పరిపాలనా సౌలభ్యం, ప్రభుత్వ పాలనను ప్రజలకు మరింత చేరువ చేసే లక్ష్యంతో రాష్ట్ర సర్కారు కొత్తగా నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ దాదాపు పూర్తికావచ్చింది. ఎల్లపల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లు వెచ్చించి అత్యాధునిక సౌకర్యాలతో శరవేగంగా నిర్మిస్తున్నది. ఇప్పటికే 90 శాతం పనులు పూర్తికాగా, వచ్చే నెల మొదటి వారంలో అందుబాటులోకి తెచ్చేందుకు యంత్రాంగం కృషి చేస్తున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసేందుకు సన్నాహాలు చేస్తున్నది. మరోవైపు జిల్లా స్థాయి అధికారుల క్వార్టర్లకోసం అదనంగా రూ. 8 కోట్లు కేటాయించగా, మరికొద్ది రోజుల్లో పనులు ప్రారంభించే అవకాశమున్నది.
– నిర్మల్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ)
నిర్మల్, ఫిబ్రవరి 28(నమస్తే తెలంగాణ) : నిర్మల్ మండలం ఎల్లపెల్లి గ్రామ శివారులో రూ.56 కోట్లతో నిర్మిస్తున్న కొత్త కలెక్టరేట్ దాదాపు పూర్తికావచ్చింది. సర్వాంగా సుందరంగా ముస్తాబైన కలెక్టరేట్లో దాదాపు 90శాతం మేర పనులు పూర్తయ్యాయి. అంతర్గత రోడ్లతో పాటు ల్యాండ్ స్కేపింగ్ పనులు కొనసాగుతున్నాయి. పనులు ప్రారంభమైన నాటి నుంచి సమీకృత భవన సముదాయం వేగవంతంగా పూర్తి చేయడంలో స్థానిక మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారు. ఎప్పటికప్పుడు పనుల పురోగతిని పరిశీలిస్తూ అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఇటీవల కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన వరుణ్రెడ్డి సైతం సమీకృత కలెక్టరేట్ను సందర్శించారు.
పనులు త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని ఆర్అండ్బీ, పంచాయతీరాజ్ శాఖల అధికారులను ఆదేశించారు. ప్రజలకు ఆహ్లాదకర వాతావరణం అందించే విధంగా బ్లాకుల వారీగా పూల మొక్కలు నాటించి, ఎటు చూసినా పచ్చదనం కనిపించేలా ఉండాలని సూచించారు. 1.20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో జీ ప్లస్ టూ అంతస్తుల్లో చేపట్టిన ఇంటిగ్రేటెడ్ కలెక్టరేట్లో 33 శాఖలు కొనసాగేలా నిర్మాణాలు చేపట్టారు. వచ్చే నెల మొదటి వారంలోగా అందుబాటులోకి తెచ్చేందుకు కృషిచేస్తున్నారు. ఆపై సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
16 ఎకరాల్లో ..
నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి సమీపంలో నిర్మిస్తున్న సమీకృత కలెక్టరేట్ భవన నిర్మాణం కోసం సుమారు 16 ఎకరాలను కేటాయించారు. ఇందులో లక్షా 20 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో అన్ని ప్రభుత్వ శాఖల కోసం జీ ప్లస్టూ విధానంలో భవన నిర్మాణాలను చేపట్టారు. గ్రౌండ్ ఫ్లోర్లో కలెక్టర్, అడిషనల్ కలెక్టర్ల చాంబర్లతో పాటు ప్రజల కోసం రెండు వెయిటింగ్ హాల్స్, అలాగే రెండు వీడియోకాన్ఫరెన్స్ హాళ్లు, అధికారుల సహాయకుల కోసం రెండు ప్రత్యేక గదులు నిర్మించారు. అలాగే కొన్ని ప్రభుత్వ శాఖల నిర్వహణకోసం నిర్మాణాలు చేపట్టారు. అంతేగాకుండా దాదాపు 500 మందితో ఒకేసారి సమావేశాన్ని నిర్వహించే విధంగా సువిశాలమైన హాల్ను కూడా గ్రౌండ్ ఫ్లోర్లో నిర్మించారు. మొదటి అంతస్తులో మంత్రి చాంబర్తో పాటు వివిధ శాఖల కోసం, రెండవ అంతస్తులో మిగతా అన్ని శాఖల కోసం అవసరమైన నిర్మాణాలు చేపట్టారు. కాగా గ్రౌండ్ ఫ్లోర్లో సమీకృత భవన సముదాయం మధ్యలో దాదాపు 10 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన గ్రీనరీ కనువిందు చేస్తున్నది.
పూర్తయిన పనులు
జిల్లా సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఇప్పటికే 90 శాతం మేర పనులు పూర్తయినట్లు ఆర్అండ్బీ అధికారులు చెబుతున్నారు. మూడు అంతస్తుల్లో చేపట్టిన ఇక్కడి భవనంలో ప్రస్తుతం ఇంటీరియర్ పనులు జరుగుతున్నాయి. ప్లాస్టరింగ్, లప్పం, రంగులతో పాటు ఫ్లోరింగ్ పనులు పూర్తి కాగా, రెండో అంతస్తులో పీవోపీ పనులు కొనసాగుతున్నాయి. భవనంలో లిఫ్ట్ సౌకర్యం కల్పించారు. లిఫ్ట్ ఏరియాతో పాటు అవసరమైన చోట గ్రానైట్ పనులు జరుగుతున్నాయి. ప్రహరీ, ముఖద్వార ఆర్చ్, సెక్యూరిటీ గార్డు గది నిర్మాణం పూర్తయింది. అన్ని కార్యాలయాలకు అవసరమైన నీటిని అందించేందుకు అండర్ గ్రౌండ్లో 80వేల లీటర్ల సామర్థ్యంతో సంప్ను నిర్మించారు. అలాగే 20 వేల లీటర్ల సామర్థ్యంతో రెండు ఓవర్హెడ్ ట్యాంకులను నిర్మించారు. వీటిని మిషన్ భగీరథ ద్వారా శుద్ధమైన నీటితో నింపేందుకు అవసరమైన పైప్లైన్ పనులు సైతం దాదాపుగా పూర్తి కాగా, ట్రయల్న్ పనులు పర్యవేక్షిస్తున్నారు. కలెక్టరేట్ ఎదుట ఆవరణలో ప్రత్యేకంగా హెలీప్యాడ్ను సైతం నిర్మించారు. అంతర్గత రోడ్లకు సంబంధించి బీటీ వేయాల్సి ఉంది. డ్రైనేజీ, శానిటేషన్ పనులు చివరి దశలో ఉన్నాయి. కలెక్టరేట్ సముదాయానికి నాణ్యమైన, నిరంతర విద్యుత్ను అందించేందుకు ప్రత్యేకంగా సబ్స్టేషన్ ఏర్పాటు చేశారు.
రూ.8కోట్లతో అధికారులకు క్వార్టర్లు
జిల్లా స్థాయి అధికారుల నివాసం కోసం 5 క్వార్టర్లను నిర్మించేందుకు ప్రభుత్వం అదనంగా రూ.8 కోట్లు కేటాయించింది. కలెక్టర్, అడిషనల్ కలెక్టర్, డీఆర్వోతో పాటు జిల్లా స్థాయి అధికారులకోసం మరో రెండు క్వార్టర్లను నిర్మించనున్నారు. ఇందుకోసం నటరాజ్నగర్ ప్రాంతంలోని పాత ఎస్సారెస్పీ క్వార్టర్స్కు చెందిన 3.5 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం ఇక్కడి స్థలాన్ని చదును చేసే పనులు కొనసాగుతున్నాయి. త్వరలోనే పనులు ప్రారంభిస్తామని అధికారులు చెబుతున్నారు.
మొదటి వారంలోగా పనులు పూర్తి
మార్చి నెల మొదటి వారంలోగా సమీకృత కలెక్టరేట్ భవన సముదాయ నిర్మాణం పూర్తి చేస్తాం. భవన నిర్మాణం, మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం రూ.56 కోట్లు కేటాయిం చింది. దాదాపు 90 శాతం పనులు పూర్తయ్యాయి. ప్రస్తుతం తుది మెరు గులు దిద్దే పనులు కొనసాగు తున్నాయి. ముఖ్యంగా అంతర్గత రోడ్లకు బీటీ వేయాల్సి ఉంది. ఆవరణలోని ఖాళీ స్థలంలో లెవెలింగ్ పనులు కొనసాగుతు న్నాయి. హెలీప్యాడ్ నిర్మాణం కూడా పూర్తయింది. అధికారుల క్వార్టర్ల నిర్మాణం కోసం ప్రభుత్వం అదనంగా రూ.8 కోట్లు కేటాయించింది. ఈ పనులు త్వరలోనే ప్రారంభిస్తాం
– వీ.అశోక్కుమార్, ఈఈ, రోడ్లు భవనాలశాఖ, నిర్మల్ జిల్లా