నాగోబాకు అమావాస్య అర్ధరాత్రి అభిషేకించే గంగాజల సేకరణ కోసం ప్రారంభించిన పాదయాత్ర రెండో రోజూ కొనసాగింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన పాదయాత్ర సాయంత్రానికి పిట్టబొగురం గ్రామానికి చేరుకుంది. అక్కడే గంగాజలం సేకరించే ఝరికి మహిళలు, పురుషులు ప్రత్యేక పూజలు చేశారు. సహపంక్తి భోజనాలు చేసి అక్కడే బస చేశారు. సోమవారం ఉదయం బయలుదేరగా.. సాయంత్రానికి ఉట్నూర్ మండలంలోని నర్సాపూర్ గ్రామానికి చేరుకున్నారు. గ్రామస్తులు సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు.
– ఇంద్రవెల్లి, జనవరి 2
ఇంద్రవెల్లి, జనవరి 2 : నాగోబా మహాపూజ (జనవరి 21న)కు ఉపయోగించే పవిత్రమైన గంగాజలం సేకరణ కోసం ఆదివారం కెస్లాపూర్ నుంచి మెస్రం వంశీయుల పీఠాధిపతి మెస్రం వెంకట్రావ్పటేల్ ఆధ్వర్యంలో ప్రారంభమైన మహా పాదయాత్ర సోమవారం సాయంత్రానికి ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి చేరుకున్నది. మండలంలోని పిట్టబొంగురం గ్రామపొలిమేరలో గంగాజలం సేకరించే ఝరితో ఆదివారం రాత్రి అక్కడే బసచేసిన విషయం తెలిసిందే. సోమవారం ఉదయం పిట్టబొంగురం గ్రామస్తులతోపాటు మెస్రం వంశీయుల ఆధ్వర్యంలో ఝరికి పురుషులు, మహిళలు వేర్వేరుగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం మెస్రం వంశీయులకు గ్రామస్తుల ఆధ్వర్యంలో సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశారు.
ఆ తర్వాత మెస్రం వంశీయులు పిట్టబొంగురం నుంచి ఉట్నూర్ మండలం నర్సాపూర్ గ్రామానికి బయలుదేరారు. సాయంత్రం మెస్రం వంశీయులు చేరుకోగా, గ్రామస్తుల ఆధ్వర్యంలో గిరిజన సంప్రదాయం ప్రకారం గ్రామ పొలిమేరలో ఘనంగా స్వాగతం పలికారు. అక్కడ రాత్రి బసచేయగా, గ్రామస్తుల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో మెస్రం వంశీయులు కటోడ కోసు, ప్రర్ధాంజీ దాదారావ్, కటోడ కోసేరావ్, కటోడ హనుమంత్రావ్, గణపతి, తిరుపతి, ధర్ము, చిత్రు, మారుతి, వంశీయులు తదితరులు పాల్గొన్నారు.
ఏర్పాట్లను పరిశీలించిన డీఈ..
నాగోబా జాతరను పురష్కరించుకొని ఆర్డబ్ల్యూఎస్ శాఖ ఆధ్వర్యంలో చేపడుతున్న ఏర్పాట్లను డీఈ శ్రీనివాస్ పరిశీలించారు. ఆలయ పరిసరాల్లో సోమవారం ఆయన పర్యటించారు. చేపట్టే పనులను గుర్తించి, ఖర్చుపై ప్రణాళిక చేసి జిల్లా అధికారులకు అందిస్తామని తెలిపారు. భక్తులతోపాటు మెస్రం వంశీయులకు అవసరమయ్యే ఏర్పాట్లు చేయనున్నట్లు చెప్పారు. తాత్కాళిక మరుగుదొడ్లతో పాటు స్నానపు గదులు ఏర్పాటు చేస్తామన్నారు. తాగునీటి పైపు లైన్లకు మరమ్మతులు చేసి, సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. ఆయన వెంట సర్పంచ్ మెస్రం రేణుకానాగ్నాథ్, ఏఈ భానుకుమార్, తదితరులు పాల్గొన్నారు.