ప్రభుత్వ బడుల్లో సకల సౌకర్యాలు కల్పించి నిరుపేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించడమే లక్ష్యంగా సర్కారు అనేక సంస్కరణలు చేపడుతున్నది. అందులో భాగంగా యేటా కస్తూర్బాలను అప్గ్రేడ్ చేస్తుండగా, ఈ యేడాది మరో నాలుగింటిపై దృష్టి పెట్టింది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం సిరికొండ, మంచిర్యాల జిల్లా నస్పూర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెంబీలలోని కేజీబీవీలను ఉన్నతీకరించి ఇంటర్మీడియట్ విద్యకు అవకాశం కల్పించబోతున్నది. ఆయా చోట్ల రెగ్యులర్తో పాటు ఉపాధి కోర్సులూ అందుబాటులోకి రానుండగా, సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది.
– మంచిర్యాల, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)
మంచిర్యాల, మే 12 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/నిర్మల్ అర్బన్ : ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నాలుగు కేజీబీవీలను ఇంటర్కు అప్గ్రేడ్ చేయబోతున్నది. గతేడాది వరకు పదో తరగతి ఉన్న కేజీబీవీల్లో ఇకపై ఇంటర్ విద్య అందనున్నది. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని సిరికొండ, మంచిర్యాల జిల్లా నస్పూర్, నిర్మల్ జిల్లా ఖానాపూర్, పెంబీలలోని కస్తూర్బాలు ఇంటర్మీడియట్కు అప్గ్రేడ్ కాబోతున్నాయి. గతేడాది మంచిర్యాల జిల్లా నెన్నెల, బెల్లంపల్లి కేజీబీవీలను అప్గ్రేడ్ చేయగా, అంతకుముందు భీమారం పాఠశాలను సైతం కళాశాలగా మారింది. ఇలా యేటా ఇంటర్మీడియట్ కోసం ఏదో ఒక కేజీబీవీని ప్రభుత్వం అప్డేట్ చేస్తూ వస్తున్నది.
ఇలా అప్గ్రేడ్ అయ్యే కేజీబీవీల్లో జనరల్, ఒకేషనల్ కోర్సుల్లో విద్యార్థినులను చేర్చుకుంటారు. ఒక్కో దగ్గర రెండు జనరల్ కోర్సులు, ఒక ఒకేషన్ కోర్సు చొప్పున మూడు కోర్సులు వచ్చే అవకాశం ఉంది. ఎంపీసీ, బైపీసీ, సీఈసీతో పాటు ఒకేషనల్ కోర్సు అందుబాటులో ఉంటాయి. లోకల్ డిమాండ్ను అనుసరించి కోర్సుల నిర్వహణ ఉంటుంది. అలా కోర్సుకు 40 మంది చొప్పున విద్యార్థులకు సీట్లు కేటాయిస్తారు. ఆయా పాఠశాలల్లో ఇప్పటికే 10 తరగతి పూర్తి చేసిన విద్యార్థినులతో పాటు కొత్తవారికీ అవకాశం కల్పించనున్నారు. కుటుంబ వార్షిక ఆదాయం గ్రామాల్లో రూ.1,50,000, పట్టణాల్లో రూ.2 లక్షలలోపు ఉన్న వారెవరైనా సరే దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. కోర్సులు, అందుబాటులోకి రానున్న సీట్ల వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని కేజీబీవీ అధికారులు తెలిపారు.
సర్వత్రా హర్షం
రాష్ట్ర ప్రభుత్వం కేజీబీవీలను అప్గ్రేడ్ చేయడంపై ఉపాధ్యాయులు, అధ్యాపకులతో పాటు తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కార్పొరేట్కు దీటుగా రూపాయి ఖర్చు లేకుండా ఇక్కడ చదువుకునే అవకాశం కలుగుతుందని వారు చెబుతున్నారు.
సంతోషంగా ఉంది..
మా కేజీబీవీ అప్గ్రేడ్ అవుతున్నందుకు సంతోషంగా ఉంది. కొత్త కోర్సులు వస్తే 80 మంది విద్యార్థినులు అదనంగా చేరుతారు. ఇంటర్మీడియట్ చదువుకునే స్థోమత లేక ఇబ్బందులు పడే, చదువు మధ్యలో ఆపేసే విద్యార్థినులకు ఇది వరం. ఎన్ని సీట్లు వస్తే అంత మందికి హాస్టల్ వసతి కూడా కల్పిస్తాం. పూర్తిస్థాయి ఉత్తర్వులు వచ్చాక మరిన్ని వివరాలు వెల్లడిస్తాం.
– మౌనిక, నస్పూర్ కేజీబీవీ ఎస్వో
ఇది గొప్ప విషయం
బాలికల విద్యను మరింత బలోపేతం చేసేందుకు ప్రభుత్వం కేజీబీవీలను కళాశాలలుగా అప్గ్రేడ్ చేయడం గొప్ప విషయం. ఈ నిర్ణయంతో నిరుపేద విద్యార్థినులకు మేలు చేకూరుతుంది. కేజీబీవీలు కార్పొరేట్ పాఠశాలలు, కళాశాలలకు ఏమాత్రం తీసి పోకుండా రాష్ట్ర స్థాయిలో ర్యాంకులు సాధిస్తున్నాయి.
– శ్రీదేవీ. సెక్టోరియల్ అధికారి నిర్మల్