భీంపూర్, ఫిబ్రవరి 24: ఆదిలాబాద్ జిల్లా భీంపూర్ మండలంలోని పిప్పల్కోటి రిజర్వాయర్ సమీప అటవీ ప్రాంతంలో గురువారం అర్ధరాత్రి నాలుగు పెద్ద పులులు కనిపించాయి. రిజర్వాయర్ నిర్మాణ పనులకు మట్టి తెస్తున్న ఓ టిప్పర్ డ్రైవర్కు ఇవి తారసపడ్డాయి. గుంజాల-గొల్లఘాట్ మార్గంలో వస్తుండగా ఒక పెద్దపులి, మూడు పిల్లలు రోడ్డు దాటుతూ కనిపించాయి. వాటిని చూసి వాహనం ఆపిన డ్రైవ ర్, వీడియో తీసి అధికారులకు సమాచారం ఇచ్చాడు.
కాగా, శుక్రవారం ఉదయం నుంచి ఈ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు పులుల సంరక్షణ చర్యలు చేపట్టారు. ఎఫ్ఆర్వో గులాబ్సింగ్, ఎఫ్ఎస్వో అహ్మద్ ఖాన్, ఎఫ్బీవోలు గులాబ్, సజన్ లాల్, బేస్ క్యాంపు సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. గొల్లఘాట్, గుంజాల, పిప్పల్కోటి శివార్లలో 10 సీసీ నైట్ విజన్ కెమెరాలు అమర్చామని, ఒక తల్లి పులి, మూడు పిల్లలు ఉన్నట్లు గుర్తించామని ఎఫ్ఆర్వో తెలిపారు.
సరిహద్దు దాటి వచ్చిన పెద్ద పులులు..
పెన్గంగా పరీవాహక అటవీ ప్రాంతంలో దశాబ్దకాలంగా పెద్ద పులులు సంచారం సాధారణం. మహారాష్ట్ర తిప్పేశ్వర్ అ భయారణ్యం నుంచి తెలంగాణ అడవుల వైపు పులులు వలసబాట పడుతున్నాయి. భీంపూర్ మండలం పిప్పల్కోటి, గొ ల్లఘాట్, తాంసి(కే) శివార్లలో రెండు నెలల పాటు సంచరించిన పులులు.. 2022, నవంబర్ 30న సరిహద్దు దాటి తిప్పేశ్వర్ వైపు వెళ్లాయి. 3 నెలలకే మళ్లీ ఉనికి చాటుకున్నాయి.