తిరుమలగిరి, అక్టోబర్ 4 : 2014కు ముందు నియోజకవర్గంలోని తిరుమలగిరిలో ఒక్కటే వ్యవసాయ మార్కెట్ ఉండేది. రైతులు తమ పంటలను విక్రయించాలంటే తిరుమలగిరి లేదా సూర్యాపేట జిల్లా కేంద్రానికి తీసుకెళ్లాల్సిన పరిస్థితి. దాంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర రాకపోవడం, సుదూర ప్రాంతాలకు వెళ్లి విక్రయించాల్సి ఉండడంతో ఆర్థిక భారంతో అప్పులు తప్ప.. పైసా మిగిలేది కాదు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో అదనంగా రెండు వ్యవసాయ మార్కెట్లు ఏర్పాటు చేస్తుండడంతో త్వరలోనే అందుబాటులోకి రానున్నాయి.
తుంగతుర్తి మండల కేంద్రంలో 7ఎకరాల 35 గుంటల విస్తీర్ణంలో సుమారు రూ.3 కోట్లతో నూతన వ్యవసాయ మార్కెట్ అన్ని సౌకర్యాలతో నిర్మితమవుతుంది. సుమారు రూ.20 లక్షలతో మార్కెట్ కార్యాలయం నిర్మించారు. రూ.30 లక్షలతో ప్రహరీ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. ఈ మార్కెట్ అందుబాటులోని వస్తే నూతనకల్, మద్దిరాల మండల రైతులకు దూరభారం తగ్గి వారు పండించిన పంటకు గిట్టుబాటు ధర రానున్నది.
జాజిరెడ్డిగూడెం శివారులో రూ.1.55 కోట్లతో నూతనంగా వ్యవసాయ సబ్ మార్కెట్ యార్డు ఏర్పాటు జరుగుతుంది. దీని పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ మార్కెట్ యార్డుకు నీటిరంగ నిఫుణులు దివంగత విద్యాసాగర్రావు పేరును ఖరారు చేస్తూ ప్రభుత్వం గతంలోనే ఉత్తర్వులు జారీ చేసింది. విద్యాసాగర్రావు స్వగ్రామం జాజిరెడ్డిగూడెం కావడంతో ఈ సబ్ మార్కెట్ యార్దుకు ఆయన పేరు పెట్టారు. ఈ సబ్ మార్కెట్ యార్డుతో జాజిరెడ్డిగూడెం మండలంతోపాటు నాగారం మండల ప్రజలకు దూరభారం తగ్గనున్నది. దాంతో ఇక్కడి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తిరుమలగిరి వ్యవసాయ మార్కెట్కు దశాబ్దాల చరిత్ర ఉంది. ఇక్కడి రైతులు తమ పంట ఉత్పత్తులను నిజాం సర్కారు సమయంలోనే గుర్తించడం జరిగింది. అప్పట్లోనే పంటల క్రయ విక్రయాలు ఇక్కడ నిర్వహించేవారు. తొమ్మిది ఎకరాల 39 గుంటల విస్తీర్ణం కలిగిన ఈ మార్కెట్ అధికారికంగా 1993లో ఏర్పాటైంది. మొదటగా ధాన్యం, పప్పుధాన్యాల క్రయవిక్రయాలతో ప్రారంభం కాగా, నేడు సంప్రదాయ, వాణిజ్య పంటల ఉత్పత్తుల అమ్మకాలు జోరుగా సాగుతున్నాయి. 2016లో జిల్లాలోనే మొట్టమొదటి ఈనామ్ మార్కెట్గా గుర్తింపు పొందింది.
నియోజకవర్గంలో మార్కెట్ యార్డుల ఏర్పాటుతో రైతులకు దూరభారం తగ్గనున్నది. గతంలో రైతులు పండించిన పంట అమ్ముకోవాలంటే సూర్యాపేట, తిరుమలగిరి మార్కెట్లకు వెళ్లలేక వ్యాపారులు, దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వచ్చేది. తెలంగాణ ప్రభుత్వంలో మంత్రి జగదీశ్రెడ్డి సహకారంతో ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ తుంగతుర్తిలో వ్యవసాయ మార్కెట్ ఏర్పాటు చేయించడం హర్షణీయం.
-రామసాయం జనార్దన్రెడ్డి, బిక్కుమళ్ల, నూతనకల్
వ్యవసాయ మార్కెట్లు అందుబాటులోకి రానుండడంతో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర దక్కనున్నది. దళారుల బెడద తొలగనున్నది. ఆర్థిక భారంతోపాటు దూరభారం తగ్గనున్నది. సకాలంలో పంటను విక్రయించుకునే అవకాశం ఉంటుంది. నూతనంగా ఏర్పాటు చేసే మార్కెట్లతో రైతులకు అన్నివిధాలా ఉపయోగకరం.
-వెలుగు సునీల్, రైతు, కర్విరాల, తుంగతుర్తి