“వ్యవసాయానికి 24 గంటల కరంటు ఇచ్చి పంటలను కాపాడుతున్నది మా సర్కారే. కరంటు కోతలంటూ ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఒక్క ఎకరం పంట అయినా ఎండిందా?” అని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి బీజేపీ నాయకులను ప్రశ్నించారు. మంగళవారం నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్లో జడ్పీ చైర్ పర్సన్ విజయలక్ష్మి అధ్యక్షతన జిల్లా పరిషత్ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముథోల్ ఎమ్మెల్యే విఠల్రెడ్డి, ఎమ్మెల్సీ దండె విఠల్తో కలిసి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తుంటే.. నిధుల విషయంలో బీజేపీ నాయకులు వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు.
నిర్మల్ టౌన్, ఫిబ్రవరి 14 : ‘రైతులకు 24 గంటల కరంట్ ఇచ్చి పంటలను కాపాడుతున్నాం. కానీ, స్థానిక బీజేపీ నాయకులు కరంట్ కోతలంటూ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు. రాష్ట్రంలో ఏ ఒక్క ఎకరం అయినా ఎండిపోయిందా..?’ అని బీజేపీ నేతలను మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తుంటే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం నిధుల విషయంలో వివక్ష చూపుతున్నా అభివృద్ధి ఆగడంలేదని ఆత్మవిమర్శ చేసుకొని మాట్లాడాలని ఆ పార్టీ నాయకులకు చురకలు అంటించారు.
నిర్మల్ పట్టణంలోని దివ్య గార్డెన్స్లో మంగళవారం జడ్పీ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి అధ్యక్షతన జడ్పీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టర్ వరుణ్ రెడ్డి, ముథోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎమ్మెల్సీ దండే విఠల్, డీసీఎంఎస్ చైర్మన్ తిప్ప లింగయ్య హాజరయ్యారు. వ్యవసాయశాఖపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో కుంటాల ఎంపీపీ గజ్జారాం రైతులకు కరంట్ కోతలు విధించడం వల్ల పంటలు ఎండిపోతున్నాయని సభ దృష్టికి తీసుకొచ్చారు.
వెంటనే మంత్రి అల్లోల జోక్యం చేసుకొని జిల్లాలో ఎక్కడ పంట ఎండిపోయిందో చూపించాలని సవాల్ విసిరారు. ఇతర రాష్ర్టాల్లో 5 గంటలు కూడా కరంట్ ఇవ్వలేని బీజేపీ ప్రభుత్వం, తెలంగాణలో కరంట్ సరఫరాపై విమర్శిస్తే ఊరుకునేది లేదని స్పష్టం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వంపై కక్ష్యకట్టి నిధులు ఆపినా బీజేపీ నాయకులు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని ప్రశ్నించారు. పేదలకు ఉపాధి కల్పిస్తే జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకానికి నిధులు తగ్గించడం, విశ్వవిద్యాలయంలో మొండి చేయి చూపించడం, గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయకపోవడం, నవోదయ పాఠశాలలు మంజూరు చేయకపోవడం ఇవన్నీ సత్యాలు కావా..? అని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తు న్న సంక్షేమ పథకాలను చూసే బీఆర్ఎస్ పార్టీకి ఆదరణ పెరుగుతున్నదని, దీంతో బీజేపీ నాయకులు తమ ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ రాజకీయ పబ్బం గడుపుకుంటున్నారని విమర్శించారు.
అభివృద్ధి పథంలో రాజీపడం..
సంక్షేమ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. ఒకవైపు కేంద్రం సహాయ నిరాకరణ చేపట్టినా రాష్ట్రంలో రైతులకు 24 గంటల కరంట్, రైతు బీమా, పింఛన్లు, జిల్లాకో మెడికల్ కళాశాల, సాగునీటి ప్రాజెక్టుల అభివృద్ధి డబుల్ బె డ్రూం ఇండ్ల వంటి పథకాలను అమలవుతున్నట్లు వివరించారు. పల్లె ప్రగతిలో భాగంగా సీసీ రోడ్లు, వైకుంఠధామాలు, పల్లె ప్రకృతి వనాలు, పంట కళ్లాలు నిర్మించినట్లు వెల్లడించారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అధికారులు ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు.
సారంగాపూర్ జడ్పీటీసీ పత్తిరెడ్డి రాజేశ్వర్రెడ్డి మాట్లాడుతూ.. ప్రొటోకాల్ పాటించడం లేదని సభ దృష్టికి తీసుకువచ్చారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వరుణ్రెడ్డి తెలిపారు. జిల్లాలో రేషన్ బియ్యం పక్కదారి పడుతున్నా పట్టించుకోవడం లేదని సోన్ జడ్పీటీసీ జీవన్రెడ్డి పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపించాలని మంత్రి అల్లోల కలెక్టర్కు సూచించారు. కడెం మండలంలో పని చేస్తున్న అధికారులు సమాచారం ఇవ్వడం లేదని, అలెగ్జాండర్ పేర్కొనగా, ఇక నుంచి సమాచారం ఇప్పిస్తామని తెలిపారు.
రాష్ట్ర ప్రభుత్వం పథకాలను అమలు చేయడం వల్లే మంచి పేరు వస్తున్నదని ఎంపీపీ రామేశ్వర్రెడ్డి సభలో పేర్కొన్నారు. మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటిని అందిస్తున్నామని ఎస్ఈ వెంకటేశ్వర్లు వివరించారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.34 కోట్లు మంజూరైనట్లు పంచాయతీరాజ్ ఈఈ శంకరయ్య తెలిపారు. డీఆర్డీఏ ద్వారా అమలవుతున్న పథకంలో నిర్మల్ జిల్లా మొదటిస్థానంలో ఉన్నదని డీఆర్డీవో విజయలక్ష్మి సభకు వివరించారు. జిల్లాలో ఓవర్లోడ్ ఎక్కువైనా విద్యుత్ సమస్య తలెత్తకుండా రైతులకు కరంట్ సరఫరా చేస్తున్నామని ఎస్ఈ జయంత్రావుచౌహాన్ పేర్కొన్నారు. జిల్లాలో అధిక ధరలకు ఎరువులు విక్రయిస్తున్నారని, అలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు సమావేశంలో పేర్కొన్నారు.
అభివృద్ధికి సహకరించాలి.. :జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి..
నిర్మల్ జిల్లా అభివృద్ధికి ప్రతి ఒక్కరూ సహకరించాలని జడ్పీ చైర్పర్సన్ విజయలక్ష్మి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో మంత్రి సహకారంతో జిల్లా అభివృద్ధికి అనేక నిధులు తీసుకొచ్చించ్చారని పేర్కొన్నారు. వాటిని సద్వినియోగం చేసుకొని, అభివృద్ధి పథకాలు వేగంగా ప్రజలకు అందేలా చూడాలన్నారు.
పనితీరులో పారదర్శకత మెరుగుపరుస్తాం : నిర్మల్ కలెక్టర్ వరుణ్ రెడ్డి..
జిల్లాలోని అధికారుల పనితీరులో పారదర్శకత మెరుగుపరుస్తూనే ప్రజలకు జవాబుదారీతనంగా పనిచేసి, ప్రభుత్వ కార్యక్రమాలను విజయవంతం చేస్తామని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి అన్నారు. జిల్లాలో ఎరువుల ధరల విక్రయంపై విచారణ జరుపుతామని పేర్కొన్నారు. ఉద్యోగులు అనుమతి లేకుండా కార్యాలయాలకు రాకపోతే కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అక్రమ బియ్యం రవాణాపై విజిలెన్స్ టీంను ఏర్పాటు చేసి, నియంత్రిస్తామన్నారు. జిల్లా అధికారులు తప్పనిసరిగా ప్రొటోకాల్ పాటించాలని సూచించారు.
అభివృద్ధి చేసే ప్రభుత్వానికి అండగా.. : ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్ రెడ్డి..
ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ప్రజలు అండగా ఉంటారని ముథోల్ ఎమ్మెల్యే గడ్డిగారి విఠల్రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిర్మల్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. సీఎం కేసీఆర్ రైతులకు 24 గంటల కరంట్ సరఫరా కోసం కొనుగోలు చేసి, ఇస్తున్నారని జడ్పీ సభ్యులకు వివరించారు. నూతన కలెక్టర్ వరుణ్రెడ్డిని సన్మానించారు. ఈ సమావేశంలో జడ్పీ సీఈవో సుధీర్కుమార్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, జడ్పీ వైస్ చైర్మన్ సాగరబాయి రాజన్న, జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.