వరి ధాన్యం సేకరణకు అధికారులు ప్రణాళికలు తయారు చేశారు. అక్టోబర్ చివరి వారంలో వరి కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉండగా.. 20 నుంచి అవసరమైన చోట కేంద్రాలు ఏర్పాటు చేయడానికి సిద్ధం అవుతున్నారు. ఈ వానకాలంలో 1,32,928 ఎకరాల్లో వరి సాగవగా, ఎకరానికి సగటున 18 క్వింటాళ్ల చొప్పున 2.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ మేరకు పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో 204 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఈ సారి ప్రభుత్వం మద్దతు ధర రూ.143 పెంచడంతో గ్రేడ్-ఏ రకం క్వింటాలుకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183లు అందనున్నాయి. కాగా.. కేంద్రాల నుంచి వెంటనే మిల్లులకు ధాన్యాన్ని తరలించనున్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు 24 గంటల్లోపు వారి ఖాతాల్లో డబ్బులు జమ అయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
– నిర్మల్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ)
నిర్మల్, సెప్టెంబర్ 25(నమస్తే తెలంగాణ) : నిర్మల్ జిల్లాలో ఈ యేడు సమృద్ధిగా వర్షాలు కురియడంతో ప్రాజెక్టులు, చెరువుల్లోకి పుష్కలంగా నీరు చేరింది. సకాలంలో వరి నాట్లు పూర్తికావడంతో ఒకేసారి ధాన్యం దిగుబడులు వచ్చే అవకాశం ఉన్నది. అక్టోబర్ చివరి వారంలో కోతలు ప్రారంభమయ్యే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు. ఈ మేరకు అక్టోబర్ 20 నుంచి అవసరమైన చోట కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సీజన్లో 1,32,928 ఎకరాల్లో వరి సాగవగా, ఎకరానికి సగటున 18 క్వింటాళ్ల దిగుబడి వస్తోందని అంచనా వేశారు. ఈ విధంగా మొత్తం 2.39 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తోందని వ్యవసాయ, పౌర సరఫరాల శాఖ అధికారులు చెబుతున్నారు. యేటా వానకాలం సీజన్లో రైతులు అధికంగా సన్నరకాలు వేస్తుంటారు. దీంతో స్థానిక అవసరాలు, సీడ్ కోసం దాదాపు 1.02 లక్షల మెట్రిక్ టన్నులు పోగా, మిగతా 1.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయనున్నది. పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న 204 కొనుగోలు కేంద్రాల ద్వారా ఈ కొనుగోళ్లను చేపట్టేందుకు అధికారులు ప్రణాళిక ఖరారు చేశారు.
ఐకేపీ 32, పీఏసీఎస్ 91, డీసీఎమ్మెస్ 77, జీసీసీ నాలుగు మొత్తం 204 కేంద్రాలు ఏర్పాటు చేశారు. కాగా.. మార్కెటింగ్ శాఖ అధికారులు గత యాసంగిలోనే కొనుగోలు సెంటర్ల ఏజెన్సీలకు 130 ప్యాడీ క్లీనర్లను అందజేశారు. అదనంగా మరో 95 ప్యాడీ క్లీనర్లు అందుబాటులో ఉన్నాయి. గత రెండు సీజన్లలో 2,500 టార్పాలిన్లను రైతులకు పంపిణీ చేశారు. మార్కెట్ కమిటీల్లో 1,850 అందుబాటులో ఉన్నాయి. 304 ఎలక్ట్రానిక్ కాంటాలు సిద్ధంగా ఉంచారు. తేమ శాతాన్ని గుర్తించేందుకు 250 మీటర్లు ఉన్నాయని మార్కెటింగ్ శాఖ అధికారులు తెలిపారు.
వానకాలం ధాన్యం కొనుగోళ్లకు 37 లక్షల గన్నీ బ్యాగులు అవసరం కాగా, ప్రస్తుతం జిల్లాలో 20 లక్షల సంచులు సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే మిల్లర్ల నుంచి సంచులను తెప్పించుకున్న పౌర సరఫరాల శాఖ అధికారులు… రేషన్ షాపుల్లోని బ్యాగులను సేకరించే పనిలో పడ్డారు. గన్నీ బ్యాగుల సేకరణ పూర్తి కాగానే కొనుగోలు కేంద్రాల నిర్వాహకులకు అక్టోబర్ మొదటి వారంలో శిక్షణ ఇచ్చి రైతులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. కాగా.. ఈ సారి ప్రభుత్వం వరి మద్దతు ధర రూ.143 పెంచడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. గ్రేడ్-ఏ రకం క్వింటాలుకు రూ.2,203, సాధారణ రకానికి రూ.2,183 మద్దతు ధర అందించనున్నది. కొనుగోలు కేంద్రాల్లో ఒక లారీకి సరిపడా ధాన్యం బస్తాల తూకం పూర్తయిన వెంటనే కస్టమ్ మిల్లింగ్ కోసం తరలిస్తారు.
నిర్మల్ జిల్లాలో ఈ వానకాలం సీజన్కు 1.37 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించేందుకు ప్రణాళిక రూపొందించాం. ప్రతి కేంద్రంలో ముందస్తుగానే సరిపడా గన్నీ సంచులు, ఇతర పరికరాలు ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. అన్ని కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా వసతులు కల్పిస్తాం. రైతులు దళారులను నమ్మి మోసపోవద్దు. నేరుగా కొనుగోలు కేంద్రాల్లోనే ధాన్యాన్ని విక్రయించాలి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించిన రైతులకు 24గంటల్లోపు వారి ఖాతాలో డబ్బులు జమ అయ్యేలా చర్యలు తీసుకుంటున్నాం. కేంద్రాల నుంచి వెంటనే మిల్లులకు ధాన్యాన్ని తరలించేలా ఏర్పాట్లు చేశాం.
– కే.శ్రీకళ, నిర్మల్ జిల్లా మేనేజర్, పౌర సరఫరాల శాఖ