మంచిర్యాల అర్బన్, జూన్ 9 : జిల్లాలో ఈ ఏడాది యాసంగి సీజన్లో గత ఏడాది కంటే పెద్ద ఎత్తున ధాన్యం రైతు చేతికి వచ్చింది. అధికారులు వేసిన అంచనాలకు మించి ధాన్యం వెల్లువలా వచ్చి చేరింది. అధికారులు 2.30 లక్షల మెట్రిక్ టన్నులు వస్తాయని భావించగా.. ఇప్పటికే లక్షా 65 వేల 175 మెట్రిక్ టన్నుల ధాన్యం వివిధ ఏజెన్సీల నుంచి మిల్లులకు చేరుకుంది. తెలంగాణ ఏర్పడి మంచిర్యాల జిల్లా అయిన తర్వాత వ్యవసాయం రూపురేఖలే మారిపోయాయి. సమైక్య రాష్ట్రంలో యాసంగి సమయంలో ఉమ్మడి జిల్లాలోనే 17 వేల హెక్టార్ల మేర వరి పంట సాగయ్యేది. కానీ ఇప్పుడు ఒక మంచిర్యాల జిల్లాలోనే ఈ ఏడాది అధికారుల లెక్కల ప్రకారమే 95 వేల ఎకరాల్లో వరి సాగైంది. చెరువుల్లో పూడికతీత, ప్రాజెక్టుల వల్ల నీటి వసతి పెరిగింది. అటు కడెం నీటితోపాటు గూడెం ఎత్తిపోతల పథకం రైతులకు నీటి ఎద్దడి లేకుండా చేశాయి. దీంతో పాటు ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురియగా, రైతన్నకు ఎన్నడూ లేని విధంగా వరి ధాన్యం వెల్లువెత్తింది.
మిల్లులకు 1.65 లక్షల మె.ట. ధాన్యం చేరిక..
మంచిర్యాల జిల్లాలో యాసంగి సీజన్లో 2.30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేశారు. ఆ మేరకు పౌరసరఫరాల శాఖ, సంస్థ అన్ని ఏర్పాట్లు చేసింది. జిల్లాలో మూడు ఏజెన్సీల ద్వారా ధాన్యం సేకరణ ప్రారంభించారు. డీఆర్డీఏ (ఐకేపీ) ద్వారా 43 సెంటర్ల ద్వారా 17,388.800 మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించగా, 130 పీఏసీఎస్ సెంటర్ల ద్వారా 71,345.960 మెట్రిక్ టన్నుల ధాన్యం, 89 డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా 76,439.640 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశారు. 262 సెంటర్ల ద్వారా 1,65,174.400 మెట్రిక్ టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి మిల్లులకు పంపించారు.
అధికారుల అప్రమత్తత..
జిల్లాలో గత ఏడాది యాసంగిలో 1,13,080.360 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కొనుగోలు చేయగా.. 2023, జూన్ 7వ తేదీ వరకు 97,671.880 మెట్రిక్ టన్నులు కొన్నారు. కానీ ఈ ఏడాది అధికారుల కృషితో ఇప్పటికే లక్షా 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం మిల్లులకు చేరవేయగలిగారు. ఈ ఏడాది కొనుగోళ్లు ప్రారంభం నుంచే మబ్బులు వస్తుండడం, వర్షాలు కురుస్తుండడంతో రైతులు ఆందోళనకు గురయ్యారు. కలెక్టర్ బదావత్ సంతోష్ ఆదేశాల మేరకు అదనపు కలెక్టర్ బదావత్ మధుసూదన్ నాయక్ రవాణా శాఖ, సివిల్ సైప్లె అధికారులతో రంగంలోకి దిగారు. కొనుగోలు కేంద్రాల్లో ఆరిన దాన్యం వెంట వెంటనే తూకం వేసి లారీల్లో లోడ్ చేసేలా, మిల్లుల వద్ద అన్లోడింగ్ చేయించే పనిలో పడ్డారు. మరోవైపు లారీల కోసం దండేపల్లి మండలం కన్నెపల్లి (జన్నారం) చౌరస్తా, జైపూర్ మండలం ఇందారం ఎక్స్రోడ్, హాజీపూర్ మండలం వేంపల్లి ఆర్టీవో కార్యాలయం, తాండూరు మండలంలోని ఐబీ ప్రాంతంలో డీటీవో కిష్టయ్య, సివిల్ సైప్లె డీఎం దాసరి వేణు నేతృత్వంలో నాలుగు గ్రూపులుగా తయారై ఖాళీ లారీలను కొనుగోలు కేంద్రాలకు మళ్లించారు. 24 గంటలు రెండు గ్రూపులుగా ఏర్పడి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు లారీలను పంపించడంతో ధాన్యం వేగంగా మిల్లులకు చేరుకుంది.
పక్క జిల్లాలకు తరలింపు..
మంచిర్యాల జిల్లాలో మొదట 11 బాయిల్డ్ మి ల్లులకు ధాన్యం తరలించారు. ఈ మిల్లులు నిండుకోవడంతో బ్లాక్లిస్టులోఉన్న మరో నాలుగు మిల్లులకు తరలించారు. ఇదే సమయంలో పక్క జిల్లాలైన ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు సైతం ధాన్యం తరలించారు. గత ఏడాది 42 బాయిల్డ్, రా రైస్ మిల్లులకు తరలించిన అధికారులు ఈ ఏ డాది జిల్లాలోని కేవలం 15 బాయిల్డ్ మిల్లులతో పాటు రెండు జిల్లాల్లోని మిల్లులకు ధాన్యం చేరేలా పకడ్బందీగా చర్యలు తీసుకున్నారు. గత ఏడాది మంచిర్యాల జిల్లాలోని 42 మిల్లులు, ఆదిలాబాద్లోని రెండు, ఆసిఫాబాద్లోని 10, పెద్దపల్లిలోని 76, జిల్లాలోని 12 ఇంటర్మీడియట్ గోదాముల్లో 1,13,080 మెట్రిక్ టన్నుల ధాన్యం పంపించగా.. ఈ ఏడాది పక్కా ప్రణాళికతో కేవలం జిల్లాలోని 15 మిల్లులతో పాటు ఆదిలాబాద్లోని ఆరు మిల్లు లు, కరీంనగర్లో పది మిల్లులకు ఇప్పటికే లక్షా 65 వేల మెట్రిక్ టన్నుల ధాన్యం తరలించగలిగారు.
రైతుల అకౌంట్లలో రూ.90 కోట్లు జమ..
జిల్లాలో మూడు ఏజెన్సీల్లోని కొనుగోలు కేంద్రాలకు ఇప్పటి వరకు 22,795 మంది రైతులు ధాన్యాన్ని విక్రయించారు. ఈ నెల ఏడో తేదీ నాటికి 10,326 మంది రైతుల వివరాలను ట్యాబ్లో ఆన్లైన్ చేయగా.. రూ.90 కోట్లు వారి ఖాతాల్లో జమయ్యాయి. మరో 12,469 మంది రైతుల వివరాలు ట్యాబ్ ఎంట్రీ కావాల్సి ఉంది. అటు ధాన్యం మిల్లులకు చేర్చడమే కాకుండా అదే స్థాయిలో ట్యాబ్ ఎంట్రీ చేయిస్తూ రైతుల ఖాతాల్లో డబ్బులు జమయ్యేలా అధికారులు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నారు.
ఆఖరి గింజ వరకూ కొంటాం..
ప్రభుత్వ ఆదేశాల మేరకు జిల్లాలో ఆఖరి ధాన్యం గింజ వరకు కొనుగోలు చేస్తాం. గత ఏడాదితో పోల్చితే ఎక్కువ మొత్తంలో యాసంగిలో వరి పంట సాగైనట్లు అధికారులు వెల్లడించగా దానికి అనుగుణంగా ముందు నుంచే ప్రణాళికతో సాగుతున్నాం. గత ఏడాదితో పోల్చితే ఇప్పటికే 50 శాతం అధికంగా కొనుగోలు చేశాం. అంతే మొత్తంలో రైతుల అకౌంట్లలో డబ్బులు జమ చేశాం. ఆలస్యంగా ప్రోక్యూర్మెంట్ అయ్యే వేమనపల్లి, కోటపల్లి, తాండూరు తదితర మండలాల్లోనే ప్రస్తుతం ధాన్యం నిల్వలున్నాయి. వారంలోగా మొత్తం ధాన్యాన్ని తరలిస్తాం. ఇందుకోసం ఇంటర్మీడియట్ గోదాములు సైతం ఏజెన్సీలకు కేటాయించాం.
– మధుసూదన్, అదనపు కలెక్టర్, మంచిర్యాల