కుమ్రం ఆసిఫాబాద్, జనవరి 14 (నమస్తే తెలంగాణ): జిల్లాలో పదేళ్లుగా పులుల సంచారం పెరిగింది. తడోబా, తిప్పేశ్వరం నుంచి పులుల రాకపోకలు కొనసాగుతున్నాయి. జిల్లాలో 2015లో మొదటిసారిగా కదంబా అడవుల్లో పులిని గుర్తించారు. ఇక ఆ తర్వాత క్రమంగా పులుల సంతతి పెరుగుతూ వచ్చింది. కాగా, ఇటీవల జరుగుతున్న ఘటనలు వాటి మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్నాయి.
జిల్లాలోని కాగజ్నగర్ పరిధి దరిగాం అటవీ ప్రాం తంలో రెండు పులులు మృతి చెందాయి. ఇందులో ఒక పులి కళేబరాన్ని ఈ నెల 6న గుర్తించారు. రెండు పులుల మధ్య జరిగిన ఘర్షణలో ఆడపులి మృతి చెందినట్లుగా నిర్ధారించారు. ఇక ఇంకో పులి గాయాలతో అడవుల్లో తిరుగుతున్నట్లు అధికారులు ప్రకటించారు. ఇక ఆ తర్వాత రెండు రోజులకే మరో పులి కళేబరాన్ని అధికారులు గుర్తించారు.
రెండు రోజుల వ్యవధిలోనే రెండు పులులు మృత్యువాత పడడం అటవీ శాఖ, జిల్లా ప్రజలను ఉలిక్కి పడేలా చేసింది. పీపీసీఎఫ్ గోబ్రియల్, అడిషనల్ పీపీఎఫ్ పెరిగాయల్, సీపీఎఫ్ శాంతారం, డీఎఫ్వో నీరజ్కుమార్, ఎన్టీసీఎఫ్ ప్రతినిధి ఇమ్రాన్ ఘటనాస్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. చనిపోయిన పశువుపై విషం చల్లడంతో.. ఆ మాంసాన్ని తిన్న పులి చనిపోయిందని అధికారులు ప్రకటించారు. ఈ మేరకు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.
వరుసగా రెండుపులుల మృతి అటవీ శాఖ వైఫల్యాలను ఎత్తి చూపుతున్నది. ఎస్15, ఎస్9 పులుల మరణం అటవీ అధికారుల పర్యవేక్షణాలోపాన్ని చూయిస్తున్నది. రెండేళ్ల క్రితం ఎస్6 పులి నాలుగు పిల్లలకు జన్మనివ్వగా, ఇందులో ఒకటి గతంలోనే చనిపోయింది. మిగతా పిల్లలు ఎక్కడ ఉన్నాయనేది ఇప్పటివరకు తెలియదు. అయితే 8 నుంచి 10 వర కు పులులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నాయని గతంలో అధికారులు ప్రకటించారు. వాటి సంతతి 30 వరకు పెరిగిందని భావిస్తున్నారు.
అవి ఎక్కడ ఉన్నాయనే సమాచారాన్ని మాత్రం అధికారులు ఇప్పటివరకు ధ్రువీకరించడం లేదు. గోప్యతా కారణాలు చూపుతూ, జిల్లాలో ఎన్ని పులులు ఉన్నాయ నే విషయాన్ని కచ్చితంగా వెల్లడించడం లేదు. జిల్లా లో కాగజ్నగర్ కారిడార్ 9, 745 హెక్టార్ల పరిధిలో విస్తరించి ఉంది. ఇక్కడ ప్రస్తుతం పది వరకు పులు లు ఉన్నాయి. అయితే పాత పులులే ఇక్కడ జత కడుతున్నాయి. కొత్తగా వచ్చిన పులులు ఇక్కడ ఇమడలేక, సరైన ఆవాసం, కావాల్సిన జత కుదరక తిరిగి వేరే ప్రాంతాలకు వెళ్తున్నాయి. అయితే ఈ పులుల సంచారంపై అటవీ అధికారులు పూర్తిస్థాయిలో పర్యవేక్షించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం కాగజ్నగర్ కారిడార్లోనే పులుల సంచా రం కనిపిస్తోంది. మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల నుంచి పులులు 12 మార్గాల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశిస్తున్నాయి. కొన్ని ప్రాణహిత నదిని దాటి ఇంద్రావతి, తడోబా అభయారణ్యాలకు వెళ్తున్నాయి. కానీ కవ్వాల్ అభయారణ్యం వైపు వెళ్లడం లేదని తెలుస్తున్నది.
బొగ్గుగనులు, ప్రాజెక్టులు, పరిశ్రమల అడ్డంకుల కారణంగా వాటిని దాటుకొని పులులు కవ్వాల్ వైపు వెళ్లడం లేదు. ఇంద్రావతి, తడోబా నుంచి కవ్వాల్ కు వెళ్లే మార్గాల్లో 18 బొగ్గు గనులు, కాజీపేట బల్లార్ష రైల్వేలైన్, కుమ్రం భీం ప్రాజెక్టు అడ్డుగోడగా మారాయి. కాగజ్నగర్ కారిడార్లో 400 వరకు గ్రామాలు ఉన్నాయి, ఆసిఫాబాద్- ఉట్నూర్ కు రెండు వరుసల రహదారి, మంచిర్యాల- చంద్రాపూర్ రోడ్డు కూడా పులుల కవ్వాల్లోకి వెళ్లకుండా ఆటంకంగా మారింది.