గత నెల 30న ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంగా సీఎం కేసీఆర్ పోడు పట్టాల పంపిణీకి శ్రీకారం చుట్టగా, ఊరూరా ఉత్సాహంగా సాగుతున్నది. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా మంత్రి అల్లోలతోపాటు ఎమ్మెల్యేలు, అధికారులు పోడు పట్టాలు అందిస్తుండగా, గిరిజనం వాటిని అందుకొని మురిసిపోతున్నది. సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో దశాబ్దాల కల నెరవేరడంతో సంబురపడిపోతున్నది. మరోవైపు పోడు భూముల విషయంలో నమోదైన కేసులను ఎత్తివేస్తామనడంతో పాటు రైతుబంధు, రైతుబీమా వర్తింపజేస్తామని, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేస్తామని ప్రభుత్వం ప్రకటించగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. సమైక్య పాలనలో తమ గోడును పట్టించుకున్నవారు లేరని, స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన మాటకు కట్టుబడి పోడు పట్టాలు పంపిణీ చేశారని, ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటామని అడవిబిడ్డల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది.
ఇగ ఇంతకన్నా ఏంగావాలే..
చెన్నూర్, జూలై 4 : మా ఊరి సమీపంలో 4.35 ఎకరాలను పోడు చేసుకున్నం. 30 ఏండ్ల సంది గదే భూమిని దున్నుకొని బతుకుతున్నం. మా మామ పోచయ్యకు కూడా ఇంత భూమి ఉంది. గీ భూములకు గిప్పటి దాకా ఎలాంటి కాయితాలు లేవు. యేటా పంటలు వేసే టైమ్కి ఫారెస్టోళ్లు వచ్చిక మమ్మల్ని బెదిరించేవాళ్లు. మస్తు తిప్పలయ్యేది. ఒక్కోసారి పంటలు కూడా వేసేటోళ్లం కాదు. కానీ.. సీఎం కేసీఆర్ సార్ దయవల్ల మాకు పట్టా వచ్చింది. ఇగ మాకు ఢోకా లేదు. రైతుబంధు కూడా వస్తది. రైతుబీమా కూడా ఉంటదని సార్లు చెబుతున్రు. ఇంతకన్నా ఏంగావాలే. మస్తు సంబురమైతంది.
– కొర్రెం శశికళ, ఆల్గాం, కోటపల్లి మండలం
రంది లేకుండా ఎవుసం..
చెన్నూర్, జూలై 4 : మా ఊరిలో మాకు .29 గుంటల భూమి ఉంది. మస్తు ఏండ్లసంది దున్నుకుంటున్నం. పట్టాలేక ఇప్పటి దాకా మస్తు తిప్పల పడ్డం. గతంలో పట్టాలిస్తమని కొందరు చెప్పిన్రు. ఆ తర్వాత పట్టించుకున్న పాపాన పోలేదు. ఇగ గింతే అనుకున్నం. కానీ.. సీఎం కేసీఆర్ సార్ మమ్ముల దేవునిలెక్క ఆదుకున్నడు. పట్టా ఇచ్చి భరోసానిచ్చిండు. ఇగ ఇప్పుడు ఎవ్వరికీ భయపడాల్సిన పనిలేదు. రైతుబంధు డబ్బులు కూడా ఇస్తరట. ఇగ రంది లేకుంట ఎవుసం చేస్తం.
– మడె సుమలత, రొయ్యలపల్లి, కోటపల్లి
కల నెరవేరింది
చెన్నూర్, జూలై 4 : నేను 0.26 ఎకరాల పోడు భూమిలో సాగు చేసుకుంటున్న. మొదట్లో జొన్న, పెసరు, నువ్వులు వేసిన. ఇప్పుడు పత్తి సాగు చేస్తున్న. నా భూమికి పట్టా ఇవ్వాలని ఆఫీసుల చుట్టూ తిరిగిన. ఎవ్వరూ పట్టించుకోలేదు. పైగా ఫారెస్ట్ భూమి అని బెదిరించేటోళ్లు. కానీ.. మా సీఎం కేసీఆర్ సార్ వల్ల నా కల నెరవేరింది. ఇగ ఇప్పుడు రంది లేకుంటైంది.
– కుర్సింగ సమ్మయ్య, అర్జునగుట్ట, కోటపల్లి
పక్షం రోజులు జైలుకు పోయిన
చెన్నూర్, జూలై 4 : నేను 1.38 ఎకరాల భూమిని పోడు చేసుకు న్నం. 30 ఏండ్ల సంది గీ భూమినే దున్నుకొని బతుకుతున్నం. అధికారులు వచ్చి మమ్మల్ని బెదిరించేటోళ్లు. పంటను ధ్వంసం చేసి కేసులు కూడా పెట్టెటోళ్లు. నా మీద కూడా కేసు పెట్టిన్రు. 15 రోజులు జైళ్ల నరకం చూసిన. కానీ.. కేసీఆర్ సార్ పట్టా ఇచ్చి దేవునోలే ఆదుకున్నడు. ఇగ సక్కగా ఎవుసం చేసుకుంట. గిదంతా సీఎం కేసీఆర్ పుణ్యమే.
– ఆత్రం చిన్నన్న, లింగన్నపేట, కోటపల్లి
మాట నిలబెట్టుకున్న సీఎం..
చెన్నూర్, జూలై 4 : 30 ఏండ్ల సంది పోడు భూముల్లో సాగు చేసుకుంటున్నం. ఫారెస్ట్ సార్లు వచ్చి బెదిరించేటోళ్లు. దున్నుకుంటే అడ్డం పడేటోళ్లు. ఇదివరకున్న పాలకులకు మా బాధలు చెప్పినం. గాళ్లు పట్టించుకోలేదు. తెలంగాణ వచ్చినంక మాకు నమ్మకమొచ్చింది. సీఎం కేసీఆర్ సార్ పట్టాలిస్తామని చెప్పిన్రు. ఇచ్చిన మాట మీదనే ఈ రోజు మాకు పట్టాలచ్చినయ్. విప్ బాల్క సుమన్ సార్ మాకు పట్టాలిచ్చిన్రు. మా బాధలు తీర్చిన సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటం.
– ఎర్మా లక్ష్మి, రొయ్యలపల్లి, కోటపల్లి
మొదటి నుంచి సీఎం సార్ మీదే నమ్మకం
చెన్నూర్, జూలై 4 : 30 ఏండ్ల సంది 1.04 ఎకరాల్లో పోడు చేసుకొని పంటలు పండించుకుంటున్న. గా భూమిపై మాకు ఎలాంటి హక్కులు లేవు. ఫారెస్టు సార్లు మాటి మాటికీ వచ్చి బెదిరించేటోళ్లు. ఎప్పుడు ఏం చేస్తరో.. ఏం కేసులు పెడ్తరోనని భయపడుతూనే పంటలు తీసేటోళ్లం. మొదటి నుంచి సీఎం కేసీఆర్ సార్ మాకు న్యాయం చేస్తరని నమ్మకముండే. అనుకున్నట్లుగానే పట్టాలిచ్చి మాకు దేవుడైండు. మా ఎమ్మెల్యే సుమన్ సార్ చేతుల మీదుగా పట్టాలందుకున్నం. మంచిగ దున్నుకొని బతుకమని చెప్పిండు.
– కొడిపె రామక్క, నక్కలపల్లి, కోటపల్లి
ఎన్నో ఇబ్బందులు పడ్డా
చెన్నూర్, జూలై 4 : నేను 25 ఏండ్ల కింద ఎకరం భూమిని పోడు చేసుకొని మామిడి తోట పెట్టుకున్న. అయితే పోడు భూమి అని అటివిశాఖ అధికారులు నన్ను ఎన్నో ఇబ్బందులు పెట్టారు. అధికారుల ఇబ్బందుల గురించి అప్పటి పాలకులకు చెప్పుకున్నా పట్టించుకోలేదు. ఇబ్బందులు పడుతూనే మామిడి తోటను కాపాడుకుంటు వచ్చిన. ఇప్పడు సీఎం కేసీఆర్ పట్టాలు ఇవ్వటంతో మాకు ఇబ్బందులు తప్పినయ్.
– కడియాల కనకరాజు, అర్జునగుట్ట, కోటపల్లి
ఆదివాసుల పాలిట దేవుడు కేసీఆర్
రెబ్బెన, జూలై 4 : భూములను నమ్ముకొని జీవిస్తున్న ఆదివాసీ గిరిజనులకు పోడు పట్టాలు అందించి సీఎం కేసీఆర్ దేవుడయ్యాడు. గూడెల్లో నివాసం ఉంటున్న ఎస్టీలు సమాజానికి దూరంగా అటవీ ప్రాంతాలను నమ్ముకొని వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. అలాంటి వారి జీవితాల్లో వెలుగులు నింపడానికి కేసీఆర్ పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపించడం హర్షించదగిన విషయం.
– బుర్స పోశమల్లు, సర్పంచ్, పులికుంట(రెబ్బెన మండలం)
ఢోకా లేకుండా ఎవుసం చేసుకుంట..
చెన్నూర్, జూలై 4 : 25 ఏండ్ల సంది 4.38 ఎకరాల పోడు భూమిలో ఎవుసం చేస్తున్న. పట్టా లేక మస్తు తిప్పలపడ్డం. అధికారులు వచ్చి బెదిరించి కేసులు పెట్టేటోళ్లు. నా మీద కూడా కేసు పెట్టిన్రు. పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగినం. మస్తు బాధల పడ్డం. గిప్పుడు సీఎం కేసీఆర్ సార్ మాకు పట్టా ఇచ్చిండు. భూమి మీద మాకు పూర్తి హక్కులు వచ్చినయ్. రైతుబంధు డబ్బులు కూడా ఇస్తరట. ఇప్పటి దాకా పెట్టుబడి కోసం సావుకార్ల సుట్టూ తిరిగిన. ఇగ గిప్పుడు సీఎం సార్ ఇచ్చే డబ్బులతోనే ఢోకా లేకుండా ఎవుసం చేసుకుంట.
– నాయిని సమ్మయ్య, లింగన్నపేట, కోటపల్లి
సీఎం సారును తలుసుకుంటం..
చెన్నూర్, జూలై 4: మా ఊరి దగ్గర ఎకరం పది గుంటల భూమి ఉంది. మస్తు ఏండ్ల సంది సాగు చేసుకుంటున్నం. గీ భూమే మా బతుకులకు ఆధారం. పట్టా లేక మస్తు తిప్పల పడ్డం. ఎప్పుడు ఏ సార్లు వచ్చి ఏమంటరోనని భయపడేటోళ్లం. గిప్పుడు సీఎం కేసీఆర్ సార్ మాకు మేలు చేసిండు. నిన్న మా విప్ సుమన్ సార్ మాకు పట్టా ఇచ్చిండు. అది అందుకున్నంక మస్తు సంతోషమనిపించింది. ఇప్పుడు మా భూమిపై హక్కు ఉంది. ఇది కలా నిజమా అనుకున్నం. ఇగ మాకు రైతుబంధు కూడా వస్తది. బతికున్నంత కాలం ముఖ్యమంత్రి కేసీఆర్ను తలుసుకుంటం.
– కొడిపె సమ్మక్క, ఆల్గాం, కోటపల్లి
కేసీఆర్ సార్ దేవుడు
చెన్నూర్, జూలై 4 : మా తాత 5.38 ఎకరాల్లో ఎవుసం చేసేటోడు. పట్టా లేకపోవడంతో అధికారులు వచ్చి బెదిరించేటోళ్లు. ఎట్లనో అట్ల.. మా తాత పంట తీసేటోడు. ఇప్పుడు గా భూమినే మేము సాగు చేసుకుంటున్నం. మాకు కూడా భయంభయంగానే ఉండేది. ఫారెస్ట్ సార్లు ఏం కేసు పెడుతారోనని.. ఇప్పుడు సీఎం కేసీఆర్ సార్ వల్ల మా తిప్పలన్నీ తిప్పినయ్. ఇగ రంది లేకుంట వ్యవసాయం చేసుకుంటం. రైతుబంధు ఇస్తరంటున్నారు. లోన్లు కూడా వస్తయట. మాకు సంతోషంగా ఉంది. సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడు అయ్యిండు.
– మడె గ్రీష్మ, ఆల్గాం, కోటపల్లి
జీవితాంతం రుణపడి ఉంటాం..
రెబ్బెన, జూలై 4 : పోడు భూములకు పట్టాలు అందించిన సీఎం కేసీఆర్ సార్కు జీవితాంతం రుణపడి ఉంటాం. 2005వ సంవత్సరం నుంచి రెబ్బెన శివారులో గల భూమిని సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాం. పట్టాలు రాక ముందు భూమిలోకి వెళ్లాలంటే భయమయ్యేది. అధికారులు వ్యవసాయం చేయకుండా చాలా ఇబ్బందులు పేట్టెవారు. ఈ భూములకు కేసీఆర్ సర్కారు పట్టాలు అందించడంతో బాధలు తప్పాయి. నాకు నాలుగెకరాలకు పట్టా రావటం సంతోషంగా ఉంది.
– మీసాల శ్యాంరావు, రైతు, నక్కలగూడ(రెబ్బెన మండలం)
కుటుంబమంతా సంతోషంగా ఉంది
రెబ్బెన, జూలై 4 : పోడు భూములకు పట్టాలు అందించడంతో మా కుటుంబం సంతోషంగా ఉంది. పులికుంట శివారులో 2.3 ఎకరాల భూమి 1995 సంవత్సరం నుంచి సాగు చేసుకుంటున్నా. భూమి సాగు చేయనియకుండా అటవీ అధికారులు వేధించడంతోపాటు కేసులు కూడా నమోదు చేశారు. అయినప్పటికీ భూమిని నమ్ముకున్న మాకు వేరే ఆధారం లేకపొవడంతో వేధింపులు, కేసులకు భయపడకుండా సాగు చేయడంతో తెలంగాణ సర్కారు పట్టాలు అందించింది. సీఎం కేసీఆర్ దయతో అన్నం దొరుకుతోంది.
– టేకాం భీమయ్య, రైతు, పులికుంట కాలనీ(రెబ్బెన)
రైతన్నకు అండగా ..
రెబ్బెన, జూలై 4 : కేసీఆర్ రైతన్నకు అండగా నిలిచి అనేక పథకాలు అందిస్తుండు. పోడు వ్యవసాయం చేసుకునే రైతులు ఇబ్బందులు పడొద్దని పట్టాలు అందించాడు. రైతులు పంట సమయంలో ఇబ్బంది పడొద్దని రైతుబంధు పథకం ద్వారా డబ్బులు అందిస్తున్నాడు. రైతు ప్రమాదంలో చనిపొతే ఆయన కుటుండానికి రైతుబీమా అందిస్తుందన్నారు. రైతు రాజ్యం రావాలని సీఎం కేసీఆర్ చేస్తున్న కృషికి అందరూ మద్దతుగా నిలవాలి.
– కుందారపు శంకరమ్మ, రైతు బంధు సమితి జిల్లా సభ్యురాలు(రెబ్బెన మండలం)
సంతోషంగా ఉంది..
రెబ్బెన, జూలై 4 : భూమిని నమ్ముకొని జీవిస్తున్న మాకు ఆధారం అందడం సంతోషంగా ఉంది. అధికారులతో ఆటంకాలు ఎదురైనప్పటికీ కేసీఆర్ సారు దేవుని లెక్క పోడు వ్యవసా యానికి పట్టాలు అందించడంతోపాటు పెట్టుబడి సాయం కోసం రైతుబంధు ద్వారా నిధులు అందించడం ఆనందంగా ఉంది. ఇంత మంచి పని చేసిన కేసీఆర్కు ధన్యవాదాలు.
– అరికెల సరిత, మహిళా రైతు, నక్కలగూడ (రెబ్బెన మండలం)