ఇంద్రవెల్లి, ఫిబ్రవరి 5: నాగోబా మహాజాతర కోసం మెస్రం వంశీయులు సోమవారం రాత్రి కెస్లాపూర్ మర్రి చెట్లవద్దకు చేరుకున్నారు. మంచిర్యాల జిల్లా జన్నారం మండలంలోని కలమడుగు వద్ద గోదావరి నదిలోని హస్తలమడుగులో గత నెల 28న గంగాజలంతో బయల్దేరిన మెస్రం వంశీయులు సోమవారం మర్రి చెట్ల వద్దకు చేరుకున్నారు. ముందుగా ఉదయం వీరికి ఇంద్రవెల్లిలో స్థానిక మెస్రం వంశీయులు ఘన స్వాగతం పలికారు. అనంతరం స్థానిక ఇంద్రాదేవి ఆలయానికి చేరుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి సంప్రదాయ వాయిద్యాలు వాయిస్తూ గంగాజలం ఝరితో సోమవారం రాత్రికి కెస్లాపూర్ మర్రిచెట్లకు చేరుకున్నారు. గంగాజలం ఝరితో మెస్రం వంశీయులు మర్రిచెట్లకు చేరుకున్నట్లు నాగోబా పేన్ కొత్వాల్ తిరుపతి మెస్రం వంశీయుల పటేళ్లకు సమాచారం అందించారు. పవిత్ర గంగాజలం ఝరిని మర్రిచెట్ల ప్రాంతంలోని ఓ మోత్కాకు చెట్టుపై తెల్లని వస్త్రంతో కట్టి భద్రపరిచారు.
కుటంబ సమేతంగా బసచేశారు. మంగళవారం రాత్రి మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్తోపాటు మెస్రం వంశీయుల పటేళ్లు మర్రిచెట్లకు చేరుకొని ఫిబ్రవరి9న నాగోబాకు నిర్వహించే మహపూజలతోపాటు తూమ్(పిండప్రదానం)పూజల నిర్వహణపై చర్చించనున్నట్లు మెస్రం వంశీయుల పెద్దలు తెలిపారు. మర్రిచెట్ల వద్ద గంగాజలం ఝరితో నాలుగు రోజులు బసచేయనున్నట్లు పేర్కొన్నారు. 9న మర్రిచెట్ల నుంచి గోవాడ్కు నాగోబా జాతర కోసం చేరుకోనున్నారు. ఈ కార్యక్రమంలో మెస్రం కోసుకటోడ, పర్ధాంజీ మెస్రం దాదారావ్, కోసేరావ్ కటోడ, నాగోబా పేన్ కోత్వాల్ తిరుపతి, నాయక్వాడీ మెస్రం ధర్ము, కటోడ హనుమంత్రావ్, మెస్రం వంశీయులు గణపతి, కార్తీక్, మారుతి, తదితరులు పాల్గొన్నారు.