Komaram Bheem | కుమ్రం భీం ఆసిఫాబాద్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ): అడవి తల్లి ఒడి నుంచి మరో కొలాం గ్రామం కనుమరుగు కాబోతున్నది. రాత్రింబవళ్లు తేడా లేకుండా నిత్యం అటవీ అధికారుల తనిఖీలు, వేధింపులు ఆ కొలాం గిరిజనులకు నిలువ నీడ లేకుండా చేస్తున్నాయి. తమ చేలల్లో పనులకు వెళ్లినా.. పశువులను మేతకు తీసుకెళ్లినా.. పొయ్యిలకు కట్టెలు తెచ్చినా వారికి అటవీ సిబ్బందితో ఇబ్బందులు తప్పడం లేదు. దీంతో ఒక్కో కుటుంబం గ్రామాన్ని విడిచేందుకు సిద్ధమవుతున్నది. మరికొందరు ఉన్న ఊరును విడువలేక, అటు వేధింపులు తాళలేక సతమతమవుతున్నారు.
దశాబ్దాల క్రితం ఏర్పడిన ఆ గ్రామం ఉన్నట్లు కొంతకాలం క్రితం వరకు చాలా మందికి పెద్దగా తెలియదు. 18 కొలాం కుటుంబాలు ఇక్కడ నివసిస్తున్నాయి. వాంకిడి మండల కేంద్రం నుంచి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో రెండు వాగులకు అవతల పెద్ద పెద్ద గుట్టలకు ఆనుకొని రింగరీట్ గ్రామం ఉంటుంది. కొత్తవారు ఈ గ్రామంలోకి వస్తేనే గ్రామస్తులు భయాందోళనకు గురవుతుంటారు. ఇక ఇటీవల కాగజ్నగర్ అడవుల్లో పులుల మృత్యువాతకు ఈ గ్రామం యువకులే కారణమంటూ అటవీ అధికారులు తేల్చారు. ఈ ఘటనతో గ్రామం ఒక్కసారిగా వార్తల్లోకెక్కింది. నిందితులను అదుపులోకి తీసుకున్నారు కూడా. ఇక నాటి నుంచి ఇక్కడి కొలాం గిరిజనులకు కష్టాలు మొదలయ్యాయి. అటవీ అధికారులు నిత్యం గ్రామం చుట్టుపక్కలే పహారా కాస్తున్నారు.. ఈ గ్రామానికి చెందిన కొలాం రైతులకు ఉన్న చేలల్లో నిత్యం తనిఖీలు చేస్తున్నారు. ఇక చేసేదేమీ లేక గ్రామాన్ని వదిలి వెళ్లిపోవాలని కొలాంలు భావిస్తున్నారు. ఇప్పటికే ఒక కుటుంబం గ్రామాన్ని విడిచి వెళ్లింది. మరికొందరు కూడా అదే బాటలో సిద్ధమవుతున్నారు. ఊరు మీద మమకారం ఉన్నా, వేధింపులు తాళలేక వెళ్లక తప్పని పరిస్థితులు వస్తున్నాయని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెద్ద పులికి విషం పెట్టి చంపారనే కారణంతో నా కొడుకు ఆత్రం జలపత్, గ్రామంలోని కోవ జంగును అటవీ శాఖోళ్లు పట్టుకుపోయిన్రు. నాటి నుంచి మా ఊరు మీద పడి తిరుగుతున్నరు. మమ్మల్ని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నరు. ఎప్పుడూ గ్రామం చుట్టే మకాం వేసి ఉంటున్నరు. పిల్లలు జైలుకు పోయిన బాధలో మేముంటే, వీళ్లు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నరు. చేనుకు వెళ్లాలంటే కూడా భయమేస్తున్నది.
ఇటీవల అటవీ అధికారుల వేధింపులు ఎక్కువైనయ్. అందుకే ఊరు విడిచిపెట్టి పోదామని అనుకుంటున్నం. మా గ్రామానికి చెందిన ఇద్దరు పులికి విషం పెట్టి చంపిన్రని ఈ అధికారులే పట్టుకుపోయిన్రు. మేము అడవిలో ఉండేవాళ్లం. మా భూములూ ఇక్కడే ఉన్నయ్. పశువులను మేపేందుకు కూడా అడవికే పోతాం. సీసీ కెమెరాల్లో మా ఊరి యువకులు కనిపించిన్రనే కారణంతోనే వారిపై కేసులు పెట్టి జైలుకు పంపిన్రు. నాటి నుంచి గ్రామంలో తిరుగుతూ మమ్మల్ని వేధిస్తున్నరు. ఇగ పులుల కంటే వీళ్లతోనే భయమెక్కువైతంది. అందుకే గ్రామం విడిచి పోవాలని అనుకుంటున్నం.
అడవులు నరికివేతకు గురికాకుండా చూడడంతో పాటు వన్యప్రాణుల రక్షణ మా బాధ్యత. ఈ క్రమంలో అటవీ ప్రాంత గ్రామాల్లో నిఘా పెంచాం. రింగరీట్ గ్రామంతోపాటు సర్కపల్లి, మరి కొన్ని గ్రామాలు కూడా అటవీ ప్రాంతంలోనే ఉన్నాయి. ఇటీవల పులులపై విష ప్రయోగం చేసింది రింగరీట్ గ్రామంలోని యువకులే కాబట్టి ఈ ప్రాంతంలో నిఘా పెంచాం. ఈ గ్రామంలోని రైతులు అటవీ జంతువులను వేటాడేందుకు విద్యుత్తీగలు పెట్టకుండా వారి వ్యవసాయ క్షేత్రాల్లో కూడా తనిఖీలు చేస్తున్నాం.