సారంగాపూర్, ఫిబ్రవరి 5 : బాల కార్మికులను వెట్టిచాకిరీ నుంచి విముక్తి కల్పించడం, అక్షరజ్ఞానానికి దూరమైన వారిని బడిబాట పట్టించడం,చిన్నారుల మోములో చిరునవ్వులు చిందించాలనే ఉద్దేశంతో తెలంగాణ సర్కారు ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నది. తప్పిపోయిన చిన్నారులు, వీధిబాలలు, బాలకార్మికులు, భిక్షాటన చేస్తున్న చిన్నారులు, అక్రమ రవాణాకు గురైన వారి జాడ కనిపెట్టేందుకు యేటా ప్రభుత్వం నిర్వహిస్తున్న కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. పోలీసు, కార్మిక, బాలల సంరక్షణ కమిటీలు కార్యక్రమం విజయవంతంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ఈ యేడాది తొమ్మిదో విడుత కార్యక్రమం జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు నిర్వహించగా.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 241 మందిని గుర్తించారు.
పసి ప్రాయంలోనే పనులు చేస్తున్న బాలబాలికలను గుర్తించి, వారి భవిష్యత్తును చదువనే ఆభరణంతో అందంగా తీర్చిదిద్దాలనే సదుద్దేశంతో సర్కారు.. ఆపరేషన్ స్మైల్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 2015లో ప్రారంభించగా.. గత జనవరి 1 నుంచి 31వ తేదీ వరకు మహిళలు, బాలల సంక్షేమం, పోలీసు శాఖ ఆధ్వర్యంలో తొమ్మిదో విడుత కార్యక్రమాన్ని నిర్వహించారు. బాలల హక్కుల పరిరక్షణే ధ్యేయంగా ప్రతి ఆరు నెలలకోసారి చేపడుతునానరు. హోటళ్లు, ఇటుక బట్టీలు, బస్టాండ్లే లక్ష్యంగా అధికారులు తనిఖీలు చేస్తున్నారు. గడిచిన నెల రోజుల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా 241 మంది బాల కార్మికులు, బడిమానేసిన పిల్లలను గుర్తించారు. ఇందులో బాలురు 204 మంది, బాలికలు 37 మంది ఉన్నారు. అయితే డ్రాపౌట్ విద్యార్థులను అధికారులు వివిధ పాఠశాలల్లో చేర్పిస్తున్నారు. యేటా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం కోసం కమిటీలు కూడా వేస్తున్నారు. పోలీసు, కార్మిక, బాలల పరిరక్షణ శాఖ ఆధ్వర్యంలో కమిటీలను ఏర్పాటు చేసి దాడులు నిర్వహిస్తున్నారు.
బాల్యం బుగ్గి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా వందలాది హోటళ్లు, ఇటుక బట్టీలు, ఇతర ప్రైవేట్ కంపెనీలు ఉన్నాయి. తెలంగాణతోపాటు, మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్, నేపాల్, రాజస్తాన్, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిశా, ఉత్తరప్రదేశ్ తదితర రాష్ర్టాల నుంచి వచ్చి పనులు చేస్తుంటారు. వలస కూలీల పిల్లలు కూడా తల్లిదండ్రులతో పని చేస్తారు. ఫలితంగా వారి బంగారు భవిష్యత్ బుగ్గిపాలవుతోంది. ఇలాంటి వారిని పనుల నుంచి విముక్తి కల్పించి పాఠశాలలో చేర్పిస్తున్నారు. ముఖ్యంగా 18 ఏళ్లలోపు పిల్లలతో పనులు చేయిస్తే సదరు యజమానికి రూ. 20వేలు జరిమానా విధిస్తున్నారు. కాగా.. నిర్మల్ జిల్లావ్యాప్తంగా 67 మంది బాలబాలికలను గుర్తించినట్లు నిర్మల్ డీసీపీవో మురళి తెలిపారు.