నిర్మల్ అర్బన్, జూలై 2 : బాసర సరస్వతీ అమ్మవారి ఆలయంలో ఇటీవల జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. ఎస్పీ జానకీ షర్మిల వివరాలు వెల్లడించారు. గుంటూరు జిల్లాలకు చెందిన పల్లపు ఏడు కొండలు, నిజామాబాద్ జిల్లాకు చెందిన గైని కిరణ్ అలియాస్ రామకృష్ణ దొంగతనాలు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో ఏడు కొండలు 25 దొంగతనాలు చేయగా.. రామకృష్ణ 20 దొంగతనాల్లో కేసులు నమోదయ్యాయి. వీరు గత నెల 22న ఆలయంలోకి చొరబడి గేటు తాళం పగుల గొట్టి మహంకాళీ అమ్మవారి ఆలయంలోకి చొరబడి వెండి కిరీటం, హుండీని దొంగలించారు.
అనంతరం హుండీలో సుమారు రూ.16వేల నగదు తీసుకొని వెండి కిరీటాన్ని రెండు భాగాలుగా విడగొట్టి అమ్మవారి ఆలయం వెనకాల వ్యాస గుహ దగ్గర గల గుట్టల పైనుంచి పరారయ్యారు. మామూలు భక్తుల మాదిరిగా రైల్వే స్టేషన్కు చేరుకొని అక్కడి నుంచి పరారయ్యారు. ఎస్పీ ఆరు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి నాందేడ్, ధర్మాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఎస్ సిబ్బంది సమన్వయంతో సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం మేరకు కేసు దర్యాప్తు నిర్వహించారు.
దొంగలించిన వెండి కిరీటాన్ని విక్రయించేందుకు నిజామాబాద్కు చెందిన కోడా ఆనంద్ సహకారంతో మహారాష్ట్రలోని నాందేడ్కు తీసుకెళ్తుండగా రైలులో ప్రయాణిస్తున్న ముగ్గురిని బాసర రైల్వే పోలీస్స్టేషన్ వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి సుమారు 1.200 కిలోల వెండి కిరీటం, 260 గ్రాముల వెండి పట్టి, మోబైల్ ఫోన్ను స్వాధీనం చేసుకున్నారు. దొంగలించిన సొత్తును స్వీకరించి విక్రియించేందుకు సహకరించిన ఆనంద్ను అరెస్ట్ చేశారు.