలుగేళ్లకే భర్త చనిపోయాడు. రెండేండ్ల కొడుకు బాధ్యత తనపై వేసుకుంది. మొదట కుట్టు మిషన్ కుడుతూ వచ్చిన సంపాదనతో కొడుకును చదివించడం మొదలుపెట్టింది. మళ్లీ పెండ్లి చేసుకొమ్మని కుటుంబ సభ్యులు, బంధువులు ఒత్తిడి తెచ్చినా, ఇక ఈ జీవితం తన కొడుకును ప్రయోజకుడిని చేసేందుకే ఉపయోగిస్తానని చెప్పి ధైర్యంగా నిలిచింది. తన తండ్రి 25 ఏండ్లు నిర్వహిస్తున్న డెయిరీ ఫాం బాధ్యతను తనపై వేసుకుంది. రెండేళ్లుగా కూలీలతో కలిసి కజ్జర్ల గ్రామం నుంచి జిల్లా కేంద్రానికి వచ్చి రోడ్డుపై పాలు అమ్ముతున్నది. మరో వైపు యువతకు కుట్టు మిషిన్ నేర్పిస్తూ, ఉపాధి కల్పిస్తున్నది.
ఎవరిపై ఆధార పడొద్దని..
నా కొడుక్కి రెండేళ్లున్నప్పుడు నా భర్త చనిపోయిండు. అప్పటి నుంచి ఎవరిపై ఆధారపడొద్దని, ఎవరికీ భారం కాకూడదని అనుకున్న. 12 ఏండ్ల నుంచి కుట్టు మిషన్ కుడుతూ జీవనాన్ని కొనసాగిస్తున్న. అమ్మానాన్నలకు సంబంధించిన డెయిరీ ఫాంను కూడా రెండేండ్ల సంది నేనే చూసుకుంటున్న. ఇప్పుడు నా కొడుకుతో పాటు అమ్మానాన్న కూడా నాబిడ్డలే అయ్యిండ్రు.
-నల్ల స్వాతి
టీచర్ ‘లక్ష్మి’
పేదరికం, అంగవైకల్యాన్ని ఆత్మైస్థెర్యంతో జయించి ఉపాధ్యాయ వృత్తిలో రాణిస్తూ శభాష్ అనిపించుకుంటున్నది లక్ష్మి. నిర్మల్ జిల్లా దస్తురాబాద్ మండలంలోని బుట్టాపూర్ గ్రామానికి చెందిన సోగల లింగయ్య-లింగవ్వ దంపతులకు ఒక్కగానొక్క కూతురు ఆమె. ప్రస్తుతం మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నది. తను పదో తరగతి కూడా కలమడుగులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పూర్తి చేసింది. ఆ తర్వాత ఇంటర్ జన్నారంలోని ఓ ప్రైవేట్ కళాశాలలో పూర్తి చేసి, డైట్సెట్ రాసింది. ఆదిలాబాద్లోని ప్రభుత్వ డైట్ కళాశాలలో రెండేళ్ల టీచర్ ట్రైనింగ్ పూర్తి చేసింది. 2012లో డీఎస్సీ నోటిఫికేషన్ రాగా, పరీక్ష రాసి ఉద్యోగం సాధించింది. నిర్మల్ జిల్లా కుభీర్ మండలంలోని భీమేశ్వర్(టీ) గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో విధుల్లో చేరింది. అంగవైకల్యం ఉన్నా కుటుంబసభ్యుల ప్రోత్సాహం తనను ధైర్యంగా ముందుకు నడిపిస్తున్నదని చెబుతున్నది.
అమ్మానాన్న వల్లే..
మా కుటుంబాన్ని పోషించడానికి నాన్న బయటి దేశంలో పనికి వెళ్లేవాడు. ఇప్పుడు కూడా అక్కడే ఉన్నాడు. అమ్మ ఊళ్లోనే వ్యవసాయ, కూలీ పనులు చేస్తూ నన్ను, తమ్ముళ్లను చూసుకుంటున్నది. నాకు ఐదేళ్లున్నప్పుడే జ్వరంతో పోలియో కారణంగా వైకల్యం వచ్చింది. ఒక్కగానొక్క బిడ్డకు ఇలా జరగడంతో అమ్మానాన్న లోలోన బాధపడ్డా, నిత్యం నాకు మనోనిబ్బరాన్నే నూరిపోశారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించానంటే అది వారి వల్లే. అమ్మానాన్నలకు ఈ జన్మంతా రుణపడి ఉంటా.
– సోగల లక్ష్మి, బుట్టాపూర్,దస్తురాబాద్
స్వయంకృషితో నిలిచి..జాతీయ స్థాయిలో మెరిసి..
పెళ్లయ్యింది..రోజులు గడిచాయో లేదో అనుకోకుండా దంపతులు విడిపోవాల్సి వచ్చింది.. అమ్మ దగ్గరకు పుట్టెడు దుఖంతో వచ్చి చేరింది. ఆర్థికంగా అంతంత మాత్రంగా ఉన్న కుటుంబమే అయినా కుంగిపోలేదు. మనోధైర్యంతో ముందడుగు వేసింది. దిలావర్పూర్ మండలకేంద్రానికి చెందిన రాజుల లక్ష్మి స్వయంకృషితో నేడు నలుగురికి స్ఫూర్తిగా నిలుస్తున్నది. మెట్టినింటి నుంచి పుట్టింటికి చేరాక, తన కాళ్ల మీద తాను నిలబడాలనే ఆలోచనను పెంచింది. 2017లో స్త్రీనిధి ద్వారా రూ. 50 వేలు అప్పుగా తీసుకుంది. ఇంటి వద్దే ఓ కూరగాయల దుకాణం పెట్టుకుంది. తన అన్న కూతురును దత్తత తీసుకుంది. ఆ తర్వాత 2021 లో స్త్రీనిధి, బ్యాంకు ద్వారా రూ. 2లక్షలు అప్పుగా తీసుకుంది. తన ఇంటి పరిసర ప్రాంతంలో కిరాణ దుకాణం, పిండి గిర్నిని కూడా ఏర్పాటు చేసింది. ఇలా స్వయం సహాయక సంఘాల ద్వారా తీసుకున్న రుణాలతో వ్యాపారంలో దినదినాభివృద్ధి సాధించింది. ఇతర మహిళలకు ఆదర్శంగా నిలిచింది. ఆ తర్వాత అన్న కూతురికి వివాహం కూడా జరిపించింది. స్వయం కృషితో ఆదర్శంగా నిలిచిన లక్ష్మికి ఇటీవలే కేంద్రం గిరిజన జాతర ఆది మహోత్సవ్ పురస్కారం అందించింది.
చేసే పనిలో సంతోషం వెతుక్కున్నా..
పెళ్లయిన కొన్ని రోజులకే మేం విడిపోయాం. ఆ తర్వాత ఒంటరిగా పుట్టింటికి చేరిన. ఎవరి తోడు లేకుండా నా కాళ్లమీద నిలబడాలనే ముందుగా నాకు నేను ధైర్యం చెప్పుకున్నా. అదే నన్ను నడిపిస్తున్నది. చేసే పనిలో సంతోషం వెతుక్కున్నా. మా అన్న కూతురికి కూడా పెండ్లి చేయించిన. ఇంతకంటే నేను సాధించాల్సింది ఏముంది.
– రాజు లక్ష్మి
స్వరూప సేవలు భేష్
కోటపల్లి మండలం ఎసన్వాయి గ్రామానికి చెందిన ఆశ కార్యకర్త ముల్కల్ల స్వరూప ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తూ ప్రశంసలు అందుకుంటున్నది. 13 ఏళ్ల క్రితం ఆమె తన భర్తను కోల్పోయింది. ఆ సమయంలో గర్భిణిగా ఉన్నా.. ఏమాత్ర అధైర్యపడకుండా ముందుకు సాగింది. ప్రభుత్వ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ ఉత్తమ ఉద్యోగిగా పేరు సంపాదించుకుంది. ప్రజల ఆరోగ్య పరిరక్షణే ధ్యేయంగా విశేషంగా కృషి చేస్తున్నది. కరోనా సమయంలో ఏమాత్రం వెనుకడుగు వేయకుండా బాధితులకు మందులు అందజేయడంతో పాటు వారికి ధైర్యాన్నిచ్చి భేష్ అనిపించుకుంది. గ్రామంలో 100 శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేయించగా, అధికారులు ఆమెను అభినందించారు. ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాల సంఖ్య పెంచేందుకు విశేషంగా కృషి చేస్తున్నది. తన కూతురు జ్యోతిని కోటపల్లి కస్తూర్బా పాఠశాలలో ఏడో తరగతి చదివిస్తున్నది.
ప్రకృతి సేద్యం సాగులో ‘సుగుణ’
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలంలోని నాగసముద్రం గ్రామానికి చెందిన నందుర్క సుగుణ సేంద్రియ పద్ధతి ద్వారా సాగు చేస్తూ ఆదర్శంగా నిలస్తున్నది. తనకు ఐదెకరాలు ఉండగా.. ఒక ఎకరంలో రెడ్రైస్(నవారా), ఐదు గుంటల్లో బ్లాక్రైస్(కాలాబట్), 20 గుంటల్లో సన్ఫ్లవర్, 20 గుంటల్లో పెసర, పది గుంటల్లో దేశీ నువ్వులు, పది గుంటల్లో స్వీట్కార్న్, ఎకరంన్నరలో మక్క, పది గుంటల్లో సామలు, పది గుంటల్లో అరికెలు, అర ఎకరంలో చిక్కుడు, బెండ, బీర, కాకర, అల్చెంత, కొత్తిమీర వంటి కూరగాయలతోపాటు అరికెలు, సామల వంటి మిల్లెట్స్ను కూడా పండిస్తున్నది. పంట దిగుబడికి జీవామృతాన్ని వాడుతున్నారు. ఇందుకోసం ఇంటి వద్ద దేశీ ఆవులను పెంచుతున్నారు. పశువుల పేడ, మూత్రంతో కశాయాలను సొంతంగా తయారు చేసి వినియోగిస్తున్నారు. కాగా.. ఇద్దరు కుమారులు తోడ్పాటు, వ్యసాయాధికారుల ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్నారు. కేంద్ర మంత్రులతోపాటు, కలెక్టర్, ఉన్నతాధికారుల నుంచి ఆరు అవార్డులను అందుకున్నారు.