రాష్ట్ర ప్రభుత్వం ‘ఆసరా’ను అత్యంత పకడ్బందీగా అమలు చేస్తూ అభాగ్యులకు కొండంత అండగా నిలుస్తున్నది. వృద్ధులు, దివ్యాంగులు, వితంతువులు, నేత, గీత కార్మికులకు పింఛన్ అందిస్తూ భరోసానిస్తున్నది. సమైక్య పాలనలో రూ. 200గా ఉన్న పింఛన్ మొత్తాన్ని రూ. 2016కు, రూ. 500 ఉన్న దివ్యాంగుల పింఛన్ను రూ. 4016కు పెంచింది. దీనికి తోడు అర్హత వయసు 65 నుంచి 57 ఏండ్లకు కుదించి కొత్త వారిని సైతం ఎంపిక చేసింది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 56,416 మంది లబ్ధిదారులుండగా, ప్రతి నెలా రూ. 12 కోట్ల 96 లక్షలు పంపిణీ చేస్తూ, స్వీయ పాలన అంటే ఇది అని నిరూపిస్తున్నది.
– కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 20 (నమస్తే తెలంగాణ)
తెలంగాణ వచ్చి కేసీఆర్ సీఎం అయినంక పింఛన్ రూ.1500 చేసిండు. రెండోసారి అధికారంలోకి వచ్చినంక రూ. 3016కు పెంచిండు. మళ్లా ఇప్పు డు రూ.4016 చేసిండు. సర్కారోళ్లు ఇచ్చే పింఛన్ డబ్బులే నాకు అక్కరకు వస్తున్నయ్. ఇతరులపై ఆధారపడే అవసరం లేదు. నా బతుక్కి భరోసాని చ్చిన సీఎం కేసీఆర్కు జీవితాంతం రుణపడి ఉంట. బీఆర్ఎస్ సర్కారు ఉన్నంత కాలం మాకు ఢోకా లేదు. ఎప్పటికీ గెలిపించుకుంటం.
-దుర్వ జంగు, దివ్యాంగుడు, ప్రెసిడెంట్గూడ, సిర్పూర్-యు
కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : జిల్లాలో ప్రతి నెలా పంపిణీ చేసే ఆసరా పింఛన్లు అక్షరాల రూ. 12 కోట్ల 96 లక్షల 13 వేలు. రాష్ట్ర ప్రభుత్వం దిక్కూ మొక్కులేని అ భాగ్యులు, వృద్ధులు ఆసరా పింఛన్లతో కొండంత అండగా నిలుస్తున్నది. సమైక్య రాష్ట్రంలో టీడీపీ పాలనలో నెలకు రూ. 70 చొప్పున పింఛన్ ఇచ్చేవారు. అవికూడా ప్రతినెలా వచ్చే పరిస్థితి ఉండేది కాదు. ఇక కొత్త లబ్ధిదారులను చేర్చడం దేవుడెరుగు. ఎవరైనా మృతి చెందితే.. కొత్త లబ్ధిదారులకు అవకాశం వచ్చేది. కొత్త పింఛన్లకోసం బాధితుల నుంచి వినతి పత్రాలు వచ్చినా స్పందించే కాదు. మీ ఊళ్లో ఎవరైనా చస్తే అప్పుడు దరఖాస్తు తీసుకుంటామని నిర్మొహమాటంగా చెప్పి పంపించేవారు. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పింఛన్ డబ్బులను రూ. 200 వరకు పెంచింది. దివ్యాంగులకు మాత్రం నెలకు రూ. 500 ఇచ్చేవారు. కానీ.. ఆ డబ్బులు ఏమాత్రం సరిపోయేవి కావు.
2014లో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి.. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పింఛన్ల పంపిణీ సంఖ్య లెక్కకు మంచి పెరిగిపోయింది. దానికి తోడు పింఛన్ డబ్బులను సైతం పెంచింది. వృద్ధులు, వితంతువులు, చేనేత, గీత, బీడీ కార్మికులకు ప్రతినెలా రూ. 1000 చొప్పున పంపిణీ చేసింది. దివ్యాంగులకు రూ. 1500 చొ ప్పున అందించింది. ఆ తర్వాత 2016.. దివ్యాంగులకు రూ. 3016 పెంచింది. ప్రస్తుతం దివ్యాంగులకు రూ. 4016కు పెంచింది. పైగా పింఛన్ పొందే వయసు 57 ఏళ్లకు కుదించడంతో లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది.
సమైక్య పాలనలో పంచాయతీ కార్యదర్శులు, గ్రామ రెవెన్యూ అధికారులు, ఇతరత్రా సిబ్బంది ద్వారా పింఛన్లు పంపిణీచేసేవారు. దాంతో చేతివాటం, అవకతవకలు జరిగేవి. ఇప్పుడలాంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం అనర్హులు, బోగస్ లబ్ధిదారులు లేకుండా పక్కాగా వ్యవస్థను ప్రక్షాళన చేసింది. ఎంపిక చేసిన ప్రతి ఒక్కరికీ బ్యాంకులు, పోస్టాఫీసుల్లో నేరుగా డబ్బులు జమ చేస్తున్నది. ఒక్కో లబ్ధిదారుడి వేలి ముద్రలు సేకరించి ఆన్లైన్ ద్వారా ఎలాంటి అవకతవకలు జరుగకుండా పారదర్శకంగా అందిస్తున్నది. ఆధార్ నంబర్ల ఆధారంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ పింఛన్ అందుతోంది. ప్రతి నెలా ఒకటో తేదీ నుంచి మొదలు పెట్టి వారం రోజుల్లో ప్రక్రియను పూర్తి చేస్తున్నది.
తెలంగాణ ఏర్పడక ముందు కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో సుమారు 24 వేల మంది వరకు పింఛన్ లబ్ధిదారులు ఉండే వారు. వీరి కోసం నెలనెలా రూ. 50 లక్షల లోపు మాత్రమే పింఛన్ డబ్బులు వచ్చాయి. తెలంగాణ ఏర్పడి బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత లబ్ధిదారుల సంఖ్య రెట్టింపయ్యింది. ప్రస్తుతం 56,416 మంది లబ్ధిదారులకు ప్రతి నెలా రూ. 12 కోట్ల 96 లక్షలు పంపిణీ చేస్తున్నది.
నేను ఒంటరి మహిళలను. దిక్కూమొక్కు లేని నాకు సర్కారోళ్లు పింఛన్ ఇచ్చి అండగా నిలిచిన్రు. ప్రతి నెలా రూ. 2016 వస్తున్నయ్. నెల ఖర్చులకు సరిపెట్టుకుంటున్న. కేసీఆర్ మూడోసారి సీఎం అయితే మా పింఛన్ మరింత పెరుగుతుందనే నమ్మకం ఉంది. గీసారి కూడా బీఆర్ఎస్కే ఓటు వేస్తం. ఇసొంటి సీఎం ఉన్నంతకాలం పేదోళ్లకు మంచి జరుగుతది.
– సెడ్మకి కళాబాయి, వితంతు పించన్ లబ్ధిదారు, అలిగూడ, సిర్పూర్-యు
సాతనైనప్పుడు కూలీ పనులకు పోయిన. గిప్పుడు వయసు మీద పడింది. ఏ పనీ చేయలేకుంటైంది. సర్కారోళ్లే పింఛన్ ఇచ్చి ఆదుకుంటున్నరు. ప్రతి నెలా రూ. 2016 వస్తున్నయ్. గవ్వి టితోనే తిండికి కావాల్సినవి కొనుక్కుంటున్న. గీ పింఛన్ ఇయ్యకుంటే బతుకుడు మస్తు కష్టమయ్యేది. సీఎం కేసీఆర్ సార్ మా పెద్దకొడుకు లెక్క ఆదుకుంటున్నడు. బతికున్నంత కాలం కారు గుర్తుకే ఓటెస్తా.
-గెడాం నాగుబాయి, వృద్ధురాలు, జర్లఘాట్, సిర్పూర్-యు