ఇచ్చోడ, జనవరి 2 : గ్రామాల అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతితో మండలంలోని మారుమూల గ్రామమైన మల్లాపూర్ హరితవనంలా మారింది. 300 ఇండ్లు, 1400 జనాభా ఉన్న ఈ గ్రామంలో ఎటు చూసినా సీసీ రోడ్లు, ఏపుగా పెరిగిన పచ్చని చెట్లతో దర్శనమిస్తూ ఆహ్లాదాన్ని పంచుతుంది.
పచ్చదనంతో ఆహ్లాదభరితం
ప్రభుత్వం చేపట్టిన హరితహారంతో పాటు పల్లె ప్రగతిలో భాగంగా ప్రతి వీధిలో రోడ్డుకు ఇరువైపులా 2500 మొక్కలు నాటి సంరక్షించడంతో అవి ఏపుగా పెరిగి పచ్చదనాన్ని పంచుతున్నాయి. పల్లె ప్రకృతి వనంలో వివిధ రకాలకు చెందిన రెండు వేల మొక్కలను నాటి సంరక్షించడంతో చిట్టడవిని తలపిస్తున్నది. పరిశుభ్రతలో భాగంగా నిత్యం పంచాయతీ సిబ్బంది ట్రాక్టర్ ద్వారా తడి, పొడి చెత్తను సేకరిస్తుండడంతో వీధులు శుభ్రంగా దర్శనమిస్తున్నాయి.
రూ.25లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం
గ్రామ అభివృద్ధిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం, ఖానాపూర్ ఎమ్మెల్యే రేఖా నాయక్ సహకారంతో మంజూరైన రూ.25 లక్షలతో గ్రామంలోని ప్రధాన వీధుల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టారు. నాడు మట్టి, కంకర రోడ్లతో దర్శనమిచ్చిన వీధులు నేడు సీసీ రోడ్లతో అద్దంలా మెరుస్తున్నాయి.
నిత్యం పర్యవేక్షిస్తున్నాం
హరితహారంతో పాటు పల్లె ప్రగతిలో భాగంగా గ్రామంలోని ప్రధాన వీధుల్లో నాటిన మొక్కలు సంరక్షించేందుకు ట్రీగార్డులు ఏర్పాటు చేశాం. గ్రామ పంచాయతీ వాటర్ ట్యాంకర్ ద్వారా ప్రతి మొక్కకు నీళ్లు పోయడంతో పాటు నిత్యం పర్యవేక్షిస్తుండడంతో ఏపుగా పెరిగి పచ్చదనం సంతరించుకోవడం సంతోషంగా ఉంది.
-మడావి బాపురావ్, సర్పంచ్, మల్లాపూర్
మా ఊరు బాగుంది
పల్లె ప్రగతిలో భాగంగా చేపట్టిన పనులతో మా ఊరు ఇప్పుడు ఎంతో బాగుంది. హరితహారంలో నాటిన మొక్కలతో గ్రామమంతా పచ్చగా కనిపిస్తున్నది. సీసీ రోడ్లు వేయడంతో చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంది. గ్రామాభివృద్ధికి పైసలిచ్చిన ప్రభుత్వానికి ధన్యవాదాలు.
-కనక దుందేరావ్, గ్రామస్తుడు