మన వద్ద పండే వాటర్ మిలన్కు పొరుగు రాష్ర్టాల్లో ఫుల్ డిమాండ్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 425 ఎకరాల్లో సాగు చేయగా, 10 వేల టన్నుల పంట చేతికొచ్చే అవకాశమున్నది. ఒక్కో ఎకరాకు 20 నుంచి 25 టన్నుల దాకా దిగుబడి వస్తున్నది. రైతాంగం కిలోకు రూ. 7 నుంచి రూ.10 వరకు విక్రయిస్తుండగా, ఖర్చులన్నీ పోను రూ. లక్షకుపైగా ఆదాయం మిగులుతున్నది. ఇక వ్యాపారులు తోటల వద్దకే వచ్చి కొనుగోలు చేస్తూ మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశావంటి రాష్ర్టాలకు తరలిస్తుండగా, అన్నదాతల్లో మరింత ఆసక్తి పెరుగుతున్నది.
మంచిర్యాల, మార్చి 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రైతులు పండించిన పుచ్చకాయలకు పొరుగురాష్ర్టాలో పుల్ డిమాండ్ ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 425 ఎకరాల్లో పచ్చకాయలు సాగు చేయగా, 8500 టన్నుల నుంచి 10,000 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశమున్నది. ఇందులో 60 శాతం వరకు లోకల్ మార్కెట్లకు వెళ్తుండగా, మిగిలిన 40 శాతం పక్కరాష్ర్టాలకు ఎగుమతి అ వుతున్నది. ఎకరంలో 20 టన్నుల నుంచి 25 టన్నుల దిగుబడి వస్తున్నది. ప్రస్తుతం రైతులు పొలం వద్ద కిలోకు రూ.7 నుంచి రూ.10 చొ ప్పున విక్రయిస్తున్నారు. ఈ లెక్కన ఖర్చులన్నీ పోనూ ఎకరాకు రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుంది. విత్తనం వేశాక మూన్నెళ్లకే పంట చేతికి వస్తుండగా, అన్నదాతల్లో ఆసక్తి కనిపిస్తున్నది.
పుచ్చకాయకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉండగా, వ్యాపారులే రైతుల వద్దకు వచ్చి కొనుగోలు చేసి తీసుకెళ్తున్నారు. దీంతో రైతులు బయట విక్రయించే ఆలోచన చేయడం లేదు. కానీ రైతు నేరుగా మార్కెట్లో లేదా వినియోగదారులకే పుచ్చ విక్రయిస్తే కిలో రూ.20 నుంచి రూ.30 మధ్యలో గిట్టుబాటు అవుతుంది. ఇలా చేస్తే ఆదాయం మూడు నుంచి నాలుగు రెట్లు పెరుగుతుందని అధికారులు చెబుతున్నారు. కానీ నష్టభయంతో రైతులు ఇందుకు ముందుకు రావడం లేదంటున్నారు. మార్చి, ఏప్రిల్లో కచ్చితంగా డిమాండ్ ఉంటుందనే విషయాన్ని రైతులు గుర్తించుకోవాలని వ్యవసాయశాఖ అధికారులు సూచిస్తున్నారు. నిర్మల్లో జిల్లాలోని ముథోల్, నర్సాపూర్, సారంగాపూర్ మండలాల్లో అధికంగా పుచ్చసాగు అవుతున్నది. ఆదిలాబాద్ జిల్లాలోని జైనథ్, గుడిహత్నూర్, ఇచ్చోడ, బోథ్, ఆసిఫాబాద్ జిల్లాలోని కాగజ్నగర్, కౌటాల, దహెగాం, బెజ్జూరు, మంచిర్యాల జిల్లాలోని భీమిని, కన్నెపల్లి, నెన్నెల, భీమారం, కోటపల్లి, చెన్నూరు, దండేపల్లి మండలాల్లో పుచ్చ అధికంగా సాగు చేస్తున్నారు. ఆసిఫాబాద్ నుంచి ఒడిశా, మహారాష్ట్రలకు పుచ్చ ఎగుమతి అవుతుండగా, మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల నుంచి మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు వెళ్తుంది.
రోజూ వారీ ఆదాయం వచ్చే పంటలపై రైతులు దృష్టి సారించాలి. కూరగాయాలు, పండ్లు, పూలు సాగు చేస్తే తక్కువ సమయంలో ఎక్కువ లాభాలు పొందొచ్చు. దీర్ఘకాలిక ఆదాయం ఇచ్చే పామాయిల్ సాగు చేసి అంతరపంటలకు పుచ్చలాంటి తీగ జాతులను వేస్తే ఫలితాలు బాగుంటాయి. రైతులు ఆ దిశగా దృష్టి సారించాలి. వచ్చే సీజన్లో ఏ పంటకు డిమాండ్ ఉంటుందో అంచనా వేసి సాగు చేస్తే లాభాలు పొందవచ్చు. గతంతో పోలిస్తే రైతులు పత్తి, వరి కాకుండా నూనెగింజలు, పుచ్చ, కూరగాయాల సాగుకు మొగ్గుచూపుతున్నారు. – సహజ, ఉద్యానవన శాఖ అధికారి, మంచిర్యాల క్లస్టర్