దృష్టిలోపాలను నివారించి.. అంధత్వ రహిత తెలంగాణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న ‘కంటి వెలుగు’ పేదల బతుకుల్లో కొత్త కాంతులు నింపుతున్నది. జనవరి 18న అట్టహాసంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఉత్సాహంగా కొనసాగుతుండగా, అనూహ్య స్పందన వస్తున్నది. మొదటి దశ విజయవంతంగా పూర్తి చేసిన వైద్యారోగ్య శాఖ.. రెండో విడుతలోనూ అదే లక్ష్యంతో ముందుకెళ్తున్నది. చిన్న పిల్లలు మొదలుకొని.. వృద్ధుల వరకు శిబిరాలకు తరలివస్తుండగా, సిబ్బంది పరీక్షలు చేసి మందులతో పాటు కళ్లద్దాలు అందిస్తున్నది. అవసరమైన వారికి శస్త్ర చికిత్సలు చేస్తున్నది. ఇక రూపాయి ఖర్చులేకుండా ఉచితంగా సేవలందిస్తూ భవిష్యత్కు భరోసానిస్తున్న బీఆర్ఎస్ సర్కారుకు ఆయా వర్గాలు దీవెనలందిస్తున్నాయి.
– ఆదిలాబాద్/నిర్మల్(నమస్తే తెలంగాణ), మార్చి 21
మంచిర్యాల, మార్చి 21 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ‘కంటి వెలుగు’ పేదల జీవితాల్లో వెలుగులు నింపుతున్నది. మొదటి విడుతలో కార్యక్రమం విజయవంతం కాగా, రెండో విడుతలోనూ అదే ఉత్సాహంతో కొనసాగుతున్నది. 18 ఏళ్ల వయసు దాటిన వారందరి కంటి సమస్యలు పరిష్కరిస్తూ ముందుకు సాగుతున్నది. జనవరి 18 నుంచి ఇప్పటి వరకు జిల్లాలో 2,49,666 మందికి పరీక్షలు నిర్వహించారు. మొత్తం 311 గ్రామ పంచాయతీలుండగా, ఇప్పటికే 183 పంచాయతీల్లో పరీక్షలు పూర్తయ్యాయి. జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పరిధిలో 92 వార్డుల్లో కంటి వెలుగు శిబిరాలను నిర్వహించారు. ప్రస్తుతం 27 పంచాయతీలు, 13 వార్డుల్లో శిబిరాలు కొనసాగుతున్నాయి. మొ త్తంగా 88,680 మందిలో కంటి సమస్యలను గుర్తించారు. 48,836 మందికి రీడింగ్ గ్లాస్లు అందజేశారు. 41,418 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరముందని గుర్తించారు. ఇందులో ఇప్పటికే 15,677 మందికి అందజేశారు.
నిర్మల్ జిల్లాలో..
నిర్మల్, మార్చి 21(నమస్తే తెలంగాణ) : జిల్లాలో మొత్తం 100 రోజుల పాటు కంటివెలుగు కార్యక్రమాన్ని నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు రోజుకు 32 శిబిరాల చొప్పున 50 రోజుల పాటు నిర్వహించారు. మరో 50 రోజుల పాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు 1,60,247 మందికి పరీక్షలు చేశారు. వీరిలో 24,642 మందికి దగ్గరి చూపు సమస్య ఉన్నట్లు గుర్తించి, రీడింగ్ గ్లాసులను పంపిణీ చేశారు. 24,900 మందికి మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరమని గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు 12,0,20 మందికి అద్దాలు పంపిణీ చేశారు.
ఆదిలాబాద్ జిల్లాలో..
ఆదిలాబాద్, మార్చి 21 ( నమస్తే తెలంగాణ) : జిల్లాలో కంటి వెలుగు కార్యక్రమానికి విశేష స్పందన వస్తున్నది. జిల్లా వ్యాప్తంగా 33 వైద్య బృందాలను ఏర్పాటు చేయగా, 27 బృందాలు గ్రామీణ ప్రాంతాల్లో, 6 బృందాలు పట్టణంలోని వివిధ వార్డుల్లో విధులు నిర్వహిస్తున్నాయి. రోజూ 4 వేల నుంచి 5 వేల వరకు పరీక్షలు చేస్తున్నారు. అవసరమైన వారికి మందులు, అద్దాలు పంపిణీ చేయడంతో పాటు ఇతర అద్దాల కోసం రెఫర్ చేస్తున్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 1,82,747 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. 23,795 మందికి రీడింగ్ గ్లాస్లు పంపిణీ చేశారు. 25,566 మందికి ప్రిస్క్రిప్షన్ అద్దాలు అవసరమని గుర్తించారు. ఇందులో ఇప్పటి వరకు 8,008 మందికి అందజేశారు.
రూపాయి ఖర్సుకాలె
రెండేండ్ల కింద కండ్లు సరిగా కనిపించక ప్రైవేట్ దవాఖానకు పోయిన. డాక్టర్ పరీక్షలు చేసి దూరం సూపు పోయిందని సెప్పిండు. మందులు ఇచ్చిండు. కండ్లద్దాలు ఇచ్చిండు. రూ. 2 వేల దాకా ఖర్సయినయ్. కొన్ని రోజులకే అవి ఖరాబైనయ్. మళ్లా పోదామంటే పైసలు దొరుకలే. కూలీ పనులు కూడా బంజేసిన. సీఎం కేసీఆర్ సార్ ఇచ్చే వితంతు పింఛన్తోనే బతుకుతన్న. ఇంతల్నే మా కాలనీలో కంటి వెలుగు శిబిరం పెట్టిన్రని చెబితే మొన్ననే పోయి సూపించుకున్న. డాక్టర్లు పరీక్షలు చేసిన్రు. అద్దాలు పెట్టుకోవాలని చెప్పిన్రు. 15 రోజుల్లో వస్తాయని చెప్పిన్రు. మందులిస్తే తీసుకొని వచ్చిన. రూపాయి ఖర్సు కాలె. గీ సర్కారోళ్ల దయతో ఇగ నా కంటి తిప్పలు పోయినట్లే..
– సూర రాజమ్మ, ఒడ్డెర కాలనీ, మంచిర్యాల
ప్రైవేట్కు పోతే డబ్బులు ఖర్చయ్యేటివి
నిర్మల్ చైన్గేట్, మార్చి,21 : నిర్మల్ పట్టణంలోని టైలరింగ్ షాపులో పనిచేస్తున్న. బట్టలు కుట్టేటప్పుడు, చదివేటప్పుడు కండ్లు మసకగా కనిపిస్తున్నాయని కంటి వెలుగు శిబిరానికి పోయి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్లు చూసి దగ్గరి చూపు అద్దాలిచ్చారు. ఇప్పుడు కళ్లు మంచిగ కనిపిస్తున్నయ్. అదే ప్రైవేట్ దవాఖానకు పోతే రెండు మూడు వేల రూపాయల దాకా ఖర్చు అయ్యేటివి.
– ఎస్. బాలస్వామి, టైలర్, నిర్మల్
పేదలకు మేలు
నిర్మల్ చైన్గేట్, మార్చి, 21 : నేను బీడీలు చుడుతూ ఉపాధి పొందుతున్న. అదేపనిగా చూడడం వల్ల కళ్లు మసకగా కనపడుతున్నయి. సర్కారోళ్లు మా కాలనీలో కంటివెలుగు శిబిరం ఏర్పాటు చేశారు. పోయి పరీక్షలు చేయించుకున్న. ఉచితంగా పరీక్షలు చేసి అద్దాలు అవసరమని చెప్పారు. 10 రోజుల్లో ఇంటికే వచ్చి ఇస్తమన్నరు. ప్రభుత్వం తీసు కున్న నిర్ణయం వల్ల పేదలకు మేలు జరుగుతుంది. ఇంతమంచి ఆలోచన చేసిన సీఎంకు ధన్యవాదాలు.
– దార్వేసి లక్ష్మి, బీడీ కార్మికురాలు, నిర్మల్
విజయవంతంగా నిర్వహిస్తున్నాం
కంటి వెలుగు శిబిరాల కోసం జిల్లాలో 40 బృందాలు పనిచేస్తున్నాయి. అన్ని మున్సిపాలిటీలు, గ్రామ పంచాయతీల్లో కార్యక్రమాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్నాం. ఇప్పటికే అందరికీ రెండు నెలల జీతాలు ఒకేసారి చెల్లించాం. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎప్పుడు వెళ్లినా శిబిరాల్లో పరీక్షలు చేయించుకునేలా ఏర్పాట్లు చేశాం.
– సుబ్బారాయుడు, డీఎంహెచ్వో, మంచిర్యాల
రూపాయి ఖర్సు కాలే..
కండ్లు సరిగా కనిపిస్తలేవని కొన్ని రోజుల కింద డాక్టర్ దగ్గరకు పోయి సూపించుకున్న. డాక్టర్ పరీక్షలు చేసి దూరం సూపు పోయిందని చెప్పిండు. అద్దాలు, మందులు రాసిచ్చిండు. రూ. 2500 దాకా ఖర్సయినయ్. ఆ తర్వాత అద్దాలు పగిలిపోయినయ్. మళ్లా దవాఖానకు పోదామనుకుంటే పైసలు లేకుండే. రేపు.. మాపు.. అనుకంట వచ్చిన. ఇంతల్నే సీఎం కేసీఆర్ సార్ పెద్ద కొడుకోలె ‘కంటి వెలుగు’ తీసుకొచ్చి ఆదుకున్నడు. మొన్ననే పోయి సూపించుకున్న. పరీక్షలు చేసిన్రు. మందులు ఇచ్చిన్రు. 15 రోజుల వరకు అద్దాలు పంపిస్తమన్నరు. రూపాయి కూడా ఖర్సు కాలే. ఈ కాలంలో అయినోళ్లే దగ్గరకు వస్తలేదు. మాలాంటోళ్లకు కేసీఆర్ దేవుడైండు.
– సూరం లక్ష్మి, వికాస్నగర్, మంచిర్యాల
బీడీలు చుట్టేటప్పుడు వాడుతున్న
మూడేళ్ల కింద తలనొప్పి వచ్చింది. డాక్టర్కు చూపించుకున్న. నొప్పి తగ్గలేదు. కంటి డాక్టర్ దగ్గరికి పోతే పరీక్షలు చేసిండు. రూ.1000 ఫీజు తీసుకుని జీరో పాయింట్ అద్దాలు ఇచ్చిండు. అవి యేడాదైనా తిరగకముందే పాడైపోయినయ్. మళ్లీ కొనలేదు. ఇప్పుడు మా వాడ దగ్గర పెట్టిన కంటి వెలుగు శిబిరానికి పోయి పరీక్షలు చేయించుకున్న. డాక్టర్ పరీక్ష చేసి గవ్వే అద్దాలిచ్చిండు. బీడీలు చుట్టేటప్పుడు గవ్వే అద్దాలు వాడుతున్న.
– ఎన్.శ్యామల, బీడీ కార్మికురాలు, క్రాంతినగర్, ఆదిలాబాద్