ఆధ్యాత్మికతకు ఆలవాలంగా నిలిచిన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా.. సమైక్య పాలనలో అంధకారంలోకి వెళ్లింది. నిధులు కేటాయించక, నిర్వహణ సక్రమంగా లేక ప్రాశస్థ్యం కోల్పోయింది. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ పూర్వవైభవం తీసుకొచ్చారు. చిన్న గుడుల నుంచి పెద్ద ఆలయాల వరకు ధూప, దీప, నైవేద్య పథకం అమలు చేస్తూ వెలుగులు నింపుతున్నారు. గతంలో ఒక్కో గుడికి రూ.2,500 ఇవ్వగా.. ప్రస్తుతం రూ.6 వేలు ఇస్తున్నారు. పూజారులకు నెలనెలా వేతనం ఇస్తూ గౌరవిస్తున్నారు. కాగా.. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ తీసుకోవడం, అల్లోల ఇంద్రకరణ్రెడ్డి దేవాదాయ శాఖ మంత్రిగా కొనసాగుతుండడం వరంగా మారింది. ఈ ఏడెండ్లలో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు రూ.200 కోట్లతో 1000 ఆలయాలను పునరుద్ధరించారు. స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) కింద బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూరు చేశారు. తెలంగాణ రాష్ట్ర సర్కారు చర్యలతో ఆధ్యాత్మికత వెల్లివిరుస్తున్నది.
– నిర్మల్, జూన్ 20(నమస్తే తెలంగాణ)
నిర్మల్, జూన్ 20(నమస్తే తెలంగాణ) : ఉమ్మడి రాష్ట్రంలో ఆలయాల అభివృద్ధిపై అప్పటి పాలకులు నిర్లక్ష్యం వహించగా.. స్వపరిపాలనలో సీఎం కేసీఆర్ పురాతన ఆలయాల పునరుద్ధరణకు శ్రీకారం చుట్టా రు. చాలా చోట్ల ఆలయాల నిర్మాణం పూర్తికాగా.. కొన్ని చోట్ల పురోగతిలో ఉన్నాయి. జిల్లాకు చెందిన మంత్రి అల్లోల దేవాదా య శాఖ మంత్రిగా కొనసాగడం వరంగా మారింది. 2014కు ముందు దూపదీప నైవేద్యం నిర్వహణ కోసం ఒక్కో గుడికి రూ.2,500 మాత్రమే కేటాయించగా, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రూ.6 వేలకు పెంచింది. గతంలో కేవలం 155 ఆలయా లు మాత్రమే దూపదీప నైవేద్యం కింద కొనసాగగా.. ప్రస్తుతం 429కి చేరాయి. 2014 ముందు 101 ఆలయాల అభివృద్ధి, నూతన నిర్మాణాలకు కామన్ గుడ్ ఫండ్(సీజీఎఫ్) కింద రూ.22.32 కోట్లు కేటాయించారు. సీఎం కేసీఆర్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చొరవతో ఒక్క నిర్మల్ జిల్లాలోనే ఇప్పటి వరకు 754 ఆలయాల పునరుద్ధరణకు రూ.135 కోట్లు కేటాయించింది. ఇలా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సుమారు రూ. 200 కోట్లతో 1000 ఆలయాలను పునరుద్ధరించారు.
వీటితోపాటు స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్స్ (ఎస్డీఎఫ్) కింద బాసర ఆలయ అభివృద్ధికి రూ.50 కోట్లు మంజూ రు చేసింది. ఇందులో రూ.8 కోట్లను ప్రభుత్వం విడుదల చేయగా.. ఈ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు పూర్తయ్యా యి. ఈ నిధులతో భారీ షెడ్లు, ఆలయం చుట్టూ ప్రహారీ నిర్మించారు. దీంతోపాటు నిర్మల్లోని మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి రూ.3 కోట్లు కేటాయించగా, ఇటీవలే నూతనంగా నిర్మించిన ఆలయాన్ని మంత్రి ప్రారంభించారు. అలాగే అడెల్లి మహా పోచమ్మ ఆలయాభివృద్ధికి రూ.15 కోట్లు కేటాయించారు. ఈ నిధులను నాలుగు విడుతలుగా విభజించి.. మొదటి విడుత కింద రూ.3 కోట్లు మంజూరు చేశారు. ఈ నిధులతో పాత ఆలయం స్థానంలో కొత్త ఆలయాన్ని నిర్మించడంతోపాటు అతిథి గృహాలు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పించనున్నారు. అలాగే దిలావర్పూర్ మండలంలోని కాల్వ లక్ష్మీనరసింహస్వా మి ఆలయ పునరుద్ధరణకు రూ.2 కోట్లు కేటాయించారు. కదిలి పాపహరేశ్వరాలయం, నిర్మల్లోని నందిగుండం దుర్గామాత ఆలయం, గండిరామన్న సాయిబాబా ఆలయం, మంజులాపూర్ సాయిబాబా ఆలయం, దేవరకోట లక్ష్మీ వెంకటేశ్వరస్వామి ఆలయం మొదలగు వాటితోపాటు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్న అనేక దేవాలయాల అభివృద్ధికి, పునరుద్ధరణకు, ఇతర సదుపాయాల కల్పనకు కోట్లాది రూపాయలు మంజూరయ్యాయి.
ఆలయాల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత..
ప్రతి ఒక్కరిలో ఆధ్యాత్మిక బావన పెంపొందించడమే కాకుండా, మానసిక ప్రశాంతత, నైతిక విలువల పెంపునకు ఆలయాలు తోడ్పడుతాయి. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలోని అనేక ఆలయాలు తీవ్ర నిర్లక్షానికి గురయ్యాయి. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఆలయాల అభివృద్ధి, నూతన ఆలయాల నిర్మాణాలకు భారీగా నిధులు విడుదల చేస్తున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవ కారణంగానే ఆలయాలకు పూర్వ వైభవం చేకూరుతున్నది. సీఎం కేసీఆర్ నాకు దేవాదాయ శాఖను అప్పజెప్పడం సంతోషాన్నిచ్చింది. ఆలయాలకు అడిగిన వెంటనే కోరినన్ని నిధులు సీఎం కేసీఆర్ మంజూరు చేస్తుండడం హర్షనీయం.
– అల్లోల ఇంద్రకరణ్రెడ్డి, రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి.
చారిత్రక ఆలయాలకు పూర్వవైభవం
అప్పటి కాకతీయ రాజులు నిర్మించిన అనేక చారిత్రక ఆలయాలకు సీఎం కేసీఆర్, దేవాదాయశాఖ మంత్రి ప్రత్యేక చొరవ తీసుకొని మహర్దశ కల్పించారు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా 754 ఆలయాల పునరుద్ధరణకు రాష్ట్ర ప్రభుత్వం రూ.135 కోట్లు కేటాయించింది. ఇందులో నిర్మల్ నియోజకవర్గంలో రూ.107.82 కోట్లతో 640 ఆలయాల మరమ్మతులు, నూతన ఆలయాలు నిర్మించారు. ముథోల్ నియోజకవర్గంలో రూ.26.90 కోట్లతో 99 ఆలయాలను నిర్మించారు. ఖానాపూర్ నియోజకవర్గంలో రూ.46 లక్షలతో 15 గుడులను బాగు చేయించారు. కాగా ఆయా ఆలయాల నుంచి దూపదీప నైవేద్యం పథకం కింద 210 గుడులను ఎంపిక చేశారు. అలాగే కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 64 ఆలయాలకు, ఆదిలాబాద్లో 82, మంచిర్యాల జిల్లాలో 73 ఆలయాలకు దూపదీప పథకం కింద నిర్వహణ కోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.6 వేలను అందజేస్తున్నది.