చిత్రంలో కనిపిస్తున్నది.. దండేపల్లి మండలంలోని మామిడిపెల్లి పాఠశాల. ఈ బడిని ‘మన ఊరు-మన బడి’ పథకంలో భాగంగా పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. రాష్ట్ర సర్కారు రూ.52 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో డైనింగ్ హాల్, తాగునీరు, వాష్ బేసిన్, బెంచీలు, గ్రీన్చాక్ బోర్డులు, విద్యుత్ ఆధునీకరణ, స్మార్ట్ క్లాసులు, ఫ్యాన్లు, మేజర్, మైనర్ మరమ్మతులు చేపట్టారు. వీటికితోడు అదనంగా రూ.3.50 లక్షలతో కిచెన్ షెడ్డు, బాలబాలికలకు వేర్వేరుగా మూత్రశాలలు నిర్మించారు. కాగా.. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా మంగళవారం విద్యా దినోత్సవం నిర్వహించనున్నారు. ఇందులోని మౌళిక వసతులను మంచిర్యాల ఎమ్మెల్యే దివాకర్రావు ప్రారంభించనున్నారు.
మంచిర్యాల, జూన్ 19(నమస్తే తెలంగాణ ప్రతినిధి) :మొండిగోడలు, శిథిలావస్థకు చేరిన తరగతి గదులు, ప్రహరీలు లేక పశువులు, పందులతో సహవాసం, మరుగుదొడ్లు లేక బాలికల అవస్థలు, కిచెన్ షెడ్లు లేక వర్షంలోనే వంటలు, కుళాయిలు లేక నీరు తాగకపోవడం వంటి వాటితో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు అవస్థలు పడ్డారు.సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని అమలు చేస్తున్న ‘మన ఊరు-మన బడి’ పథకంతో సర్కారు బడులు కొత్తరూపు సంతరించుకున్నాయి. వందల కోట్లు ఖర్చు చేయడంతో బడులు సర్వాంగ సుందరంగా మారాయి. మౌళిక వసతులతోపాటు కార్పొరేట్ స్థాయిలో విద్య అందిస్తుండడంతో ఉత్తీర్ణత కూడా పెరిగింది. గురుకులాలు, కేజీబీవీలు ఏర్పాటు చేయడంతో బడి బలోపేతమైంది. దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా నేడు(మంగళవారం) విద్యా దినోత్సవం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా విద్యారం గంలో వచ్చిన విప్లవాత్మక మార్పులపై ‘నమస్తే’ కథనం.
ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల జిల్లాగా పేరొందిన ఆదిలాబాద్లో విద్యా రంగాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. జిల్లాలోని పేద గిరిజనులు చదువుకుందామంటే బడి ఎక్కడుందో తెలిసేది కాదు. ఐదో తరగతి దాటి ఉన్నత పాఠశాలకు వెళ్లాలంటే కనీసం 15 కిలో మీటర్ల నుంచి 20 కిలోమీటర్లు వెళ్తే తప్పా బడి జాడ తెలిసేది కాదు. దీంతో చాలా మంది మధ్యలోనే చదువు మానేసి, పనిలోకి వెళ్లాల్సిన దుస్థితి. కానీ.. కొట్లాడి సాధించుకున్న తెలంగాణలో విద్యా రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. కొత్తగా గురుకుల పాఠశాలలు, కేజీబీవీలను ఏర్పాటు చేసింది. దీంతో నిరుపేద గిరిజన విద్యార్థులకు కార్పొరేట్ స్థాయి విద్య అందుబాటులోకి వచ్చింది. వీటికి తోడు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా తొలి విడుత ‘మన ఊరు- మన బడి’ కార్యక్రమంలో 996 పాఠశాలలను ఎంపిక చేసింది. వీటిలో 126 పాఠశాలలను పైలెట్ ప్రాజెక్ట్గా తీసుకొని పనులను పూర్తి చేసింది. మొత్తంగా రూ.307.84 కోట్లతో మన ఊరు- మన బడి పనులు శరవేగంగా సాగుతున్నాయి. గడిచిన తొమ్మిదేళ్లలో ఉమ్మడి జిల్లాలో విద్యావ్యవస్థ రూపురేఖలు మారిపోయాయి. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా నేడు(మంగళవారం) రాష్ట్రవ్యాప్తంగా విద్యా దినోత్సవం నిర్వహించనున్న నేపథ్యంలో జిల్లాలవారీగా తొమ్మిదేళ్లలో విద్యారంగంలో వచ్చిన విప్లవాత్మక అభివృద్ధిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న ప్రత్యేక కథనం.
పెరిగిన విద్యార్థులు..
మంచిర్యాల జిల్లాలో 2014 తరువాత తెలంగాణ ప్రభుత్వం కొత్తగా నాలుగు గురుకులాలు, ఐదు మహాత్మా జ్యోతిబా పూలే పాఠశాలలు, నాలుగు కేజీబీవీలను ఏర్పాటు చేసింది. వీటి ద్వారా ఇప్పటి వరకు 1,200 మంది విద్యార్థులు లబ్ధిపొందారు. ‘మన ఊరు-మన బడి’ పథకం కింద జిల్లాలో 248 పాఠశాలలను ఎంపిక చేశారు. ఇందులో 36 పాఠశాలల్లో 100 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన పాఠశాలల్లో పనులు జరుగుతున్నాయి. మొత్తం 1,049 బడులు ఉండగా సుమారు 1.20 లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో వసతులు మెరుగుపడడంతో 2014తో పోలిస్తే ప్రస్తుతం సర్కార్ స్కూళ్లలో చదువుకునే విద్యార్థుల సంఖ్య దాదాపు 5 శాతం పెరిగింది.
నిర్మల్ జిల్లాలో తెలంగాణ సర్కారు వచ్చాక కొత్తగా 15 గురుకుల సంక్షేమ పాఠశాలలు, ఐదు కేజీబీవీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటివరకు 9 వేల మంది విద్యార్థులు లబ్ధి పొందారు. ‘మన ఊరు-మన బడి’ కింద జిల్లాలో 260 సర్కారు పాఠశాలలు ఎంపికయ్యాయి. 130 పాఠశాలల్లో 100 శాతం పనులు పూర్తయ్యాయి. గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య దాదాపు 10 వేలకు పైగా పెరిగింది.
ఆదిలాబాద్ జిల్లాలో ప్రత్యేక రాష్ట్రంలో కొత్తగా ఆరు గురుకుల సంక్షేమ పాఠశాలలు, నాలుగు కేజీబీవీలను ఏర్పాటు చేశారు. వీటి ద్వారా ఇప్పటివరకు వేలాది మంది విద్యార్థులు బెనిఫిట్ పొందారు. ‘మన ఊరు-మన బడి’ కింద జిల్లాలో 236 సర్కారు పాఠశాలలు ఎంపికయ్యాయి. మొత్తంగా 80 స్కూళ్లలో 100 శాతం పనులు పూర్తయ్యాయి. గతంతో పోలిస్తే ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న విద్యార్థుల సంఖ్య 9 వేలకు పైగా పెరిగింది.
కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో తెలంగాణ వచ్చాక జిల్లా కు కొత్తగా ఏడు గురుకులాలు, మూడు కేజీబీవీలు మంజూరయ్యాయి. ఇప్పటి వరకు వీటి ద్వారా 4 వేల మంది పిల్లలు చదువుకున్నారు. ‘మన ఊరు-మన బడి’ కింద 253 పాఠశాలలను ఎంపిక చేయగా, పది స్కూళ్లలో పనులు పూర్తయ్యాయి. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం తీసుకురావడంతో సుమారు 10వేల మంది విద్యార్థులు పెరిగినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
విద్యాశాఖ ఉత్తరం
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా దినోత్సవాన్ని విజయవంతం చేయాలని విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యాశాఖ ఆహ్వాన పత్రం పంపింది. ఇందులో.. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉదయం 7 గంటలకు బడికి చేరుకోవాలని పేర్కొంది. 7.15 గంటలకు విద్యార్థులు ర్యాలీగా వెళ్లి తల్లిదండ్రులను పాఠశాలకు ఆహ్వానించాలి. ర్యాలీలో భాగంగా వీధి కూడళ్లలో విద్యకు సంబంధించిన పాటలు, నాటకాలు, డ్యాన్సులు విద్యార్థులతో చేయించాలి. ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణ చేయాలి. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించాలి.