రాష్ట్ర సర్కారు నిరుపేదలకు అందించే నిత్యావసర సరుకులను పౌర సరఫరాల శాఖ ద్వారా డీలర్లకు సరఫరా చేస్తున్నది. కరోనాకు ముందు ఈ-పాస్(బయోమెట్రిక్ విధానం) విధానం అమలులో ఉండేది. కరోనా తగ్గుముఖం పట్టడంతో పారదర్శకత కోసం ఈనెల నుంచే అమలు చేయాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది. సాంకేతిక కారణాల వల్ల వచ్చే నెల నుంచి వంద శాతం సరుకుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 9 : రాష్ట్ర ప్రభుత్వం పౌర సరఫరాలశాఖ ద్వారా పేదలకు అందిస్తున్న నిత్యావసరు సరుకుల పంపిణీలో పారదర్శకత కోసం రేషన్ డీలర్లకు మళ్లీ ఈ-పాస్ (బయోమెట్రిక్ విధానం) అమలు చేయనుంది. ఈనెల నుంచే దీన్ని అమలు చేయాలని హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ సాంకేతిక కారణాలతో వచ్చే నెల నుంచి వందశాతం ఈ-పాస్ సరుకుల పంపిణీకి ప్రభుత్వం చర్యలు ప్రారంభించింది. కరోనాకు ముందు ఆయా రేషన్ షాపు డీలర్లకు ఈ-పాస్ విధానం ద్వారా బియ్యాన్ని రేషన్ షాపులకు సరఫరా చేసేది. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో తాత్కాలికంగా దీన్ని రద్దు చేసి మ్యానువల్ విధానంలో అమలు చేస్తుండడంతో రేషన్ డీలర్లు ఈ-పాస్ విధానం ద్వారా బియ్యం అందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ వస్తున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మొత్తం 8.17లక్షల కుటుంబాలున్నాయి. 7.72 వేల కుటుంబాలు రేషన్ పొందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ జిల్లాలో 355 రేషన్ దుకాణాలకు గాను 1.92లక్షల కుటుంబాలు, కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 278 దుకాణాలకుగాను 1.40 లక్షల కుటుంబాలు, మంచిర్యాల జిల్లాలో 423 రేషన్ షాపులకుగాను 2.20లక్షలు, నిర్మల్ జిల్లాలో 412 రేషన్షాపులకుగాను 2.10 లక్షల కుటుంబాలు రేషన్ పొందుతున్నట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ప్రతినెలా 1 నుంచి 15లోగా తెల్లరేషన్కార్డుతో పాటు అంత్యోదయ, అన్నపూర్ణ, తదితరకార్డులున్న వారికి ఒక్కొక్కరికి 5కిలోల చొప్పున బియ్యం ప్రభుత్వం సరఫరా చేస్తున్నది.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న రేషన్ షాపుల ద్వారా ప్రభుత్వం ప్రతినెలా రేషన్ బియ్యాన్ని అందిస్తున్న నేపథ్యంలో వచ్చే నెల నుంచి ఈ-పాస్ విధానం ద్వారా రేషన్ డీలర్లకు బియ్యాన్ని సరఫరా చేయనున్నారు. ప్రభుత్వం ఇప్పటికే ఆయా రేషన్ షాపుల ద్వారా తెల్లకార్డు, అన్నపూర్ణ, అంత్యోదయకార్డులున్న లబ్ధిదారులకు ఈ-పాస్ బయోమెట్రిక్, ఐరిస్ విధానంలో బియ్యాన్ని ప్రతినెలా అందిస్తున్నారు. జిల్లాలోని ఆయా గోదాంల నుంచి రేషన్ షాపులకు వచ్చే బియ్యం బ్యాగుల్లో 50 కిలోలు ప్రభుత్వం ప్యాకింగ్ ఉన్నప్పటికీ రేషన్ డీలర్లకు కిలో నుంచి కిలోన్నర వరకు తక్కువగా వస్తున్నాయని ప్రభుత్వానికి విన్నవించారు. తాము లబ్ధిదారులకు బయోమెట్రిక్ ద్వారా ప్రభుత్వం నిర్దేశించిన బియ్యాన్ని ఆన్లైన్లో నమోదు చేస్తున్నామని, తమకు వచ్చే బ్యాగుల్లో కోత ఉండడంపై నష్టపోతున్నామని రేషన్ డీలర్లు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మళ్లీ ఈనెల నుంచే బయోమెట్రిక్ ఈ పాస్ ద్వారా రేషన్ సరుకులు అందించాలని ఆదేశించినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల వచ్చే నెల నుంచి వందశాతం అమలు చేయాలని నిర్ణయించింది. రేషన్ డీలర్లు ఉమ్మడి జిల్లాలోని 17 ఎంఎల్ఎస్ గోదాముల్లో రేషన్ సరుకుల బియ్యాన్ని పొందేందుకు తప్పనిసరిగా గోదాముకు వెళ్లి బయోమెట్రిక్ ద్వారానే తీసుకోవాల్సి ఉంటుంది. బయోమెట్రిక్ ద్వారా 50 క్వింటాళ్ల వరకు ఒకేసారి గోదాములో ఉన్న బియ్యాన్ని తూకం చేసి లారీల ద్వారా రేషన్షాపులకు తరలిస్తారు. దీనివల్ల రేషన్ బ్యాగుల్లో కేజీ బియ్యం 50 కిలోల కంటే తక్కువగా ఉన్నా, అది అనుమతించకపోనుండడంతో తమకు నష్టం జరగదని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఒక్క డీలరుకు 200 క్వింటాళ్ల బియ్యం వస్తే నాలుగుసార్లు బయోమెట్రిక్ ఈ-పాస్ విధానం ద్వారా బియ్యా న్ని గోదాముల నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానంపై రేషన్ డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆయా జిల్లాల పౌర సరఫరాలశాఖ డీఎంలు రేషన్ డీలర్లకు ఈపాస్ విధానంపై మళ్లీ శిక్షణ ఇచ్చి బియ్యం రేషన్ దుకాణాలకు పాత విధానం ద్వారా తీసుకునేందుకు చర్యలు తీసుకోవడంతో డీలర్లు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ప్రతినెలా సరఫరా చేసే బియ్యాన్ని రేషన్ డీలర్లకు ఈపాస్ విధానం ద్వారా అందించేందుకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈనెల నుంచి ఈపాస్ విధానం ద్వారా గోదాముల నుంచి రేషన్ షాపులకు తరలించేందుకు చర్యలు చేపట్టినా సాంకేతిక కారణాల కారణంగా అమలు చేయలేకపోతున్నాం. వచ్చే నెల నుంచి వందశాతం రేషన్ డీలర్లకు ఈపాస్ విధానం ద్వారానే రేషన్ బియ్యం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నాం.
శ్రీకళ, డీఎం, సివిల్ సప్లయ్
ప్రభుత్వ నిర్ణయం హర్షనీయం. కరోనాకు ముందు ఈ-పాస్ విధానం ద్వారా బియ్యం తీసుకొచ్చి లబ్ధిదారులకు అందించడం ద్వారా మాకు ఇబ్బంది లేకుండే. కరోనాతో ఈ విధానం రద్దయ్యింది. మాకు సరఫరా చేస్తున్న బ్యాగుల్లో 50 కిలోలకు గాను 48 కేజీలే వస్తున్నాయి. తరుగు చూపెట్టే అవకాశం లేకుండా పోయింది. ఇప్పుడు 50 కేజీలుంటేనే బయోమెట్రిక్ ద్వారా తీసుకునే అవకాశం రావడంతో సంతోషంగా ఉంది.
మోహినొద్దీన్, రేషన్ డీలరు