కుమ్రం భీం పురిటిగడ్డ జోడేఘాట్ స్వరాష్ట్రంలో ప్రగతి బాట పట్టింది. సమైక్య పాలకుల పట్టింపులేని తనంతో అభివృద్ధికి నోచుకోని పోరుపల్లెలు.. నేడు బీఆర్ఎస్ సర్కారు ప్రత్యేక చొరవతో రూపురేఖలు మార్చుకొని ఆదర్శంగా నిలుస్తున్నాయి. 2014లో వీరుడి వర్ధంతికి హాజరైన సీఎం కేసీఆర్.. జోడెఘాట్ సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ ఒక్కొక్కటిగా నెరవేర్చగా, గిరిజనుల కలలు సాకారమయ్యాయి. అడవిబిడ్డలకు డబుల్ బెడ్ రూం ఇండ్లు, పోడు పట్టాలందించగా దశాబ్దాల సమస్యలు తొలగిపోయాయి. రూ. 15.70 కోట్లతో హట్టి నుంచి డబుల్ రోడ్డు నిర్మించగా, ‘దారి’ద్య్రం పోయి రాకపోకలు సాఫీగా సాగుతున్నాయి. రూ. 25 కోట్లతో స్మారక చిహ్నంతో పాటు మ్యూజియం నిర్మించగా, పర్యాటకు లను ఆకట్టుకుంటున్నాయి. నేడు కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
– కుమ్రం భీం ఆసిఫాబాద్(నమస్తే తెలంగాణ)/కెరమెరి, అక్టోబర్ 27
కుమ్రం భీం ఆసిఫాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ) : కుమ్రం భీం పోరుగడ్డ జోడేఘాట్ ప్రగతి బాట పట్టింది. గత పాలకుల పట్టింపులేని తనంతో ఆనవాళ్లు కోల్పోగా, స్వరాష్ట్రంలో సీఎం కే సీఆర్ ప్రత్యేక చొరవతో అభివృద్ధి చెందింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత 2014లో జోడేఘాట్లో నిర్వహించిన కుమ్రం భీం వర్ధంతికి ఆయన హాజరై చరిత్ర సృష్టించారు. జోడేఘాట్ను పర్యాటకంగా తీర్చిదిద్దుతామని, భీం వారసులను ఆదుకుంటామని పోరుగడ్డ సాక్షిగా ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారు. నేడు కుమ్రం భీం వర్ధంతి సందర్భంగా ‘నమస్తే తెలంగాణ’ ప్రత్యేక కథనం..
జోడేఘాట్.. ఆదివాసీల హక్కుల సాధన కోసం గిరిజనులను ఏకంచేసి.. ఆదివాసీ పోరాట పటిమ ను ప్రపంచానికి తెలిజేసిన గ్రామం. ఈ గ్రామంలో 50 కుటుంబాలు ఉంటాయి. అందరివి పూరి గుడిసెలే.. ఒక్క పక్కా ఇళ్లు కూడా లేదు. కనీసం తాగేందుకు నీటి కోసం కూడా వాగులపై ఆధారపడాల్సిం దే.. ఒక గ్రామానికి వెళ్లాలంటే కాలినడక కూడా న రకంగా అనిపించేలా అస్తవ్యవస్తమైన రోడ్డు ఉండి.. కుమ్రం భీం వర్ధంతికి అధికారులు వెళ్లే వాహనాలు కూడా బురదల్లో చిక్కుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కానీ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక జోడేఘాట్ పరిస్థితి పూర్తిగా మారింది. గ్రామానికి రెండువరుసల రహదారి వేశారు. గిరిజనులకు డ బుల్ బెడ్రూం ఇండ్లు వచ్చాయి. ఇంటింటికీ స్వచ్ఛమైన తాగునీరు అందుతున్నది. గ్రామానికి నిరంతర విద్యుత్ సౌకర్యం ఏర్పడింది.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడక ముందు ఉన్న జోడేఘాట్ పరిస్థితి… తెలంగాణ వచ్చిన తర్వాత ఉన్న స్థితికి స్పష్టమైన తేడా కనిపిస్తోంది… నాడు గుక్కెడు నీళ్లకోసం కూడా అనేక ఇబ్బందులు పడిన జోడేఘా ట్, దాని పరిసర గ్రామాల గిరిజనులు నేడు తమ ఇంటి వద్దకే వచ్చిన మిషన్ భగీరథ స్వచ్ఛమైన నీటితో దాహం తీర్చుకుంటున్నారు. జోడేఘాట్ పరిసరాల్లోని 12 గ్రామాలకు స్వచ్ఛమైన తాగునీరు అందుతోంది. హట్టి నుంచి జోడేఘాట్ వరకు నా డు కాలినడక కూడా వెళ్లలేని పరిస్థితి నుంచి.. నేడు రెండు వరుసల బీటీ రోడ్డు సౌకర్యం ఏర్పడింది. అర్ధరాత్రి కూడా గంటలోనే జిల్లా కేంద్రానికి సైతం చేరుకునేలా ప్రయాణం సులభతరమైంది.
నాడు పూరి గుడిసెల్లో ఉన్న జోడేఘాట్ గ్రామ గిరిజనులకు నేడు డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరయ్యాయి. గ్రామంలో 50 ఇండ్లు ఉంటే ప్రభుత్వం 30 డబుల్ బెడ్రూం ఇండ్లను మంజూరు చేసింది. దీనిలో 26 నిర్మాణాలు చేపట్టగా వీటిలో కొన్ని ప నులు పూర్తయ్యాయి. సమైక్య పాలనలో అభివృద్ధి అంటే ఏమిటో తెలియని పోరు గ్రామాల ఆదివాసీలు గత పదేళ్లుగా అభివృద్ధి బాటపడుతున్నారు. రాష్ట్రం సిద్ధించిన తర్వాత మొట్టమొదటిసారి సీఎం కేసీఆర్ జోడేఘాట్ను సందర్శించిన తర్వాత జోడేఘాట్ రూపురేఖలు పూర్తిగా మారిపోయాయి. రూ. 25 కోట్లతో గిరిజన మ్యూజియం, స్మారక చిహ్నం, స్మృతి వనం నిర్మాణాలు చేపట్టిన ప్రభుత్వం జోడేఘాట్కు తాజాగా రూ. 15 కోట్ల 70 లక్షలతో హట్టినుంచి జోడేఘాట్ వరకు రెండు వరుసల రహదారి నిర్మించి జోడేఘాట్ను పర్యాటక ప్రాంతంగా మా ర్చేసింది. జోడేఘాట్ పరిసరాల్లోని 12 ఆదివాసీ గ్రామాల అడవి బిడ్డలకోసం రూ. 2 కోట్ల 95 లక్షలతో చేపట్టిన ఆశ్రమ పాఠశాల నిర్మాణం పూరైంది. జోడేఘాట్లోలో సీసీ రోడ్ల నిర్మాణంతో పాటు, పరిసరాల్లోని 12 గ్రామాలకు ఇంటింటికీ స్వచ్ఛమైన నీటిని ప్రభుత్వం అందిస్తోంది.
ఒకప్పుడు కాలినడక కూడా కష్టంగా సాగే జోడేఘాట్ గ్రామానికి తెలంగాణ ప్రభుత్వం రూ. 15. 70 కోట్లతో రెండు వరుసల రహదారి నిర్మించింది. గతంలో మండల కేంద్రానికి కాలినడక, ఎడ్ల బండ్లపైనే వెళ్తూ ఇంతకాలం అష్ట కష్టా లు పడ్డ గిరిజను లు ఇప్పుడు నిమిషాల వ్యవధిలోనే మండలకేంద్రానికి చేరుకోగలుగుతున్నారు.. ఏ అర్ధరాత్రి అయినా ఆసుపత్రికి వెళ్లే అవసరమొచ్చిందటే ఒక్క ఫోన్కాల్తో ఆంబులెన్స్ వచ్చి దవాఖానకు తీసుకెళ్తోంది..
జల్ జంగల్ జమీన్ నినాదంతో ఆదివాసీలను ఏకం చేసి అడవిపై హక్కుల కోసం పోరాటం చేసిన కుమ్రం భీం ఆశయాలను కేసీఆర్ ప్రభుత్వం నెరవేర్చింది. ఆసిఫాబాద్ జిల్లాలోని 11,753 మంది రైతులకు 47,130 ఎకరాల పోడు భూములకు పట్టాలను పంపిణీచేసింది. తరతరాలుగా అభధ్రతా భావంతో పోడు వ్యవసాయం చేసుకుంటున్న ఆదివాసీ రైతులకు ప్రభుత్వం పట్టాలను అందించడం తో ఆ భూములపై ఆదివాసులకు సర్వహక్కులు కలిగాయి. అంతేగాకుండా రైతుబంధు, రైతుబీమా తో పాటు వ్యవసాయ అభివృద్ధికి అందిస్తున్న అన్ని పథకాలను ఆదివాసులు పొందగలుగుతున్నారు.
జోడేఘాట్ పరిసరాల్లోని శివగూడ గ్రామంలో మొ త్తం 13 కొలాం గిరిజన కుటుంబాలు ఉండగా, అందరికీ ఈ ఆధునిక మోడల్ ఇండ్లను ప్రభుత్వం నిర్మించింది. ఒక్కొక్క ఇంటిని రూ. 3 లక్షల ఖర్చు తో లబ్ధిదారులకు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తిగా ప్రభుత్వ నిధులతోనే ఈ కాలనీనీ నిర్మించింది. దాదాపు 20 ఏళ్ల వరకు మన్నికగా ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుకొని నిర్మించారు. నాణ్యతా ప్రమాణాలు గల ప్రత్యేకమైన ప్లైవుడ్తో గోడలు, పైకప్పుని రేకులతో నిర్మించారు. ఇంటిలోపల ఆకర్షణీమైన టైల్స్ వేశారు. ఇంట్లో కరెంట్, లైట్లు, ఫ్యాన్లు అన్ని ప్రభుత్వమే ఏర్పాటు చేసింది. ఒకప్పుడు పూరి గుడిసెల్లో నివసిస్తూ… వానకు తడు స్తూ ఎండకు ఎండిన కొలాం గిరిజనులు ప్రభుత్వం తమకు నిర్మించిన ఆధునిక ఇండ్లల్లో నివసిస్తుండడంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
జోడేఘాట్కు వెళ్లే దారిలో బాబేఝరి గ్రామం ఉంది. ఈ కొలాం గ్రామం దాదాపు నాలుగేళ్ల క్రితం ఏర్పడింది. అప్పటి నుంచి ఈ గ్రామానికి కరెంట్ లేదు.. విద్యుత్ వసతి కల్పించేందుకు ఆ శాఖ అధికారులు ప్రయత్నించినప్పటికీ కొన్ని కారణాల వలన సాధ్యం కాలేదు. అయితే శాశ్వత ప్రాతిపదికన విద్యుత్ సౌకర్యం కల్పించే వరకు ఎలాగైన వీరికి వెలుగులు కల్పించాలని అధికారులు భావించారు. దీంతో ఐటీడీఏ సహకారంతో ప్రత్యేకంగా సీసీడీపీ నిధులతో సోలార్ విద్యుత్ను ఏర్పాటు చేసి మోడల్ విలేజ్గా చేయాలనుకున్నారు. దీంతో ఒక్కొక్క ఇంటికి రూ. 70 వేలు ఖర్చుచేసి సోలార్ విద్యుత్ సౌకర్యాన్ని కల్పించారు. 12 కొలాం గిరిజన కుటుంబాలకు దాదాపు రూ. 8. 40 లక్షలతో సోలార్ సౌకర్యాన్ని కల్పించారు. రాత్రి ఈ గ్రామం మీదుగా వెళ్తుంటే చిమ్మ చీకట్లో నిండు వెన్నెల్లో ఈ గ్రామం వెలుగిపోతూ కనిపిస్తుంది.
కెరమెరి మండలంలోని జోడేఘాట్లో కుమ్రం భీం 83వ వర్ధంతిని ఆదివాసీలు సాంప్రదాయబద్ధంగా శనివారం నిర్వహించనున్నారు. ఎన్నికల కోడ్ ఉండడంతో యేటా వర్ధంతి నాడు నిర్వహించే గిరిజన దర్బార్ రద్దు చేశారు. కానీ ఆదివాసులు వేడుకలను నిర్వహించుకునేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. వచ్చేవారికి భోజన వసతితో పా టు ఇతర సదుపాయాలు కల్పించారు.
మండలంలోని జోడేఘాట్లో ఆదివాసులు శుక్రవారం రాత్రి సంప్రదాయబద్ధంగా అవ్వల్ పేన్ పూజలు చేశారు. గ్రామానికి రక్షణగా నిలిచే పోచమ్మతల్లిని భక్తిశ్రద్ధలతో దర్శించుకునేందుకు, సంప్రదాయ వాయిద్యాలతో భీం వారసులు ఊరేగింపుగా తరలివచ్చారు. భీం స్మృతి చిహ్నం చుట్టూ ప్రదక్షిణలు చేసి, నేరుగా అవ్వల్ పేన్ వద్దకు చేరుకున్నారు. భీం మనుమడు కుమ్రం సోనేరావ్ ఆధ్వర్యంలో ఆదివాసులు ప్రత్యేక పూజలు చేసి అమ్మవారికి గొర్రె, కోళ్లను బలిచ్చి మొక్కులు తీర్చుకున్నారు. అనంతరం అక్కడే వంటలు వండి సహపంక్తి భోజనం చేశారు.