శ్రీరాంపూర్, డిసెంబర్ 21 : సింగరేణి గుర్తింపు ఎన్నికల నిర్వహణపై నెలకొన్న ప్రతిష్టంభన వీడింది. ఈనెల 27న గుర్తింపు సంఘం ఎన్నికలను యధాతథంగా నిర్వహించాలని గురువారం రాష్ట్ర హైకోర్టు తీర్పునిచ్చింది. సింగరేణి గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు వాయిదా వేయాలని కోరుతూ రాష్ట్ర ఇంధన శాఖ ముఖ్య కార్యదర్శి వేసిన పిటిషన్ను హైకోర్టు తోసిపుచ్చింది.
షెడ్యూల్ ప్రకారమే ఈ నెల 27న గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికలు నిర్వహించాలని హైకోర్టు ఆర్ఎల్సీని, యాజమాన్యాన్ని ఆదేశించింది. కొద్ది రోజుల నుంచి గుర్తింపు ఎన్నికల వాయిదాపై కార్మికులు, కార్మిక సంఘాల నాయకుల్లో ప్రతిష్టంభన నెలకొంది. గురువారం హైకోర్టు ఇచ్చిన తీర్పుతో సందిగ్ధతకు తెరపడింది. ఇక కార్మిక సంఘాలు ప్రచారం ముమ్మరం చేయనున్నాయి.