దండేపల్లి, జనవరి7 : జిల్లాలో ఈసారి సన్న వడ్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. సన్న రకాల్లో 101, చిట్టి పొట్టి రకాలను సాగు చేశారు. గతంలో వానకాలంలో 40 నుంచి 50 శాతం, యాసంగిలో 80 నుంచి 90 శాతం మేర దొడ్డు రకం వడ్లు సాగు చేసేవారు. వీటిని ప్రభుత్వమే కొనుగోలు చేసేది. గతంలో సన్న రకం వడ్ల సాగు అంతంత మాత్రమే ఉండేది. వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు అమ్ముకోవాల్సి వచ్చేది. కొన్ని సందర్భాల్లో పెట్టుబడి కూడా వచ్చేది కాదు.
కానీ ఈసారి రైతన్నలకు సన్నాలు సిరులు కురిపిస్తున్నాయి. పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్లో తుఫాన్ ప్రభావంతో ఈసారి సన్నాల దిగుబడి తగ్గింది. దీంతో ఒక్కసారిగా ధర ఆకాశాన్నంటింది. స్థానిక వ్యాపారులే కాకుండా బడా మిల్లర్లు నేరుగా వచ్చి ధాన్యం కొనుగోలు చేయడంతో రైతుల పంట పండుతుంది. గత వానకాలం సీజన్లో సన్నాలకు ప్రారంభంలో క్వింటాలుకు రూ.2 వేల వరకు ఉండగా, చివరి వరకు రూ.2300 నుంచి రూ.2500 వరకు ధర పలికింది. కానీ ఈ సీజన్ ప్రారంభంలోనే క్వింటాలుకు రూ.2800 ఉండగా, ప్రస్తుతం రూ.3 వేలకు పైగా పలుకుతోంది. గతేడాదితో పోలిస్తే ఈసారి ధర పెంచి కొనుగోలు చేస్తుండగా, అన్నదాతల్లో ఆనందం కనిపిస్తున్నది.
సాధారణంగా వరికోత పూర్తి కాగానే వడ్లను కొన్ని రోజుల పాటు ఆరబెడుతారు. తేమశాతం తగ్గిన తర్వాత విక్రయిస్తారు. కానీ.. ఈసారి వడ్లు ఆరకముందే ప్రైవేటు వ్యాపారులు నేరుగా రైతుల వద్దకు వచ్చి తూకం వేస్తున్నారు.
సన్న రకాలకు ఎన్నడూ లేని విధంగా ఈసారి మంచి ధర వచ్చింది. పంట కోయడమే ఆలస్యం వ్యాపారులు కల్లం వద్దకే వచ్చి కాంటా పెట్టిన్రు. పోయినసారి కంటే ఈసారి రూ. 1000 దాకా ఎక్కువ పెట్టి కొన్నరు. దిగుబడి కూడా బాగానే వచ్చింది. – గోళ్ల మల్లేశ్, రైతు, తాళ్లపేట.