‘ఎద్దు, ఎవుసం తెల్వనోడు మాట్లాడితే గిట్లనే ఉంటది. తలుండదు, తోకుండదు.. అరికి ఎన్ని నీళ్లు అవసరమో తెలుసా.. వాణిజ్య తోటలకు, కూరగాయలు పండించడానికి ఎన్ని నీళ్లు కావాలో చెప్పగలరా.. అందరూ అగ్రనేతలే కదా.. ఇందులో ఎవుసం జేసినోడు ఒక్కడంటే ఒక్కడు లేరు. వాళ్లు వీళ్లు చెబితే మైకుల ముందు మొత్తుకోవడం తప్ప.. లెక్కలతో సహా చెప్పగలరా.. గదే కేసీఆర్ అయితే.. ముందు చూపుతో అంచనా ఏసి రైతన్నకు మేలు జేసే ఆలోచన జేస్తడు.
ఆయన ఆలోచన నుంచి పుట్టిందే 24 గంటల నిరంతర ఉచిత కరెంటు. దిగ్విజయంగా అమలు చేయడంతో రైతు రాజయ్యాడు. గిప్పుడేమో కాంగ్రెసోళ్లు సాగుకు మూడు గంటల కరెంటు సాలని, 10 హెచ్పీ మోటర్లు పెట్టుకొని నీరందించాలని చెబుతున్నరు. ఎవడైనా ఆలోచన ఉన్నోడు గీ మాటంటడా.. అందుకే కాంగ్రెసోళ్లు అవకాశం కోసం చూస్తున్నరు. వాళ్లు అధికారంలోకి వచ్చేది లేదు.. సచ్చేది లేదు.. మళ్లీ బీఆర్ఎస్సే హ్యాట్రిక్ సాధిస్తది.’ అని రైతులు ముక్తకంఠంతో నినదిస్తున్నరు. గాలి మాటలకు ఆగం కామని, ఆలోచించి ఓటు సద్వినియోగం చేసుకుంటామని తెలుపుతున్నారు.
– ఆదిలాబాద్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ)
కరెంట్ కోతలు పెడుతమని, కక్ష కట్టిన కాంగ్రెస్పై కర్షకలోకం కన్నెర జేస్తున్నది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ పాలనలో కరెంట్ కోతలతో అరిగోసపడ్డమని, చేల వద్ద నీటి పారుకం పెట్టడానికి కరెంటు కోసం ఎదురుచూస్తూ ఏనాడు కంటి నిండా నిద్రపోలేదని, ఇప్పుడు అది తలచుకుంటనే భయమైతుందంటున్నారు. ఎవుసానికి 24 గంటలు దండగ.. మూడు గంటల కరెంట్తో మస్తుగా ఎవుసం చేసుకోవచ్చు అంటున్నారని.. గైట్లెతే పారినమడే మళ్ల పారుతది. పొలం మొత్తం నీళ్లు అందవంటున్నరు. 10 హెచ్పీ మోటర్ పెట్టుకునేందుకు మస్తు పైసలైతయని, అది పెడితే నెల రోజుల్లోనే బోర్లు, బావులు అడుగంటి పోతాయంటున్నరు.
రైతులను ముంచే ముచ్చట కాంగ్రెస్ పార్టీ బంద్ పెట్టాలంటున్నరు. ఎప్పుడేం చేయాలో.. వ్యవసాయం ఎట్లా చేయాలే మాకు తెలుసునంటున్నారు. పొరపాటున వాళ్లకు ఓటేస్తే మాకు కరెంట్ షాక్ తగలడం ఖాయమని హెచ్చరిస్తున్నరు. మూడు గంటల కరెంటొద్దు.. 10 హెచ్పీ మోటార్లు వొద్దు.. కాంగ్రెస్ కటిక చీకట్లు అసలే వొద్దు.. రేవంత్రెడ్డి దోపిడీ మా కొద్దు అని తేల్చిచెప్తున్నరు. రైతులకు ఇప్పుడు వస్తున్న 24 గంటల కరెంటే బాగుందని, మరోసారి సీఎంగా కేసీఆర్ను చేసుకోవాలని చెప్తున్నరు.
– ఆదిలాబాద్, నవంబర్ 25(నమస్తే తెలంగాణ)
సొనాల, నవంబర్ 25 : దేవుల్నాయక్తండాలో పదెకరాల పొలం ఉంది. పత్తి, సోయా, కంది, శనగ పంటలు వేస్త. మాది వ్యవసాయ కుటుంబం. పదేండ్ల కిందట కరెంట్ లేక అరిగోస పడ్డం. షిప్టుల కింద కరెంట్ వచ్చేది. తెల్లందాక పోయి మోటరు పెట్టచ్చేది. సీఎం కేసీఆర్ ప్రభుత్వం ఎప్పుడైతే వచ్చిందో గప్పటి నుంచి 24 గంటల కరెంట్ వచ్చింది. కష్టాలు తీరి సుఖంగా వ్యవసాయం చేసుకుంటున్నం. ఇప్పుడు ఈ కాంగ్రెస్ నాయకుడు రేవంత్రెడ్డి వచ్చి రైతులకు 3 గంటలు కరెంట్ చాలు అంటున్నాడు. 3 గంటలు మడి తడవదు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే మా బతుకులు మళ్లీ మొదటికొచ్చనట్టే.
15 ఏళ్ల నుంచి 5హెచ్పీ మోటార్ వాడుతున్నాం. ఇప్పుడు 10 హెచ్పీ మోటార్లు కొనుక్కోవాలని చెబుతుండు. ఎన్ని లక్షల ఖర్చు కావాలే. గా పైసలు ఆయన ఇస్తడా? 24 గంటల కరెంట్ ఇస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వమే రావాలి. ఇంత మంచిగా కరెంట్ ఇస్తుండు కాబట్టే మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నం. సీఎం కేసీఆర్ సల్లగుంటే మా రైతులమంతా సల్లగున్నట్లే.
-జాదవ్ కృష్ణ, రైతు, దేవుల్నాయక్తండా గ్రామం, సొనాల
ఇంద్రవెల్లి, నవంబర్ 25 : కాంగ్రెసోళ్లు ఢిల్లీకి గులాం చేస్తరు. ఢిల్లీ లీడర్లు చెప్పిందే వాళ్లు చేస్తరు. చెప్పకుంటే చెయ్యరు. వాళ్లు ప్రజలకు మంచి చెయ్యలేరు. మూడు గంటలు కరెంట్ ఇయ్యమని ఢిల్లీ పెద్దలే రేవంత్ కు చెప్పినట్టు ఉన్నరు. అందుకే ఆయన అంటున్నడు. కాంగ్రెస్ పార్టీ నాయకులకు అస్సలు తెలివుందా.. ఆ రేవంత్ రెడ్డికి ఎవుసం ఎట్ల చేస్తరో తెలుసా.. ఒక్కసారి ఓ రైతు దగ్గరికి పోయి మాట్లాడితే తెలుస్తది. ఆయన రైతుల కష్టాన్ని చిన్నచూపు చూస్తున్నడు. అందుకే కాంగ్రెసోళ్లు రావొద్దు. వాళ్లకు మంచి చేసుడు చేతకాదు. వాళ్లను ముందుగాల ఓటుతో నే ఓడియ్యాలె. ఇప్పడు గవర్నమెంటోళ్లు 24 గంటల కరెంట్ ఇస్తున్నరు. రైతుకు ఎన్నో చేస్తున్నరు.
– రామారావ్, రైతు, రాంనగర్
బోథ్, నవంబర్ 25 : మాకు 18 ఎకరాల భూమి ఉంది. నీటి సౌకర్యం కూడా ఉంది. బోరుబావుల్లో మోటర్ల ద్వారా నీరు పెట్టుకుంటూ రెండు పండలు పండించుకుంటున్నం. బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరెంట్తో పత్తి, శనగ, విత్తనోత్పత్తి జొన్న పంటలకు నీటి తడులు పెట్టుకుంటూ పంటలు పండించుకుంటున్నం. 24 గంటలు ఇచ్చేటోళ్లను ఎందుకు కాదనుకోవాలె. గీ తలకాయ లేని మాటలు మాట్లాడుతున్న కాంగ్రెసోళ్లకు రైతులు బుద్ధి చెప్పుడు ఖాయం. మనం మంచిగుండాలంటే పైన ప్రభుత్వం కూడా మంచిగుండాలె. వీళ్లు ఏదో చేస్తరని నమ్మితే మొదటికే మోసం వస్తది. కాంగ్రెసోళ్లను నమ్మితే ఇగ కరువును కొని తెచ్చుకున్నట్లే అయితది. మేం అయితే కేసీఆర్కే జై కొడుతం. ఆయనుంటనే పంటలు మంచిగ పండుతయ్.
– రాంబత్తుల లక్ష్మణ్, రైతు, ధన్నూర్ (బీ)
బోథ్, నవంబర్ 25: కాంగ్రెస్ ఇస్తమంటున్న మూడు గంటల కరెంట్ ఏమూలకు సరిపోతది. ఈ కాంగ్రెసోళ్ల ముచ్చట్లు వింటుంటే మళ్లీ పాత రోజులు తెస్తమంటున్నరు. అప్పట్లో కరెంట్ ఇయ్యకుండా ఎంత సతాయించిన్రు. చేన్ల కాడ్నే కాపలా కాసేటట్లు చేసిన్రు. గిప్పుడు మళ్లి కరెంటియ్యకుండా ఇబ్బందులు పెడదామని చూస్తున్నరు. గీళ్లను నమ్మితే మన మెడకు మనం ఉరి వేసుకున్నట్లే. మళ్లా సీఎం కేసీఆర్ వస్తనే ఇబ్బంది లేకుంటయితది. లేకుంటే రైతులు మళ్లీ అరిగోస పడుతరు. రేవంత్ రెడ్డి మాటలన్నీ రైతులను అవమానించేటట్లున్నయ్. అయినా కాంగ్రెసోళ్లు ఢిల్లీ లీడర్లకు గులాంలు. వాళ్లు మన తెలంగాణోళ్లకు ఏడ న్యాయం చేస్తరు. వీళ్ల ముచ్చట తెలిసిందే కదా.
– మునిగెల రమేశ్, రైతు, కన్గుట్ట
నేరడిగొండ, నవంబర్ 25 : 10 హెచ్పీ మోటర్లతో ఎవుసం ఎట్లా చేస్తం. 3గంటల కరెంట్తో ఎవుసం చేయడం చాలా కష్టమే. కాంగ్రెసోళ్లు చెప్పినట్లు 10 హెచ్పీ మోటర్లు పెడిత్ ఎంత కరెంట్ బిల్లు వస్తది. ఎట్లా కట్టాలే.. కానీ మోటర్ కొనడానికి చాలా పైసలు కావాలే.. గీళ్లు ఎప్పుడైనా ఎవుసం చేసిండ్రా..?చేయలేదా..? రైతుల ఉసురు పోసుకోనికే రేవంత్రెడ్డి గిట్ల మాట్లాడుతున్నాడు. 24 గంటల కరెంట్ ఇస్తెనే వీలైన సమయంలో పంటలకు నీరు పెడ్తరు. అప్పుడు ట్రాన్స్ఫార్మర్ల మీద భారం పడదు. సీఎం కేసీఆర్ ఏమి చేసిన ఆలోచించి చేస్తరు. ఆయన ఏమి చేసిన రైతులకు మంచి చేయడానికే. కానీ కాంగ్రెసోళ్లను నమ్మితే నట్టేట మునుగుడే.
– అన్రెడ్డి లక్ష్మారెడ్డి, రైతు, తేజాపూర్, నేరడిగొండ
బోథ్, నవంబర్ 25 : కాంగ్రెసోళ్లు చెప్పిన మూడు గంటల కరెంటంటే బావుల కాడనే పండుడయితది. గిప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల కరంట్తో 15 ఎకరాలు సాగు చేస్తున్న. ఇగ మూడు గంటల కరెంటంటే ఇగ ఎవుసం బంద్ చేసుడే అయితది. టెన్ హెచ్పీ మోటరు పెట్టినా, ఒక్క ట్రాన్స్ఫార్మర్ కూడా ఆగది. గప్పుడు దినాల పాటు కరెంట్ కోసం ఎదురుచూడాలె. మళ్లీ పాత రోజులు తెస్తమని వీళ్లే చెప్పకనే చెప్పుతున్నరు. అయినా రైతులకు అంతా మంచి చేస్తున్న కేసీఆర్ సర్కారును కాదని ఎవరనుకుంటరు. రైతుల మంతా ఆయన వెంటే ఉంటం.
– ఏలేటి (మార) భీంసేన్రెడ్డి, రైతు, ధన్నూర్ (బీ)
బోథ్, నవంబర్ 25 : కాంగ్రెసోళ్ల కథ అందరికీ తెలుసు. వీళ్లొస్తే మళ్లీ పొలాల కాడ్నే రాత్రి పూట కాపలా కాయాలే. నాకున్న నాలుగెకరాల్లో ఆయిల్ పామ్ పంటను వేసిన. అంతర పంటగా సోయాబీన్, శనగ సాగు చేసుకుంటున్న. ఇగ కాంగ్రెసోల్లు చెప్పినట్లు మూడు గంటల కరెంటిస్తే తెగ ఇబ్బందయితది. గిప్పుడిప్పుడే రైతులు కడుపు నిండా బువ్వ తింటున్నరు. వీళ్లు వచ్చి మళ్లీ ఆగం చేస్తమని అంటున్నరు. అయినా కాంగ్రెసోళ్లు గెలిచేది లేదు.. సచ్చేది లేదు. కాంగ్రెసోళ్లు ఫ్రీ కరెంట్ ఇయ్యరు. ఉన్న మోటర్లకు మీటర్లు పెడుతరు. వీళ్లను నమ్మం.. మళ్లీ కేసీఆరే సీఎం గావాలె.
– దామెర్ల వసంత్రెడ్డి, రైతు, ధన్నూర్ (బీ)
బజార్హత్నూర్, నవంబర్ 25: కాంగ్రెసోళ్లు వాళ్ల బతుకు దెరువు కోసం మాలాంటి రైతుల బతుకులను ఆగం చేస్తున్నారు. మూడు గంటల కరెంటని 10హెచ్పీ మోటర్లని ఇష్టమొచ్చినట్టు మాట్లాడుతున్నారు. అయినా అంత పెద్ద మోటర్ల అవసరం రైతులకు ఏమీ ఉండదు. అలాంటి మోటర్లు ఐదు నిమిషాల్లో మొత్తం నీళ్లను లాగేస్తయి. బోరులో ఉన్న ఊట, బురద మొత్తం బయటపడతాయి. దీంతో మోటర్లు కూడా కాలిపోతయి. కేవలం అధికారం కోసమే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని మాలాంటి రైతులందరికీ తెలుసు.
వాళ్లయన్నీ ఆపద మొక్కుల మాటలే. అయినా ఇప్పుడే తక్కువైంది. 24గంటల కరెంటొస్తంది. మోటర్లు మంచిగా నడుస్తున్నాయి. పంటలు బాగా పండుతున్నాయి. వాటిని పొలం దగ్గరనే అమ్ముకుంటున్నం. వారం రోజులు కాకముందే ఆ డబ్బులు బ్యాంకు ఖాతాలో పడతన్నాయి. ఇంత సక్కటి సౌలత్లు ఉండంగా మళ్లీ కాంగ్రెసోళ్లొచ్చి ఏదో చేస్తారట. వాళ్లున్నప్పుడు పడ్డ కరెంట్ కష్టాలను ఇప్పటిప్పుడే మర్చిపోయితున్నం. ఇంతలో వాళ్లే వచ్చి వాటిని గుర్తుకు చేస్తున్నారు. కేసీఆర్ సార్ ఉండగా కాంగ్రెసోళ్లతో అక్కరే లేదు.
– తాండ్ర శ్రీనివాస్, రైతు, బజార్హత్నూర్
నేరడిగొండ, నవంబర్ 25 : మూడు గంటల కరెంట్తో రైతులకు మళ్లీ పాత కరెంట్ కష్టాలు వచ్చినట్లే. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడంతో రైతులు సంతోషంగా జీవిస్తున్నారు. కాంగ్రెస్ హయాంలో సమయానికి కరెంట్ లేక పంటలు ఎండిపోయి, రైతులు చాలా నష్టపోయారు. గతంలో రాత్రిపూట పొలం కాడే పడుకునేవాళ్లం. కాంగ్రెస్ మళ్లీ వస్తే పాత రోజులు వస్తయ్. కాంగ్రెస్ పాలన మాకొద్దు. కేసీఆర్ సారూ ఇస్తున్న 24 గంటల కరెంట్ ముద్దు. కాంగ్రెస్ గ్యారంటీలపై నమ్మకం లేదు. కర్ణాటక రైతులు పడుతున్న బాధలు మాకొద్దు. కరెంట్ కోసం పడిగాపులు కాసే ప్రభుత్వం మాకొద్దు. రేవంత్రెడ్డికి రైతులపై అవగాహన లేదు.
– తగిరె సురేశ్, రైతు, రాజులతండా