ఎదులాపురం, ఫిబ్రవరి23: ఆంధ్రా, ఒడిశా బార్డర్ నుంచి తక్కువ ధరకు గంజాయి కొనుగోలు చేసి ఆదిలాబాద్ జిల్లా మీదుగా మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాలకు సరఫరా చేస్తున్న గంజాయి స్మగర్లను అరెస్టు చేశామని ఆదిలాబాద్ ఎస్పీ డీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. మావల పోలీస్ స్టేషన్లో గురువారం వివరాలు వెల్లడించారు. ఉట్నూర్కు చెందిన రహ్మన్ ఖాన్, పవార్ రాజు(రాజేశ్), శ్రీకర్, సద్దాంఖాన్, గావాలె తుకారం, సద్దాం హుస్సేన్, జన్నారం- కల్లెడ గ్రామానికి చెందిన వెంకటేశ్ , మహేశ్ స్నేహితులు. వీరందరూ జల్సాలకు అలవాటు పడ్డారు. తక్కువ సమయంలో ఎక్కువ డబ్బులు సంపాదించాలనే దురుద్దేశంతో గంజాయి సరఫరా, విక్రయం ద్వారా సులభంగా డబ్బులు సంపాదించవచ్చని భావించారు.
ఆంధ్రా, ఒడిశా బోర్డర్ సమీపంలో గంజాయి తక్కువ ధరకు దొరుకుతుందని తెలుసుకున్నారు. అక్కడి నుంచి గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో విక్రయిస్తూ పంచుకుంటున్నారు. ఎప్పటిలాగే వీరందరూ వారం క్రితం సీలేరు ప్రాంతానికి వెళ్లి అక్కడ 110 గంజాయి ప్యాకెట్లు కొనుగోలు చేసి, ఉట్నూర్లోని తుకారాం ఇంట్లో నిల్వ చేశారు. అనంతరం మూడు రోజులకు వెంకటేశ్ ,సద్దాం హుస్సేన్, మహేశ్ కలిసి గంజాయి ప్యాకెట్లను మహారాష్ట్రలోని అమరావతి తీసుకెళ్లి అక్కడ విక్రయించారు. అలాగే ఈ నెల 22న మిగిలిన 44 ప్యాకెట్లను మహారాష్ట్రలోని పుసద్ తీసుకెళ్లి అమ్మాలని నిర్ణయించుకున్నారు. వీరందరూ కలిసి రెండు కార్లలో ఉట్నూర్ నుంచి మావల బైపాస్ మీదుగా మహారాష్ట్ర వైపునకు వెళ్తుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు సీసీఎస్ పోలీసులు మావల బైపాస్ వద్ద వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా గుడిహత్నూర్ వైపు నుంచి రెండు కార్లు వస్తుండగా పోలీసులు ఆపారు.
ఈ క్రమంలో నలుగురు వ్యక్తులు వాహనాలు దిగి పారిపోగా, మిగిలిన నలుగురిని పట్టుకున్నారు. ఆ కార్లను తనిఖీ చేయగా అందులో 44 గంజాయి ప్యాకెట్లు లభించాయి. ఇద్దరు రెవెన్యూ అధికారులు, ట్రాఫిక్ సీఐ సమక్షంలో నిందితులను విచారించి వారి పేర్లు తెలుసుకున్నారు. 44 గంజాయి ప్యాకెట్లు తూకం చేయగా 92.132 కిలోల గ్రాములు తేలిందన్నారు. దీని విలువ దాదాపు రూ.9.20 లక్షలు ఉంటుందన్నారు. పారిపోయిన పూజారి వెంకటేశ్, మహమ్మద్ సద్దాం హుస్సేన్, మహేశ్, గవాలె తుకారాంపై గాలిపు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కొన్ని ప్రాంతాల్లో కోడ్ వర్డ్ సంకేతాలతో గంజాయి విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఎవరు అమ్ముతున్నారు? ఎవరు కొనుగోలు చేస్తున్నారు? అవి విషయలపై ప్రత్యేకంగా విచారణ జరుపుతున్నామని వివరించారు. సమావేశంలో డీఎస్పీ వీ ఉమేందర్ , రూరల్ సీఐ బీ రఘుపతి, సీసీఎస్ సీఐ చంద్రమౌళి, మావల ఎస్ఐ విష్ణువర్ధన్ ఉన్నారు.