మంచిర్యాల ఏసీసీ, నవంబర్ 9: రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు సరైన సమయంలో మెరుగైన వైద్యం ఉచితంగా అందించేందుకు ఎన్నో విధాలుగా కృషి చేస్తున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ దవాఖానలు ఉండగా, వాటికి తోడుగా పీహెచ్సీ, సీహెచ్సీ, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు, బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకవచ్చింది. రోగులకు అత్యంత చేరువలోనే వైద్యం అందిస్తున్నది. ఇక వీటన్నింటినీ పర్యవేక్షించేందుకు పీహెచ్సీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. దీంతో వైద్యులు, నర్సులు, ఇతర పారామెడికల్ సిబ్బంది సకాలంలో దవాఖానలకు వెళ్లనున్నారు.
వారి విధులపై ప్రత్యేకంగా ఓ కంట్రోల్ రూం ను ఏర్పాటు చేసి అక్కడి నుంచి మానిటరింగ్ చేస్తూ పర్యవేక్షిస్తున్నారు. హైదరాబాద్లో కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో కంట్రోల్ రూంను ఏర్పాటు చేశారు. నిఘా కోసమే కాకుండా నేరుగా సిబ్బంది తో మాట్లాడడానికి ఆడియో విజువల్ సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. జిల్లాలో ఉన్న 17 పీహెచ్సీలు, 4 అర్భన్ హెల్త్ సెంటర్లు, 3 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో అవసరమున్న దాన్ని బట్టి మూడు, నాలుగు చొప్పున సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటి సేవలను అందుబాటులోకి తీసుకవచ్చారు.
మంచిర్యాల జిల్లా వ్యాప్తంగా ఉన్న 17 ప్రాథమిక హెల్త్ సెంటర్లలో 51, నాలుగు యూపీహెచ్సీలల్లో 21 మొత్తంగా 72 కెమెరాలను రాష్ట్ర ప్రభుత్వం అందించింది. గతంలో ఇక్కడ పని చేసిన కలెక్టర్ భారతీ హోళికేరి 17 పీహెచ్సీలకు నాలుగు చొప్పున 68, నాలుగు యూపీహెచ్సీలకు నాలుగు చొప్పున 16, మూడు సీహెచ్సీలకు ఎనిమిది చొప్పున 24, జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో 32 మొత్తంగా 140కెమెరాలను ఏర్పాటు చేసింది.
జిల్లా వ్యాప్తంగా మొత్తంగా 212 కెమెరాలు ఉన్నాయి. ఒక్కో పీహెచ్సీ, యూపీహెచ్సీలకు ఏడు కెమెరాలను అమర్చారు. డాక్టర్ గది, ఫార్మసీ, ల్యాబ్, దవాఖాన పరిసర ప్రాంతాల్లో కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షిస్తున్నారు. వీటికి తోడు వైఫై కనెక్షన్లను కూడా అనుసంధానం చేశారు. పీహెచ్సీల్లో వైద్యులు, వైద్య సిబ్బంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విధుల్లో ఉండాలి. వైద్యులు అందుబాటులో ఉండి రోగులకు వైద్య సేవలను అందించాలని, సిబ్బంది సమయపాలనపై కచ్చితమైన నిఘా ఉంటుందనే ఉద్ధేశ్యంతోనే ప్రభుత్వం సీసీ కెమెరాలను అందుబాటులోకి తీసుకవచ్చింది.
పీహెచ్సీ, యూపీహెచ్సీ, సీహెచ్సీలకు వచ్చే రోగులకు సరైన సమయంలో వైద్యం అందించడానికి, చిన్న పిల్లలకు అవసరమైన వ్యాక్సిన్లు వేయడానికి, ఇతర సాధారణ వైద్యం అందించడానికి పీహెచ్సీ ల పాత్ర ప్రత్యేక కీలకంగా ఉంటుంది. దాదాపు ప్రతి మండలానికి పీహెచ్సీ ఉంటుంది. పెద్ద మండలాలైతే రెండు పీహెచ్సీలు లేదా అర్భన్ హెల్త్ సెంటర్లు ఉంటాయి. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4గంటల వరకు వైద్య సేవలను అందిస్తారు. సీజనల్ వ్యాధుల కాలంలో పీహెచ్సీలు ప్రత్యేక పాత్రను పోషిస్తాయి. అంటువ్యాధులు, అత్యవసరమైన వైద్యం అందించే సమయంలో ఇవి ఎంతో ఉపయోగ పడుతాయి. ఇందులో ఒక ఎంబీబీఎస్ వైద్యుడు, నర్సులు, ఇతర సిబ్బంది ఉంటారు.
హైదరాబాద్ లో కోఠిలోని డీహెచ్ (ప్రజారోగ్య కార్యాలయం)లో అత్యాధునిక పరిజ్ఞానంతో కూడిన కమాండ్ కంట్రోల్ రూంను ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచే అన్ని పీహెచ్సీలకు అనుసంధానం చేశారు. కంట్రోల్ రూంలో భారి స్క్రీన్లను ఏర్పాటు చేశారు. ఒకే సారి అన్ని పీహెచ్సీల వైద్యులతో నేరుగా మాట్లాడడానికి, అవసరైన అదేశాలను ఇవ్వడానికి మైక్ను, స్పీకర్తోకూడిన సాంకేతికతను ఏర్పాటు చేశారు. అంటువ్యాధులు విజృంభిస్తే ఆశ వర్కర్లు, ఏఏన్ఎంలతో మాట్లాడే వీలు కల్పించారు. అవసరమనుకుంటే జూమ్ మీటింగ్ కూడా నిర్వహిస్తారు. దీంతో పాటుగా డీఎంహెచ్వోతో లింక్ను అమర్చారు. డీఎంహెచ్వో కూడా వైద్యుల సేవలను అవసరమున్నపుడు పరిశీలిస్తారు.
పీహెచ్సీ, యూపీహెచ్సీల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల ద్వారా అక్కడ అందుబాటులో ఉన్న వైద్యుడు, సిబ్బంది విధులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నాం. ఏదైనా అనుమానం వస్తే వెంటనే సిబ్బందిని అలర్ట్ చేస్తున్నాం. దీని ద్వారా అందరూ విధులను సక్రమంగా నిర్వహిస్తున్నారు. సరైన సమయంలో మారుమూల ప్రాంతాల రోగులకు వైద్యం అందుతున్నది.
-డా. జీ సుబ్బారాయుడు, మంచిర్యాల డీఎంహెచ్వో